స్వారీ చేస్తున్న వానికే
దిశను చూపుతున్నగుర్రంలా
ఈ దారే నా అడుగులను నడిపిస్తున్నది
నా లాంటి బాటసారి వెనక్కి తిరిగి చూడలేడు
శరత్కాల మూలాన్ని వెతుక్కుంటూ
చాలా దూరాలను దాటాను
అక్కడ ఆ నది వెనకాల
ఈ అధిక వేసవిలో
ఆఖరి దానిమ్మలు పండుతాయి
ఆపిల్ గింజ చెక్కిలిపై అందంగా
అనుభవాల మచ్చ పెరుగుతుంది
అక్కడ ఆ నది వెనకాల
పరుచుకున్న మా నీడల కింద
దారీ, నేనూ భాగస్వాముల్లా నిద్రిస్తాము
పొద్దున్నే లేచి
ఒకరినొకరం మోసుకుంటూ బయలుదేరుతాము
నేనంటాను,
"ఋతువులను మోస్తున్న కాలాశ్వమా!
ఎందుకింత తొందర?
కాస్త నెమ్మదిగా వెళ్ళు!
మరేం ఫర్వాలేదు!
కొన్ని కలలున్నా చాలు
ఆ ఎడారిని, లోయలను దాటుతాం
మొదలైన చోటే
ఆఖరి మజిలీకి చేరుకుంటాం! "
'మొదలు' మా వెనుకాల ఉంది
ముందు
శీతాకాలపు సమాచారాన్ని మోసుకొస్తున్న మేఘాలు
శీతాకాలం ఎక్కడ మొదలవుతుందో
తెలుసుకోడానికి
నేను చాలా దూరమే నడిచాను
అక్కడ, ఆ కొండమీద ఒక తెల్ల జింక
మేఘాల కింద
తన పిల్లను వెతుకుతోంది
వేటగాడు తుపాకీ గురి పెడుతాడు
నేను తోడేలులా ఊల పెడుతాను
తెల్ల జింక తూటా దెబ్బను తప్పించుకుంటుంది
వేటగాడు భయపడుతాడు
అక్కడ ఆ కొండ గుహ పక్కన
దారీ నేనూ నిద్రించి, ఉదయాన్నే లేచి
ఒకరినొకరం మోసుకుంటూ బయలుదేరుతాము
ముందుకు అడుగేస్తూ అడుగుతాను
"తరువాత ఏంటి?
ఏ చోటుకు తీసుకపోతావు నన్ను?"
ఎదురుగా
దట్టమైన పొగమంచు...
దారీ నేనూ
ఒకరికొకరం కనిపించడం లేదు!
చివరి మజిలీ చేరుకున్నానా?
దారితో వేరుపడ్డానా?
నా ప్రశ్నకు నేను బదులిచ్చుకున్నాను
ఇప్పుడింత దూరం నుంచి
నా లాంటి ప్రయాణికుడు
వెనక్కి తిరిగి చూడగలడు!
మూలం : (A traveller)
- మహమూద్ దర్వీష్
స్వేచ్ఛానువాదం :రహీమొద్దీన్
మహమూద్ దర్విష్
పాలస్తీనా జాతీయ కవిగా గౌరవించబడే మహమూద్ దర్విష్ మార్చి 13, 1941 లో జన్మించారు. ప్రస్తుత ఇజ్రాయెల్కు ఏర్పాటు కోసం జియోనిస్ట్ మిలీషియాలచే తమ మాతృభూమిని కోల్పోయిన పాలస్తీనియన్లలో అతని కుటుంబం కూడా ఉంది .ఆ తర్వాత అతని కుటుంబం లెబనాన్కు పారిపోయింది. జీవితంలోని ఎక్కువ భాగం ప్రవాసంలో మగ్గిపోయిన అతనికి పాలస్తీనా తల్లి, పాలస్తీనా ఒక ప్రేయసి, నెరవేరని స్వేచ్ఛా వాంఛ.దాదాపు శతాబ్ద కాలంగా ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న శరణార్థులుగా జీవిస్తున్న పాలస్తీనియన్ల బాధలకు ఆయన కవిత్వం గొంతు నిచ్చింది .దర్విష్ 2008 ఆగస్టు 9న హ్యూస్టన్లో గుండె శస్త్ర చికిత్సకు సంబంధించిన సమస్యలతో మరణించారు. దర్విష్ దాదాపు ముప్పై కవితా సంపుటాలను ప్రచురించాడు, ఇవి ఇరవై రెండు కంటే ఎక్కువ భాషలలోకి అనువదించబడ్డాయి.అందులోంచి కొన్ని తెలుగులో స్వేచ్ఛానువాదంగా ఉదయిని పాఠకుల కోసం...
రహీమొద్దీన్
కవి రహీమొద్దీన్ ప్రభుత్వ ఉపాధ్యాయులు, మహబూబాబాద్ నివాసి. డిగ్రీ నాటి నుండి కవిత్వం రాస్తున్నారు. 2018 నుంచి రైటింగ్ ని సీరియస్ గా తీసుకున్నారు. 2023 లో 'కలల రంగు' కవిత్వ సంపుటి వెలువరించారు. పలు కవిత్వ సమీక్షలూ చేశారు.
