స్త్రీ సమస్తం పురుష పీడన పరాయణత్వం
వందల సంవత్సరాల కాలం ఎలా దొర్లిపోతుంది అంటే స్త్రీ స్వేచ్ఛని హరిస్తూ అని చెప్పవచ్చు. శిథిలమైన శిల్పాలు కూడా చరిత్రకెక్కి మరీ ఓ స్త్రీ నీకు స్వేచ్ఛ లేదని నినదిస్తుంది.
బలం -బలహీనత ఎప్పుడు సమఉజ్జీలై పోరాడుతూనే ఉన్నాయి.
ఈ పోరాటం కాలమాన పరిస్థితిలో ఏదైనా, ఏ సమాజమైనా, నువ్వు ఏ సామాజికతలో పుట్టావు అన్నదే ప్రమాణం కావడం మన సంస్కృతి. ఈ సంస్కృతిలో హింసకు ప్రేరేపిత వస్తువు స్త్రీ.
ఏ వర్గం, ఏ జాతి అయినా తమ గెలుపును ప్రకటించుకోవడానికి వారి ఆయుధం “స్త్రీ”నే వారి ఆయువుపట్టు. అందువల్లే అణిచివేయబడ్డ బలహీన వర్గాలలో ఈ హింసను వేయిచేతుల అనుభవించేది కూడా స్త్రీ నే.
ఓ తల్లి మానం నుండి బయటపడ్డ వాడు…
రొమ్ము పాలు తాగి పెరిగిన వాడు,
ఒక స్త్రీకి ఆచ్ఛాదన ఉండాలా? వద్దా? అని నిర్ణయించే గమ్మత్తు సంస్కృతి మనది. ఇంతటి సంస్కృతిని భుజాన మోస్తూ ఆ భుజాలపైన వస్త్రం వేసుకోవాలా వద్దు అన్న చర్చని లేవనెత్తిన మొదటి సామాజిక స్థితిగతులని కళ్ళకు కట్టినట్టు చూపిన మొగిలై రాజ పాండియన్ గారి రచన ఓ కరుడుగట్టిన వ్యవస్థపై విజృంభించిన అక్షర ఆయుధం.
బలహీన వర్గంలో మహిళలను అవమానించడంలో చరిత్రకెక్కిన ఘన చరిత్రలు, సంస్కృతులు కదా మనవి. ఈ పుస్తకం చదువుతున్నంత సేపు ఎందుకింతటి మానహాని, ఎందుకీ వర్గ వైశ్యామ్యాలు? ఏ ప్రయోజనాన్ని ఆశిస్తుందీ సమాజం అనే ప్రశ్నలు వేదనకు గురి చేస్తాయి.
1829వ సంవత్సరంలో జరిగిన సాంఘిక పరమైన మత మార్పులు కేవలం ఆత్మగౌరవాన్ని నిలుపుకునేందుకు ప్రజలు ఎన్నుకున్న మార్గం క్రైస్తవం. క్రింది వర్గంలో జీవించే మనుషులకు తమ యాదలను కప్పుకునే హక్కు లేని సంస్కృతి నుండి తమను మనుషులుగా గుర్తించి వారి వాటిపై బట్టలు వారి హక్కు అని చెప్పి బుజాలను కప్పుకునేందుకు ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి దేవుడిని ఆదరించి మతం మారడం అనేక రాజకీయపరమైన మార్పులకు కారణాలు అవుతాయి. సమాజంలో ఉన్నత వర్గంగా చెప్పుకొని తిరిగేవారు అణిచివేయబడుతున్న ప్రజలపై చేసే పెత్తనం చేజారి పోతుందన్న భయంపుట్టడం జరిగినప్పుడు ప్రజల్లో అనేక వర్గ విభేదాలు మధ్య అణిచివేయబడుతున్న నాడార్ స్త్రీలు రవికని ధరించ కూడదని నాయర్ వ్యవస్థలో పురుష స్వామ్యవ్యవస్థ చేసిన దాడి ఎంత అమానుషంగా ఉందో చూపిస్తుంది ఈ పుస్తకం.
వస్త్రం వంటిపై పై వస్త్రంగా ఉండాలా వద్దా అని నిర్ణయించడానికి రాచరికి వ్యవస్థ అనుమతికి కట్టుబడి ఉండడం మన మూలాల చరిత్ర. నడుము కిందకు మాత్రమే కట్టుకునేందుకు అనుమతి ఉన్న సమాజం కింద జాతి స్త్రీ. ఇలా కులం పేరిట దూషణకే కాదు శారీరకంగా కూడా దోచుకోపడుతుంది పై జాతి వారు తమ బలాన్ని నిరూపించుకోవడానికి ఎన్నో సందర్భాలలో కింది కులాల స్త్రీలను అత్యాచారం చేయడం ఒక్కటే మార్గం అని అనుకునే మూర్ఖపు సమాజపు రీతిని ఎండగడుతుంది ఈ పుస్తకం.
రాచరిక వ్యవస్థ మొత్తము దైవంతో సమానమని, పై జాతి వారు అంటే దేవుళ్ళం టూ, అధికార యంత్రాంగం లో పనిచేసే నాయర్ స్త్రీలు కూడా రాజులు పై అధికారులు వచ్చినప్పుడు ఆ ఉన్నత వర్గపు స్త్రీలు కూడా పై వస్త్రాన్ని తొలగించి నడుముకు కట్టుకోవాలి అనే సామాజిక స్థితి ఉండేది.
తమిళ రచయిత ముగిలై రాజపాండియన్ ఇలా 19వ శతాబ్దంలో కింది జాతి స్త్రీలు పై బట్ట ధరించకూడదన్న చట్టం ఉందని తెలిసి చరిత్ర మూలాల్ని అధ్యయనం చేసి, ఆనాటి జరిగిన సంఘటనల ఆధారంగా స్త్రీలు జరిపిన పోరాటాన్ని 17 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఈ “అలల కాలం” పుస్తకం రాసారు. ఆ కాలాన్ని బానిసల కాలంగా జరిగిన అనేక రాజకీయ మార్పులను మారుతున్న మనుషుల చరిత్రలను అతి కొద్ది అక్షరాల్లోనే నవలగా అందించారు. తమిళ మూలానికి డాక్టర్ ఎస్ కార్తీక్ చక్కని తెలుగు అనువాదం అందించారు. వీరి అనువాదం ఎక్కడ మనకు ఇతర భాష నుండి అనువదించబడిన అనుకరణలా అనిపించదు.
ఈ పుస్తకం ఆనాటి స్త్రీ పోరాట కాలాన్ని తెలియజేయడమే కాక నేటి వ్యవస్థకు అద్దం పడుతున్న అనేక సామాజిక స్థితుల్ని వేలెత్తి చూపిస్తుంది.
. …..
పుస్తకం: అలల కాలం
మూలం: ముగిలై రాజపాండియన్
అనువాదం: డాక్టర్ ఎస్ కార్తీక్
ప్రచురణ : ఎన్నెలపిట్ట































