జమీల్యా నవల చదువుతున్నప్పుడు ఆ నీలి పర్వత సానువులలో, కనిపించినంతమేరా ఆ విశాలమైన స్టెప్పీ మైదానాలూ, నక్షత్రాలు ఆకాశంలో మెరుస్తుంటే వెన్నెల పాల వానలా కురుస్తుంటే మెరిసిపోయే రాత్రుళ్లలో, పోప్లార్ చెట్ల చల్లటి గాలులతో… ప్రకృతిలో మమేకమయ్యే ఆ ఇద్దరు జంటలు…కనిపిస్తారు. నవల చదివాక కూడా ఆ వీరుడు ధనియార్ ఆన్నెల రాత్రుల్లో పాడిన శ్రావ్యమైన పాట ఒకటి మనసుకు వినిపిస్తునే ఉంటుంది. అదొక మరిచిపోలేని అనుభూతి. మళ్ళీ అటువంటి అనుభూతిని కలిగించే నవలే వాడ్రేవు గారి “ఆ వెన్నెలరాత్రులు” నవల.
మనసంతా ఆ వెన్నెల పరుచుకుంటుంది. మనం ఎడ్లబండి మీద ఆ వెన్నెల్లో ఆ అడవి అంతా తిరిగి వచ్చిన అనుభూతి కలుగుతుంది. వర్షం పడ్డాక బరువైన మేఘాలతో నిండిన చిక్కటి ఆకాశమంతా ఒక్కసారిగా తేటగా తేలికగా మారిపోయిన భావన ఒకటి ఈ పుస్తకం చదివాక కలుగుతుంది. కార్తీక పౌర్ణమి నాడు పాడుకున్న రవీంద్రుని బెంగాలీ గీతంలా, యూకలిప్టస్ తోటల్లో జీవన్ బాబు కవితలా, యేటి ఒడ్డున ఎంకి పాటలా, వనలతల్లాగా విమలమైన భావనలు మనసుని చుట్టేస్తాయి. జ్ఞాపకాల్లో ఆగిపోయిన కలల్ని పట్టి లేపుతాయి. హృదయాంతరాళం మౌనంగా అలా ఉండిపోతుంది. అలా ఆ స్థితిలో ఎంతసేపు ఉండిపోయానో నాకే తెలియదు. బహుశా నిన్న రాత్రి అంతా! ఈ పుస్తకం- మనసుకు పట్టే కాళిదాసు ఋతువు. ప్రస్తుతానికి ఇంతకుమించి చెప్పను.

