ఇంకా మనకు సరిహద్దుల్లేని దేశాలున్నాయి
మన అపరిచిత ఆలోచనల్లాగా!
ఇరుకైన, విశాల దేశాల పటాలగుండా
వాటి సన్నని బూడిద రంగు సొరంగాల
చిక్కుల బోనులో నడుస్తూ అరుస్తాం!
"... ఇంకా'నిన్ను' ప్రేమిస్తూనే ఉన్నాం!"
మన ప్రేమ ఒక అనువంశిక వ్యాధి!
తెలియని ప్రాంతాల్లోకి
మనల్ని చెల్లాచెదురుగా విసిరేస్తూ
ఈ దేశాలు విస్తరిస్తాయి.
వాటి "విల్లో" చెట్లు , భౌగోళిక చిత్రాలు
పచ్చిక బయళ్లు, నీలి రంగు పర్వతాలు
ఆత్మకు ఉత్తరాన
ఒక సరసు విశాలమమవుతుంది
దక్షిణాన
గోధుమచేలు మొలకెత్తుతాయి.
ప్రవాసి రాత్రుల అంతులేని చీకట్లలో
నిమ్మ పండు
చిక్కని జ్ఞాపకాల దీపమై వెలుగుతుంది
భూగోళశాస్త్రం నుండి
పవిత్ర గ్రంథాలు ఉదయిస్తాయి.
గొలుసుల వరుసలా పర్వతాలు
అంతకంతకూ ఆకాశందాకా పెరుగుతాయి
దేశ బహిష్కృతుడు
తనకు తానే చెప్పుకుంటాడు:
"నేనొక పక్షినైతే సొంత గూటికి చేరలేని
నా నిస్సహాయ రెక్కలను నేనే కాల్చుకుందును! "
శరత్కాల వాసనలు
"ప్రియమైన వాళ్ళ" రూపుగడతాయి!
మృదువైన వాన
తడి తడిగా
పొడిబారిన గుండె పొరల్లోకి ఇంకుతుంది
ఇంకా ఒక ఉహ దాని వేర్లనుండి
నిజమైన భూమిగా,
ఏకైక సొంత నేలగా మొలకెత్తుతుంది
దూరంగా ఉన్నదంతా
పురా గ్రామీణంగా,
అప్పుడే స్వర్గము నుండి
కిందికి దిగి వస్తున్న ఆదామును కలుసుకోడానికి, తనను తాను
సమీకరించుకుంటున్న భూమిలా ఉంటుంది.
నేనంటాను :
ఇవే మనల్ని మోసే దేశాలా...
అయితే మనమెప్పుడు పుట్టి ఉంటాము?
"ఆదాము" కు ఇద్దరు భార్యలా?*
లేక
పాపాన్ని మరిచిపోడానికి
మనం మళ్లీ పుడుతామా?**
*” ఆదాముకు ఇద్దరు భార్యలా? “
ఇది మతపరమైన ప్రశ్న కాదు. పాలస్తీనా విభజన మరియు గుర్తింపు సంక్షోభానికి ప్రతీక.
ఇది భూమిపై ఇద్దరి హక్కుల సంఘర్షణను సూచిస్తుంది.
నిర్వాసిత పాలస్తీనీయులు, ఆదాములాగా రెండు వైపులా చీలిపోయారు:
1 హవ్వ → కోల్పోయిన స్వదేశం (స్వర్గం) కోసం ఆరాటం
2 లిలిత్ → వలసలో ఉన్న నిజమైన జీవితం (ప్రతిఘటన).
**పాపాన్ని మరచిపోవడానికి మేము మళ్లీ పుడతామా?”:
“పాపం” = వలస/భూమి కోల్పోయిన బాధ. ఆదాము ఏదేన్ (స్వర్గం) నుండి బహిష్కరించబడినట్లే, పాలస్తీనీయులు తమ భూమి నుండి బహిష్కరించబడ్డారు.
మహమూద్ దర్విష్
పాలస్తీనా జాతీయ కవిగా గౌరవించబడే మహమూద్ దర్విష్ మార్చి 13, 1941 లో జన్మించారు. ప్రస్తుత ఇజ్రాయెల్కు ఏర్పాటు కోసం జియోనిస్ట్ మిలీషియాలచే తమ మాతృభూమిని కోల్పోయిన పాలస్తీనియన్లలో అతని కుటుంబం కూడా ఉంది .ఆ తర్వాత అతని కుటుంబం లెబనాన్కు పారిపోయింది. జీవితంలోని ఎక్కువ భాగం ప్రవాసంలో మగ్గిపోయిన అతనికి పాలస్తీనా తల్లి, పాలస్తీనా ఒక ప్రేయసి, నెరవేరని స్వేచ్ఛా వాంఛ.దాదాపు శతాబ్ద కాలంగా ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న శరణార్థులుగా జీవిస్తున్న పాలస్తీనియన్ల బాధలకు ఆయన కవిత్వం గొంతు నిచ్చింది .దర్విష్ 2008 ఆగస్టు 9న హ్యూస్టన్లో గుండె శస్త్ర చికిత్సకు సంబంధించిన సమస్యలతో మరణించారు. దర్విష్ దాదాపు ముప్పై కవితా సంపుటాలను ప్రచురించాడు, ఇవి ఇరవై రెండు కంటే ఎక్కువ భాషలలోకి అనువదించబడ్డాయి.అందులోంచి కొన్ని తెలుగులో స్వేచ్ఛానువాదంగా ఉదయిని పాఠకుల కోసం...
రహీమొద్దీన్
కవి రహీమొద్దీన్ ప్రభుత్వ ఉపాధ్యాయులు, మహబూబాబాద్ నివాసి. డిగ్రీ నాటి నుండి కవిత్వం రాస్తున్నారు. 2018 నుంచి రైటింగ్ ని సీరియస్ గా తీసుకున్నారు. 2023 లో 'కలల రంగు' కవిత్వ సంపుటి వెలువరించారు. పలు కవిత్వ సమీక్షలూ చేశారు.
