సినీ కవి – శ్రీరంగం శ్రీనివాసరావు
తెలుగు సాహిత్యంలో ఎప్పటికీ ఓ ప్రభంజనం శ్రీరంగం శ్రీనివాసరావు. అంటే మన శ్రీ శ్రీ. ఈ ప్రపంచంలో ఎందరో గొప్ప కవులు, కథకులు, సాహిత్యకారులు, గొప్ప రచనలను చేసి ఉండవచ్చు. కాని ఎప్పుడయితే వారి రచన ఓ సామాన్య వ్యక్తి జీవితాన్ని మార్గనిర్దేశకం చేస్తుందో, ఓ బలహీన వ్యక్తి జీవన ప్రయాణంలో శక్తిగా మారుతుందో, అప్పుడే దాని ప్రయోజనం నెరవేరుతుంది. కళాకారుల సామాజిక హోదా, సాహితీ ప్రపంచంలో వారి స్థానం, సంపాదించుకున్న పేరు, బిరుదులు ఇవి వారి అహాన్ని తృప్తి పరుస్తాయేమో కాని వారి సాహిత్య విలువను పెంచవు. తాత్కాలిక పేరు, గుర్తింపు కోసం నిజమైన సాహితీకారులు వెంపర్లాడరు. వారి కలం నిస్సహాయులకు బలం చేకూర్చడానికి కదులుతుంది. అందుకోసమే పని చేస్తుంది. సన్మానపత్రాల కోసం, మేధావులనబడే వారి ఆమోదం కోసం రాజీ పడదు. ఏ రంగంలో పని చేస్తున్నా విలువలను మరవదు. మనిషి జీవన ప్రమాణాన్ని మెరుగు పరచడానికే నిరంతరం పని చేస్తుంది.
తెలుగు సాహిత్యం శ్రీ శ్రీ ముందు శ్రీ శ్రీ తర్వాతగా విశ్లేషించుకోవాలి అని చాటి చెప్పిన ఆయనలో అహాన్ని చూసారు చాలా మంది. భాషా పోరాటాలు, రాష్ట్ర పోరాటాలలో భాగంగా ఆయనను కొందరు మా వాడంటూ రాజకీయం ఆడబోతే, మరికొందరూ మీవాడంటూ విమర్శించారు. నిజానికి శ్రీ శ్రీ కాలంలోనే ఆయన్ని ఓన్ చేసుకుని రాజకీయం నడిపించిన వర్గాలున్నాయి. ఆయన మరణం తర్వాతి ఘటనలు విన్న తర్వాత ఒకప్పటి హిందీ భక్తి కాలం కవి కబీర్ అంతక్రియల గురించి చెప్పుకునే కథనాలు గుర్తుకు వస్తాయి. కబీర్ హిందువని, కాదు ముస్లిం అని మా సాంప్రదాయాల్లో అంతక్రియలు చేయాలని హిందూ ముస్లింలు ఆయన శవం ముందే కొట్టుకు చచ్చారు. ఇప్పటికీ మగహర్ లో ఆయనకు ఒకే ప్రాంగణంలో రెండు సమాధులు కట్టి ఉంటాయి. హిందూ ముస్లింలు ఒకటే అని జీవితాంతం బోధించిన ఆ మహానుభావుడికి మనం ఇచ్చిన కానుక అది. మగహర్ వెళ్ళినప్పుడు చూసిన ఆ రెండు సమాధులు నన్ను నేటికీ కలవరపెడుతూనే ఉన్నాయి.
శ్రీ శ్రీ అంతక్రియలను స్వయంగా చూసిన వారు చెప్పిన అరస విరస శవ రాజకీయాలను తెలుసుకున్నాక సాహితీకారులంటేనే విరక్తి కలిగింది. కాని ఈ రోజుకీ తెలుగు సాహిత్యం చర్చ శ్రీ శ్రీ లేకుండా సాగదు. ఎన్నో రాజకీయాల నడుమ ఎంతో సాహితీ స్వార్ధం నడుమ తాగుబోతు, అగ్ర కుల కవి, వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ లేని వ్యక్తి అంటూ కొందరు పనిగట్టుకుని విమర్శించినా, ఎన్ని స్వార్ధ కుటిల రాజకీయాలు ఆయన మరణానంతరం కూడా ఆయాన చుట్టూ చేరి ఆడినా, ఎందుకని ఎవరూ కదిలించలేనంత సుస్థిరంగా నిలిచి ఉన్నాడు శ్రీ శ్రీ. ఎందుకంటే ఆయన కలం నిజాయితీ అనే సిరాతో కదిలింది. ఏ ప్రలోభాలకు లొంగకుండా కేవలం తాను నమ్మిన సిద్దాంతాల కోసమే పని చేసింది. ఆయనను ఆ రోజు మోసింది, ఇప్పుడు మోస్తుంది సామాన్య బడుగు జనమే.
శ్రీ శ్రీ రాసిన ప్రేరణాత్మక కావ్యాలు, రచనల గురించి చాలా మంది గొప్ప విశ్లేషకులు వారి పంథాలో వివరిస్తూనే వచ్చారు. కాని ఆయన్ని ఓ సంపూర్ణ సినీ కవిగా ప్రస్తావించడం మాత్రం అరుదు. ఉద్యమ స్పూర్తి నింపే శ్రీ శ్రీ పాటలు ప్రస్తావించినంతగా ఆయన సినీ కవిత్వ సౌరభాలను చర్చించిన సందర్భాలు తక్కువ. ఒకొక్కటిగా శ్రీ శ్రీ గారి సినీ గీతాలను వింటున్నప్పుడు అందులోని సాహితీ లోతులు ఆశ్చర్యపరుస్తాయి. ప్రపంచానికి శ్రీ శ్రీ విప్లవ కవి మాత్రమే. ఆ కోణంలో నుండి తప్ప చూడలేని పాఠకులు చాలా మంది శ్రీ శ్రీలోని ఆ మృదు గంభీర హృదయ లోతులను ఆవిష్కరించిన సినీ సాహితీ పరిమళాలను విస్మరిస్తారు. కొన్ని సార్లు అది శ్రీ శ్రీ గీతం కాదు అంటూ కొట్టిపడేస్తారు. “పతితులార బ్రష్టులారా”, “ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం” అంటూ రాసిన శ్రీ శ్రీలోని ఆ విప్లవ సాహిత్యం వద్దే ఫ్రీజ్ అయిపోయిన సాహితీ ప్రియులు, శ్రీ శ్రీ లోని ఆ మహోన్నత మానవ ప్రేమతో పాటు, ప్రకృతి, స్త్రీ పురుష ప్రేమ, ఆదరణ, అనుభూతులను వ్యక్తీకరించే ఓ సున్నిత హృదయాన్ని విస్మరిస్తారు. క్యూబా విప్లవకారుడు చే “నిజమైన విప్లవకారుడిని నడిపించేది గొప్ప ప్రేమ భావన” అన్నారు. శ్రీ శ్రీ సినీ గీతాలను పరిశీలిస్తే ప్రతి చరణం ఈ మాట నిజమని నిరూపిస్తూ ఉంటుంది. అందుకే ఆ నిజమైన విప్లవకారుడిని దర్శించుకోవడానికి ఆయన సినీ గీతాలను పరిశీలిద్దాం.
శ్రీశ్రీ సినీ గీతాలు- 1
చిత్రం : వెలుగు నీడలు (1961) సంగీతం : పెండ్యాల
గీతరచయిత : శ్రీశ్రీ నేపథ్య గానం : ఘంటసాల
ఆంగ్ల రచయిత ఓ హెన్రీ “ది లాస్ట్ లీఫ్” అనే ఓ కథ రాసారు. ప్రపంచ సాహిత్యంలోనే అతి గొప్ప సృష్టి అని ఎందరో ప్రస్తావించిన ఈ కథ కళ యొక్క ప్రయోజనాన్ని చర్చిస్తుంది. నిజానికి ఏ కళారూపమయినా మనిషి జీవితాన్ని మెరుగుపరచడం కోసమే సృష్టింపబడాలి. మనిషి జీవననాణ్యతను ఉన్నతం చేయగలగాలి. శ్రీ శ్రీ రాసిన ఎన్నో సినీ గీతాల నడుమ ఈ పాటను నేను ప్రప్రధమంగా ప్రస్తావించడానికి నా వ్యక్తిగత అనుభవం కూడా కారణం. జీవితంలో నిరాశకు లోనయి ఉనప్పుడు జీవితాంతం నాది ఒంటరి ప్రయాణమే అని అర్ధం అయినప్పుడు, అన్ని భవబంధాలు స్వప్రయోజనం కోసమే పని చేస్తున్నాయి అని, నాతో తోడుగా నిలిచేది నా హృదయం మాత్రమే అని అర్ధం అయినప్పుడు ఓ అసహాయ స్త్రీగా, ప్రపంచ స్వార్ధానికి, నా అనుకున్న వారి మోసానికి దెబ్బ తిన్న హృదయంతో గాయాలు ఓడుతూ మరణాన్ని కోరుకుంటున్న రోజుల నుండి, ఇప్పటి నా స్వీయ పోరాటంలోనూ నాకు తోడుగా నిలిచిన గీతం ఇది.
ఓ హెన్రీ ‘లాస్ట్ లీఫ్’ లోని ముసలి చిత్రకారుడు, మరణానికి లోంగిపోవడానికి సిద్దపడ్డ ఓ స్త్రీకోసం ఓ ఆకు గోడపై చిత్రీకరిస్తే దాన్ని చూస్తూ ఆమె ఎలా బలాన్ని తెచ్చుకుందో, నిరాశావాదం నుండి బైటపడిందో, అదే రీటిలో ఈ గీతంలోని వాక్యాలను మళ్లీ మళ్ళీ స్మరించుకుంటూ నాలో బలాన్ని నింపుకుంటూ ఇక్కడి దాకా ప్రయాణించాను. నా చుట్టూ పరిస్థితులలో పెద్ద మార్పు లేదు. అవే మనుషులు, అవే స్వార్ధాలు, కాని అవి ఇప్పుడు నన్ను భయపెట్టవు, అశక్తురాలిని చేయలేవు. వాటిని మోసాలుగా కాక జీవితపు సవాళ్లుగా స్వీకరించగల శక్తి ఈ గీతం నాకిచ్చింది. నా దృష్టిలోఈ పాట జీవితంలో నిరాశతో కూరుకుపోతున్న ఎందరికో శ్రీ శ్రీ గారందించిన ‘లాస్ట్ లీఫ్’. నిజమైన ఓ మాస్టర్ పీస్.
కలకానిది.. విలువైనది..
బ్రతుకు.. కన్నీటి ధారలలోనే బలి చేయకు
కలకానిది.. విలువైనది..
బ్రతుకు.. కన్నీటి ధారలలోనే బలి చేయకు
(జీవితం కరిగిపోయే కల కాదు. మనిషికి దొరికే విలువైన అవకాశం. దాన్ని కన్నీళ్ళతో బలి చేయడం తప్పు)
గాలి వీచి పువ్వుల తీగ నేల వాలిపోగా
గాలి వీచి పువ్వుల తీగ నేల వాలిపోగా
జాలి వీడి అటులే దానీ వదలివైతువా
చేరదీసి నీరు పోసి.. చిగురించనీయవా
కలకానిది.. విలువైనది..
బ్రతుకు.. కన్నీటి ధారలలోనే బలి చేయకు
జీవితపు విలువను తెలుపుతూ ఆయన ఇచ్చిన ఈ ఉదాహరణ ఎంత గొప్పగా ఉంటుందంటే, మనం బలహీన పడినప్పుడు మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ, నీ దగ్గరకు వచ్చే సరికి ఎందుకింత నిరాశ అని కవి ప్రశ్నించడంలో ఎంత జీవితానుభవం ఉందో గమనించండి. పూలతీగ సుడిగాలికి నేల మీద వాలిపోతే దాన్ని ఆలాగే వదిలేస్తామా, దాన్ని సరి చేసి అది చిగురించేలా చూడమా, అది కదా మానవ జీవితపు కర్తవ్యం. మరి పూలతీగ పట్లే అంత సున్నితత్వం అలవరుచుకున్న నువ్వు నీ జీవితం పట్ల ఎలాంటి బాధ్యత వహిస్తున్నావు? నీ జీవితం కష్టాల సుడిగుండంలో పడ్డప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటీ? దాన్ని అలాగే వదిలేస్తావా? నీ కర్తవ్యం ఏంటీ? కన్నీటితో జీవితాన్ని బలి చేసుకుంటావా?
అలముకున్న చీకటిలోనే అలమటించనేలా
అలముకున్న చీకటిలోనే అలమటించనేలా
కలతలకే లొంగిపోయి.. కలవరించనేల
సాహసమను జ్యోతిని.. చేకొని సాగిపో
కలకానిది.. విలువనది..
బ్రతుకు.. కన్నీటి ధారలలోనే బలి చేయకు
జీవితంలో చీకటి అలుముకుందని కుములుతూ కూర్చుండిపోతావా? వచ్చిన కష్టాలకు లోంగిపోతావా? చీకటిని చిరుదీపంతో దూరం చేసుకునే కనీస ప్రయత్నం చేయాలి కదా. జీవనపోరాటంలో ఆ చిరుదీపమే సాహసం. దాన్ని వెలుగించుకుని ముందుకు సాగిపోవాలి కదా. మన ప్రయత్నం మనం చేయాలి కదా. లేకపోతే జీవితానికి ప్రయోజం ఏమిటి? మనుషులమంటూ చెప్పుకోవడం ఎందుకు?
అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే..ఏ..
అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే..ఏ..
ఏదీ తనంత తానై.. నీ దరికి రాదు
శోధించి సాధించాలి.. అదియే ధీరగుణం
కలకానిది.. విలువైనది..
బ్రతుకు.. కన్నీటి ధారలలోనే బలి చేయకు
ఇది ఎన్నో సార్లు నేను నాకు నాకు చెప్పుకునే ఓదార్పు. లోతైన సముద్రంలో మణులు దాగి ఉన్నట్లే, శోకాల నడుమ సుఖం ఉంటుంది అంటున్నాడు కవి. నిజానికి ఈ సుఖం అంత అనుభవంలోకి నాకు రాకపోయినా సుఖాలు అంత సులువుగా అందవని, అందులోనూ ఈ స్వార్ధ ప్రపంచంలో మన సూత్రాలతో జీవించాలనుకునే వ్యక్తులకు సుఖాలు అంత తొందరగా దరి చేరవని అర్ధం చేయించిన వాక్యాలు ఇవి. ఏదీ తనంతగా మన దగ్గరకు రాదు, ప్రతిదీ కష్టపడి సాధించలి, అదే దీరగుణం అన్న వాక్యం నాకు ఎంతో నమ్మశక్యంగా అనిపిస్తుంది. ముఖ్యంగా తేలికగా దొరికే సుఖాలను తృణీకరించి ముందుకు సాగిపోవడానికి, జీవితంలో ఎక్కడకు అక్కడ రాజీ పడకుండా తాత్కాలిక సుఖాలకు, ప్రలోభాలకు లొంగకుండా నన్ను నేను గట్టి పరిచుకోవడానికి అగాధంలో ఉండే మణులపై దృష్టి నిలుపుకుంటూ ఒంటరిగా సాగిపోవడానికి ఈ పాట నాలో ఎపటికప్పుడు శక్తిని నింపుతూ ఉంటుంది.
జీవితపు పోరాటంలో అలసిపోయే సామాన్య జీవితాలకు ఇలాంటి తేలికపదాలలో పొందుపరిచిన జీవిత సత్యాలే ఊరటగానూ బాసటగానూ నిలుస్తాయి. గ్రంధపఠనం, జీవిన సత్యాల సోధన అందరికీ సాధ్యం కాదు. నిత్య జీవన పోరాటంలో విద్వత్తుకై మేధోమధనం చేయగల అదృష్టం అందరికీ ఉండదు. నిత్య జీవన సమస్యల సుడిగుండంలో నుండి బైట పడడానికి అనుభవం రంగరించిన జీవిత సత్యాలను బోధించే కళా మాధ్యమాలను అందుకే సామాన్య జనం వెతుక్కుంటూ ఉంటారు. చాలా సందర్భాలలో సామాన్యులు మతాన్ని ఆశ్రయించేదీ అందుకే. ఏదీ దొరకనప్పుడు తాత్కాలిక పలాయన మార్గాలను సామాన్యులు స్వీకరిస్తారు. జానపద కళలు, సామాన్య జనానికి అందుబాటులో ఉండే సినీ సాహిత్యం వారికి ఆ జీవిత ప్రయాణంలో తోడుగా నిలుస్తే సమాజాన్ని ఎన్నో రుగ్మతలనుండి కాపాడు కోవచ్చు. ఆ దిశగా సినీ సాహిత్యాన్ని అందించిన వారిలో శ్రీ శ్రీ గారు ఒకరు. నా జీవన ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన శ్రీ శ్రీ గారి ఈ గీతం నాలాంటి ఎందరికో ఓదార్పుగా ఉండి ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను.
శ్రీ శ్రీ సినీ గీతాలు – 2
చిత్రం : మనుషులు మారాలి (1969) సంగీతం : K.V.మహదేవన్
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , పి.సుశీల
పుట్టిన రోజు గీతాలు తెలుగు సినీ ప్రపంచంలో చాలా వచ్చాయి. ఒకో కవి ఒకో కోణంలో ఈ పాటలను రచించారు. కాని శ్రీ శ్రీ ఈ సందర్భంలో రాసిన పాటలు విశిష్టంగా ఉంటాయి. పుట్టిన రోజంటే కేక్ కట్ చేయడం, అర్ధరాత్రి కేరింతలు, ఒకరిపై ఒకరు కేక్ విసురుకోవడాలు, స్థాయిని బట్టి పార్టీలు చేసుకోవడాలే గొప్ప అనుకునే సంస్కృతిలోకి ప్రవేశించాం అంతా. అలాంటి సందర్భాలలో ఈ పాట వింటున్నప్పుడు
మనలో లోపించింది ఏంటో అర్ధమయి అర్ధహీనమైన పుట్టినరోజు సంబరాల పట్ల జుగుప్స కలుగుతుంది. అసలు పుట్టిన రోజంటే ఏంటి అన్నదానికి రకరకాల అర్ధాలు ఇచ్చారు సాహితీకారులు. కాని శ్రీ శ్రీ మనిషి పుటుక విశ్వ పరిణామానికి గుర్తు అని, వ్యక్తి పుట్టిన రోజు వ్యక్తిగతం కాదని, యుగయుగాల మానవజాతి జీవన ప్రస్థానాన్ని గుర్తు చేసుకోవల్సిన సందర్భం అని వివరించినప్పుడు మనం ఎంత సంకుచిత సంబరాలలో ఆ రోజుని వ్యర్ధం చేసుకుంటున్నామో అర్ధం అవుతుంది. ఈ విశ్వంలో మనం ఒక రేణువు మాత్రమే, మన పుట్టుక ఎన్నో యుగాల చరిత్రకు కొనసాగింపని అర్ధం అయ్యాక, పుట్టిన రోజంటే మన సామాజిక, చారిత్రిక, నేపధ్యాలను స్మరించుకుంటూ మనం చారిత్రిక వారసత్వంగా వదిలి వెళ్ళబోయ
అంశాల నిర్మాణంలో మన పాత్రను పునరాలోచన చేసుకోవలసిన సందర్భం అన్న గ్రహింపు కలుగుతుంది.
సినిమాలో ఇది ఇద్దరు స్నేహితులు పుట్టినరోజు నాడు పాడుకునే పాటగా చిత్రీకరించారు. వాళ్లు స్నేహితులు మాత్రమే ప్రేమికులు కారు. అతను మరో స్త్రీని ప్రేమించాడు. ప్రేమ పట్ల, మనిషి జీవన విధానం పట్ల వారిద్దరి అభిప్రాయాలు వేరు. అవి ఈ పాటలో స్పష్టంగా ప్రకటితమవుతాయి. అంటే ఇది పుట్టినరోజు శుభాకాంక్షల గీతంగా మొదలయినా ఆ రెండు పాత్రల ఆలోచనసరళిలో వైవిధ్యాన్ని కూడా చూపిస్తుంది. మనం ఎప్పుడూ చూసే సినిమాలలోని సన్నివేశాలకు భిన్నంగా చిత్రీకరించిన గీతం ఇది. ప్రేమికులు కాని ఇద్దరు స్త్రీ పురుషులు, ఆమె పుట్టినరోజున
కలిసి సరదాగా గడిపే సందర్భంలో వచ్చే గీతం ఇది. దాన్ని శ్రీ శ్రీ గారు రచించిన విధానం అత్యంతాద్భుతం.
తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో
ఉదయరాగం హృదయగానం (2)
తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో
ఉదయరాగం హృదయగానం (2)
మరల మరల ప్రతి ఏడు మధుర మధుర గీతం జన్మదిన వినోదం (2)
తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో
ఉదయరాగం హృదయగానం (2)
జననం అంటే ఓ సరికొత్త మొదలు. ఓ కొత్త ఉదయం. అందుకే జన్మదినాన్ని తూరుపున ఆకాశంలో సింధూరపు, మందారపు రంగులతో ప్రారంభమయే ఉదయంగా వర్ణిస్తారు శ్రీ శ్రీ. శ్రీ శ్రీ సంపూర్ణంగా విప్లవకవి. ఎరుపు రంగు ఆయన నరనరాన ఇంకి ఉంది. విప్లవ కవి దృష్టిలో ఎరుపు చైతన్యానికి ప్రతీక. సూర్యోదయంలోని ఆ సింధూరపు మందారపు వన్నెలతో లోకం కొత్త వెలుగును ఆహ్వానిస్తుంది. ప్రపంచంలో చైత్యనం వెల్లివిరుస్తుంది. ఆ చైతన్యమనే ఉదయరాగం, హ్రుదయగానంగా మారడమే మనిషి జననం. మనిషి పుట్టడం అంటే కేవలం శరీరం రూపుదాల్చడం కాదు, చైతన్యం చిగురించడం. జననం అంటే చలనం కాదు చైతన్యం. అదే మనిషికి జంతువుకీ ఉన్న తేడా కూడా. మానవ
జాతిలో ఉద్భవించే ప్రతి కొత్త ప్రాణి, ఈ ప్రపంచంలోకి కొత్త ఆశను సరికొత్త చైతన్యాన్ని తీసుకొస్తుంది. ప్రతి సంవత్సరం వచ్చే జన్మదినాన్ని, ఆ నాటి వినోదాన్ని జీవితంలోని మధురమైన గీతంగా స్వాగతించాలని కవి చెప్తున్నప్పుడు జీవించడం అంటే ఏంటో వివరిస్తున్నట్లు అనిపిస్తుంది. జీవితం అంటే అనుభవాల సంగమం. చైత్యనంతో అలరారే మనిషి తన జీవితంలో ప్రతి జన్మదినాన్ని మధురమైన సంగీతంలా స్వాగతించాలి, ఆస్వాదించాలి. ఎంత అద్భుతంగా వివరించారు జననాన్ని, జన్మదిన సంబరాన్ని.
వేలవేల వత్సరాల కేళిలో మానవుడుదయించిన శుభవేళలో (2)
వీచె మలయమారుతాలు పుడమి పలికె
స్వాగతాలు
మాలికలై తారకలే మలిచే కాంతి తోరణాలు
తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో
ఉదయరాగం హృదయగానం
ఉదయరాగం హృదయగానం
మనిషి పుటుక గురించి ఇక్కడ శ్రీ శ్రీ వర్ణన అద్భుతంగా ఉంటుంది. ఈ చరణంలోని మొదటి వాక్యం నావరకు ఓ మాహాద్భుతమైన ప్రకటన. ఒక జీవి పుటుక కేవలం ఆ జీవికే సొంతమయిన చర్య కాదు. దాని వెనక ఎన్నో వేల సంవత్సరాల జనన మరణ భ్రమణం ఉంది. కోట్లాను కోట్ల జీవుల పరిణామ ఫలితం అది. వేల సంవత్సరాల
మానవ జీవన పరిణామమే నేటి ఈ ఒక్క క్షణం. నా జన్మ కేవలం నన్ను పుట్టించిన ఇద్దరు వ్యక్తులతో జరగలేదు. దాని వెనుక సంపూర్ణమైన విశ్వ భ్రమణం ఉంది. వైజ్ఞానికపరంగా ఆలొచించినా మానవుడు ఇప్పుడు ఇలా జన్మించడం వెనుక ఎన్ని మార్పులు జరిగాయి. ఎంత ఆట సాగింది? అంటే మనలో ఏదీ వ్యక్తిగతం కాదు. మనలోని ప్రతి పదార్ధం, మనదిగా మనం గర్వంగా చెప్పుకునే ఈ చైతన్యం మన సొంతం కావు. కోట్లాది అణువుల పరిణామ స్వరూపమే మన శరీరం, మన ఆత్మ. ఆస్థికులు నాస్థికులు ఎవరూ కాదనలేని సృష్టి సిద్దాంతం ఇది. దీన్ని మతం ముసుగులో కాకుండా సైద్ధాంతికంగా ఎంత తేలికగా ఒకే ఒక వాక్యంలో శ్రీ శ్రీ తేల్చేసారో. మనిషి అంటే వ్యక్తి కాదని, సమాజం అని శ్రీ శ్రీ వివరించిన తీరు అద్భుతం కదా. అతి పెద్ద
సోషియాలజీ సిద్దాంతాన్ని ఒకే ఒక వాక్యంలో అలా జన్మదిన సందర్భాన సినిమా పాటలో ఇమిడిపోయేలా రాయగలిగినవాడు తెలుగు నాట ఒక్క శ్రీ శ్రీ మాత్రమే. ఈ అనంతమైన సృష్టిలో మనం ఓ చిన్న అణువు మాత్రమే. అందుకే పూర్తి విశ్వ శ్రేయస్సే మన శ్రేయస్సు అవుతుంది. సుఖ దుఖాలేవీ వ్యక్తిగతం కావు. అసలు మానవ జీవితంలో ఏదీ వ్యక్తిగతం కాదు.
ఈ మానవ జననాన్ని ప్రకృతి స్వాగతించడాన్ని ఆయన అద్భుతమైన కల్పన జోడించి ఇలా వివరిస్తారు. వేల వేల సంవత్సరాలుగా విశ్వంలో జరిగుతున్న ఆట ఓ జననంగా ప్రకటితమయిన శుభసమయంలో గొప్ప పరిమళాలను వెదజల్లుతున్న వృక్షాలతో నిండి ఉండ మలయ పర్వతం నుండి పిల్లగాలులు
వీస్తుంటే, నక్షత్రాలే హారాలుగా కాంతులు ప్రసరిస్తుంటే, ఈ భూమి ఆ కొత్త జీవికి స్వాగతం పలుకుతుందట. ప్రతి జననంతో ప్రకృతి పులకరిస్తుంది, ఆ చైతన్యాన్ని స్వాగతిస్తుంది. ఎందుకంటే ప్రతి సృష్టి విశ్వంలో సరికొత్త శక్తిని జోడిస్తుంది. అసలు విశ్వం కోసమే మనం అయినప్పుడు ఆ విశ్వం మనల్ని స్వాగతించినప్పుడు మన జీవిన పరిణామం వ్యక్తిగత సుఖాల దగ్గర, వ్యక్తిగత బాధల దగ్గరే ఆగిపోవడం, కుటుంబం అనే ఓ పరిధిలో కూరుకుపోవడం ఎంత మూర్ఖత్వం కదా.
వలపులోన పులకరించు కన్నులతో చెలిని చేరి పలుకరించు మగవారు
మనసులోన పరిమళించు వెన్నెలతో ప్రియుని చూచి పరవశించె ప్రియురాలు
జీవితమై స్నేహమయం … ఈ జగమే ప్రేమమయం
అతను ప్రేమంటే ఒక భోగం ..ఆమె కాదు కాదు అది త్యాగం
ఇద్దరు తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం
ఉదయరాగం హృదయగానం
మనిషి జననం తర్వాత రెండు లింగాలు ఏర్పడతాయి. పుట్టిన పిల్లలను లింగపరంగా విభజిస్తారు. స్త్రీ లేదా పురుషుడు. ఈ ఇద్దరూ వారి వారి ప్రాకృతిక లక్షణాలతో ఎదుగుతారు. పునఃసృష్టికి కలుస్తారు. ఆ కలయిక ఎలా జరుగుతుందో కవి
వివరిస్తున్నాడు. ప్రేమతో పులకరించిన కళ్లతో తాను ఇష్టపడిన స్త్రీ దరి చేరి మగవారు ఆమెను పలకరిస్తారు. మనసులోని వెన్నెల పరిమళాలతో తన దరి చేరిన ప్రియుని చూసి ప్రియురాలు పరవశిస్తుంది. ఇది స్త్రీ పురుషుల కలయిక. నిజానికి వ్యక్తిగతంగా ఈ అనుభవం కోసం ప్రతి ప్రాణి పరితపిస్తుంది. ఇక్కడ పాటలో అతను ఈ వాక్యాల ద్వారా జీవితంలో తాను అనుభవించాలనుకుంటున్న ఆనందాన్ని, కావాలనుకుంటున్న సుఖాన్ని ప్రస్తావిస్తున్నాడు. కాని అతని కోరికకు బదులుగా ఆ స్నేహితురాలు గొప్ప జీవిత సత్యాన్ని అందిస్తుంది.
ఈ ఒక్క స్త్రీ పురుష వ్యక్తిగత సంబంధంతోనే మానవ జాతి జీవితం గడవదు. మనిషి జీవన ప్రస్థానం అంతా కూడా మానవ స్నేహ
సౌరభాల గుభాళింపుతో కొనసాగుతుంది. ప్రపంచంలో ఈ ఒక్క స్రీ పురుష ప్రేమ మాత్రమే ఉండదు దానితోనే మనిషి జీవితం కడతేరిపోదు. తరచి చూస్తే ఈ లోకమంతా ప్రేమమయమే. వ్యక్తిగత పేమకు పరిమితమై మానవ జీవితం సాగదని మనిషి జీవితం సమాజంతో ముడిపడి ఉంటుందని జీవితమంతా స్నేహమయం అని జగమంతా ప్రేమమయం అని ఆమె ఇక్కడ ఇచ్చే నినాదం ఎంత గొప్పగా ఉంటుందో.
అయితే ఆమె సిద్దాంతంతో అతను ఏకీభవించడు. ప్రేమంటే ఒక భోగం అని అది వ్యక్తిగతం అని చెప్పబోతాడు. దానికి ఆమె కాదు ప్రేమంటే త్యాగం అని బదులిస్తుంది.
ఈ పాట వింటుంటే ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన ఉర్దూ గజల్ లో “ఔర్ భీ దుఖ్ హై జమానే
మే ముహబ్బత్ కె సివా, రాహతే ఔర్ భి హై వస్ల కీ రాహత్ కె సివా” (ఈ లోకంలో ప్రేమను మించిన బాధలు ఇంకా ఉన్నాయి సంయోగం ఇచ్చే ఊరటను మించిన సౌకర్యాలు ఇంకా ఉన్నాయి) వాక్యాలు, సాహిర్ లుధియాన్వి రాసిన “హజారో గమ్ హై ఇస్ దునియా మె అపనే భీ పరాయే భీ, ముహబ్బత్ హీ కా గమ్ తన్హా నహీ హం క్యా కరే” (మనవి, పరాయివి అంటూ వేల దుఖాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. మనిషి ఒంటరితనానికి ప్రేమ మాత్రమే కారణం కాదు) వాక్యాలు గుర్తు కొస్తాయి. ఉర్దూ కవి ఫైజ్, హిందీ సినీ కవి సాహిర్ ఇద్దరూ వామపక్ష భావాలున్న ప్రజా కవులు. ప్రేమ అనే ఒక్క స్త్రీ పురుష సంబంధమే జీవితం కాదు అంటూ ఎన్నో సందర్భాలలో వాళ్లు వివరించి చెప్పారు. అదే భావాన్ని శ్రీ శ్రీ ఎంత సకారాత్మకంగా ఇక్కడ వివరిస్తారో
చూడండి. పైన చెప్పిన ఆ ఇద్దరు కవులు ప్రేమతో వచ్చే దుఖాన్ని, విరహానికి ప్రస్తావిస్తూ దాన్ని మించిన బాధలు ప్రపంచం నిండా ఉన్నాయి అంటారు. అదే విషయాన్ని ఇక్కడ శ్రీ శ్రీ అసలు విశ్వమంతా ప్రేమే కదా. ఒక్క స్త్రీ పురుష ప్రేమే జీవితాన్ని నడిపిస్తుందని ఎందుకనుకుంటారు? ప్రేమ అంటే భోగం కాదు త్యాగం కదా అంటూ ఎక్కడా విరహం అనే ఆలోచనే రానివ్వరు.
వ్యక్తిగత ప్రేమ కన్నా సామాజిక ప్రేమ గొప్పది. మనిషి సమాజంలో ఓ భాగం. మానవ జాతి పరిణామ స్వరూపమే కొత్త ప్రాణి జననం. ఇది స్పష్టమయ్యాక మన జీవితాలు ఏ దిశగా నడవాలో మనకు అర్ధం అవుతుంది కదా. మనం ఎంత ఎదగాలో, ఎక్కడ ఆగిపోయామో, ప్రపంచంలో మానవ వికాస పరిణామంలో మనం ప్రస్తుతం
గమనిస్తున్న స్తబ్దతకు మూలం ఎంటో శ్రీ శ్రీ గారి ఈ గీతం తెలియజేస్తుంది.


లోతైన విశ్లేషణ. ఫిలాసఫికల్ కూడా. అభినందనలు.
ప్రియ జ్యోతి గారికి,
శ్రీ శ్రీ గారి పాటలను అంత సూక్ష్మంగా, లోతుగా వివరించడం మీరు చేసిన ఒక అద్భుతమైన కృషి. వారి పాటల్లోని భావప్రధానత, సామాజిక లోతు, సంగీత సౌందర్యం ప్రతి ఒక్కటి మీ విశ్లేషణ ద్వారా మరింత స్పష్టమయ్యాయి. ఒక్క పాటలోనే ఎన్నెన్ని స్థాయిల భావాలు, ఎన్ని సామాజిక సందేశాలు దాగి ఉన్నాయో మీరు చూపించిన పద్ధతి చాలా చక్కటిది.
శ్రీ శ్రీ గారి సినిమా పాటలు కేవలం గీతాలు కాకుండా, కవితల వంటి ఆధ్యాత్మికతతో కూడిన సాహిత్య సంపదగా మార్చడంలో మీ అర్థగాంభీర్యం, భాషా సౌందర్యం ప్రత్యేకంగా ఉన్నాయి. ప్రతి పాటను ఒక చిన్న కావ్యంగా చదివించి, పాఠకుడి మనసుకు అందించడం మీ ఏకైక శైలి.
మీలాంటి విమర్శకురాలు, సాహిత్య సేవిక శ్రీ శ్రీ గారి కవిత్వ ప్రపంచాన్ని మరింత గాఢంగా చూపుతున్నారని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. మీ రచనలు తెలుగు పఠితలకు ఎప్పుడూ ఒక దీపస్తంభంలా నిలిచి ఉంటాయని నమ్ముతున్నాను.
ధన్యవాదాలు,
ప్రియ జ్యోతి గారికి,
శ్రీ శ్రీ గారి పాటలను అంత సూక్ష్మంగా, లోతుగా వివరించడం మీరు చేసిన ఒక అద్భుతమైన కృషి. వారి పాటల్లోని భావప్రధానత, సామాజిక లోతు, సంగీత సౌందర్యం ప్రతి ఒక్కటి మీ విశ్లేషణ ద్వారా మరింత స్పష్టమయ్యాయి. ఒక్క పాటలోనే ఎన్నెన్ని స్థాయిల భావాలు, ఎన్ని సామాజిక సందేశాలు దాగి ఉన్నాయో మీరు చూపించిన పద్ధతి చాలా చక్కటిది.
శ్రీ శ్రీ గారి సినిమా పాటలు కేవలం గీతాలు కాకుండా, కవితల వంటి ఆధ్యాత్మికతతో కూడిన సాహిత్య సంపదగా మార్చడంలో మీ అర్థగాంభీర్యం, భాషా సౌందర్యం ప్రత్యేకంగా ఉన్నాయి. ప్రతి పాటను ఒక చిన్న కావ్యంగా చదివించి, పాఠకుడి మనసుకు అందించడం మీ ఏకైక శైలి.
మీలాంటి విమర్శకురాలు, సాహిత్య సేవిక శ్రీ శ్రీ గారి కవిత్వ ప్రపంచాన్ని మరింత గాఢంగా చూపుతున్నారని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. మీ రచనలు తెలుగు పఠితలకు ఎప్పుడూ ఒక దీపస్తంభంలా నిలిచి ఉంటాయని నమ్ముతున్నాను.
ధన్యవాదాలు,
Adbhutamina saahityam sri sri garidi.Yenno madhurageethaalu. Vaatilloninchi aanimutyaalalanti paatalu yennukovatamlo vaatini visleshimchatamlo rachayitri gari loni kalatmaka hrudayam manaku suspastamga kanipistondi. Jyothi gariki hrudayapoor subhabhivandanalu