పొద్దున్నే మనోహర్ తలుపు తట్టాడు .అది పూరన్ పిన్ని ఇల్లు .ఆసరికి పూరన్ పిన్ని కచ్చితంగా లేచి ఉంటుందని నమ్మకం. ఆమెకి పొద్దున్నే లేచే అలవాటు ఉంది. చుట్టూ చూస్తుంటే అంతా పదేళ్ల కింద ఉన్నట్టే ఉంది . ఏం మారలేదు.వీధులు,ఇళ్ళ గోడలు అన్నీ అలాగే ఉన్నాయి . వీధిలో కుప్పలు తెప్పలుగా చెత్త పేరుకొని పోయింది. ఊహు ,ఏమీ మారలేదు. చుట్టూ ఒకసారి చూసి మళ్ళీ తలుపు కొడదామని అనుకునేంతలో తలుపు తెరుచుకుంది. ఎదురుగుండా పూరన్ పిన్ని ఒక చేతిలో బాత్రూం కడిగే చీపురు పట్టుకొని నిలుచుంది. ‘ఎవరూ’ అంటూ కళ్ళు చిట్లించి చూసింది. “నేనే పిన్ని మనోహర్ని, ఢిల్లీ నుంచి వచ్చాను” అంటూ పాదాభివందనం చేసాడు మనోహర్.
పూరన్ పిన్ని మరింత దగ్గరగా వచ్చి చూసి,” ఓ మనోహరా! ఏంటి ఈరోజు సూర్యుడు పశ్చిమాన ఉదయించాడా ఏం?” అంటూ ఆశీర్వదించి ప్రేమ పూర్వకంగా భుజం తట్టింది.
మనోహర్ చిన్నగా నవ్వి ,”నేను భూపాల్ వెళ్లాను. అట్నుంచి తిరిగి ఇంటికి వెళుతుండగా, ఈరోజు కిటికీలోంచి బయటకు చూస్తే ,ట్రైన్ ఆగ్రా కంటోన్మెంట్లో ఆగి ఉంది .వెంటనే నువ్వు గుర్తొచ్చావు. అమాంతంగా నా బ్రీఫ్కేస్ తీసుకుని ప్లాట్ ఫామ్ మీదకి దూకేశాను”.
“బలే మంచి పనే చేశావురా. ఇప్పుడిక నువ్వు నా ఎదురుగా ఉన్నావు కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరూ నన్ను చూసుకునే వాళ్ళే లేరని గుసగుసలాడుకోరు. ఈ ముసలి దాన్ని చూసుకోవడానికి మనుషులున్నారని నమ్ముతారు”, అంటూ తడికళ్లను కొంగుతో తుడుచుకుంది.
మనోహర్ గదిలోకి వెళ్లి తన బ్రీఫ్ కేస్ ని మంచం కిందికి తోసాడు బూట్లు పక్కన పెట్టాడు.
“నిన్న రాత్రి మీ అమ్మని తెగ తలచుకున్నానురా. సుని ని ఎంత తలుచుకున్నానో చెప్పలేను .చనిపోయిన తర్వాత ఆమె కొడుకులు కూడా నన్ను మర్చిపోయారన్న బాధతో కుమిలిపోయాను”.
“పిన్నీ, మనం ఆరేడు నెలల కిందటే కదా ఢిల్లీలో కలుసుకున్నాం గుర్తుందా?”
“అవునురా గుర్తుందిరా. అప్పుడే నేను రాజేంద్రనగర్ లో ఉన్న మా అత్తగారింటికి కూడా వెళ్లాను. అప్పుడు నువ్వు లజ్పత్ నగర్ లో ఉండేవాడివి కదా. కానీ నిజం చెప్పాలంటే అక్కడ ఎవరూ నన్ను పట్టించుకోలేదు. అది నా బావ గారి మొదటి వర్ధంతి . అంతకు ముందు ఆయన చనిపోయినప్పుడు వాళ్ళింటికి వెళ్ళాను. అప్పుడే మీ ఇంటికి కూడా వచ్చాను. కానీ నిజానికి మా అత్తగారి ఇంటి వాళ్ళు ఆయన చనిపోయిన వార్తను కూడా నాకు తెలియజేయ లేదు. కేవలం చూసి వచ్చిన బంధువుల ద్వారా తెలుసుకొని వెళ్లాను. ఢిల్లీ వాళ్ళకి బంధువుల గురించి పట్టదేమో!”
పిన్ని గొంతు బాధతో వణకడం మనోహర్ గ్రహించాడు. వెంటనే ఆమె తనను తాను సంభాళించుకొని “పరవాలేదు,నీ కాళ్లు తీసి మంచం మీద పెట్టుకో. ఇదిగో , ఇప్పుడే నీకు టీ తీసుకొని వస్తాను. నీకు టీ లో పంచదార వేసుకోవడం ఇష్టం ఉండదు కదా,” అంటూ చకచకా వంటింట్లోకి మాయమయి పోయింది.
మనోహర్ కాళ్ళను మంచం మీది కి ఎత్తి పెట్టుకొని చక్కగా బాసిం పట్టు వేసుకొని బుద్ధిమంతుడిలా కూర్చున్నాడు.
అతని దృష్టి ఎదురుగుండా గోడను అలంకరించిన పటం లోని అమ్మమ్మ, తాతల మీద పడింది. తన తాత మొహం మీద రెండు కనుబొమ్మల మధ్య ఒక సన్నని ముడత ఉంటుంది. అది వైష్ణవులు దిద్దుకునే నామం లాగా ఉంటుంది. తనకి కూడా అదే పోలికొచ్చింది. తన కనుబొమ్మల మధ్య కూడా ఒక ముడతపడిన చర్మం,నామం లాగా స్పష్టంగా తేలి ఉంటుంది.
ఆ ఫోటోని మళ్లీ చూశాడు తాత దృఢ కాయుడుగా ఉండేవాడు. అమ్మమ్మ దయామయంగా ఉండేది. వాళ్ళిద్దరూ పిన్నిని భర్త వదిలి వెళ్లిన తర్వాత, నిస్సహాయురాలైన ఆమెని , చాలాజాగ్రత్తగా చూసుకునేవారు. మిగిలిన పిల్లలందరూ సంతోషంగా తమ తమ కుటుంబాలతో జీవితాలు గడుపుతున్నారు. వాళ్లంతా దేశంలోని వివిధ పట్టణాల్లో నివసిస్తున్నారు. ఒక్క పూరన్ దేవి భర్త మూల్చంద్ మాత్రమే ఆమెను వదిలేసి, కష్టాలలోకి నెట్టేసాడు. ముల్చంద్ ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చినవాడే .వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా ఉన్నత స్థాయిలో ఉన్నారు. కానీ మూల్చందొక్కడే పనికిమాలినవాడు, తిరుగుబోతు. పెళ్లయితే బాగుపడతాడేమో నన్న ఆశ తో మూల్చంద్ ని పూరన్ పిన్నికి వాళ్ళ వాళ్ళు కట్టబెట్టారు. కానీ అది ఎలాగూ జరగలేదు. అతను తన అలవాట్లను మానుకోలేదు. ఒక పనిలో కాదు కదా ఒక ఊళ్లోనే ఎప్పుడూ ఉండేవాడు కాదు. ఇల్లు అసలు పట్టలేదు. పైగా చిన్నచిన్న నేరాలకు అలవాటు పడ్డాడు. అయితే చివరి రోజుల్లో పూరన్ పిన్ని దగ్గరికి చేరాడు. బాగా రోగాల బారినపడి, ఎవరూ చూసుకునే దిక్కు లేక పిన్ని దగ్గరికి చేరి, క్షమాపణ కోరి ఆశ్రయం పొందాడు. పిన్ని కూడా అతన్ని క్షమించి చివరి వరకు చూసుకుంది. ఆఖరికి ఆమె ఒళ్లోనే తనువు చాలించాడు.
పూరన్ పిన్ని ఒక పెద్ద మగ్గు నిండా టీ తీసుకొని మనోహర్ గదిలోకి వచ్చింది. మనోహర్ ఆమెను చూడంగానే ఎంతో చలించిపోయాడు .పిన్ని తను టీలో పంచదార వేసుకోడని గుర్తుంచుకోవడమే కాక టీ పెద్ద కప్పులో తాగుతాడు అని కూడా గుర్తుంచుకుంది. ఆమె వైపు నవ్వుతూ చూసి” ఇంత టీ నా కోసమే” అన్నాడు.
“నువ్వు పెద్ద కప్పులో టీ అంతా గటగటా తాగేస్తావు కదా ప్రతిరోజు పొద్దున్నే, నాకు గుర్తుంది .”అంటూ నవ్వింది పిన్ని.
టీ తాగిన తర్వాత మనోహర్ స్నానం చేశాడు. పిన్ని వాళ్ళ ఇంట్లో ఇదివరకు బాత్రూంలో పంపు ఉండేది కాదు. ఇప్పుడు కొత్తగా పంపు పెట్టించింది .పంపు లేనప్పుడు పాపం పక్క నున్న వీధి పంపు లో నుంచి బకెట్ తో నీళ్లు పట్టుకొచ్చి బాత్రూంలో పెట్టేది. బట్టలు మార్చుకొని బయటికి వెళ్ళడానికి సిద్ధపడుతుండగా పిన్ని “ఎటు తిరిగి బయటికి వెళ్తున్నట్టు ఉన్నావు కదా! కాస్త పెరుగు తీసుకురా! “అనింది పెరుగు తేవడానికి గిన్నె కోసం ఎదురుచూస్తున్నట్టు గ్రహించి “ఇప్పుడు పెరుగు తీసుకోవడానికి మనం గిన్నెలు తీసుకెళ్లక్కర్లేదు. వాళ్లే ప్లాస్టిక్ సంచిలో వేసి ఇస్తారు” అనింది.
మనోహర్ తిరిగి వచ్చేసరికి గదిని శుభ్రంగా తుడిచిపెట్టింది. అనందపూర్ సాహిబ్ గురూజీకి పూజ చేసుకుంది.
ఒకప్పుడు పిన్ని నారీశాల నడిపేది.ఆ సంస్థ కింద ఆడపిల్లలు అందరికీ కుట్టు నేర్పించేది. ఎంబ్రాయిడరీ నేర్పించేది. సంస్కారం నేర్పించేది. ఆమె ఆ చుట్టుపక్కల ఉన్న మహిళలందరిలో చదువుకున్నది. ఇంగ్లీష్ కూడా మాట్లాడగలదు .అయితే ఇప్పుడు ముసలితనం వలన కుట్టు మిషన్ నేర్పే పనిని మానేసింది. కిందటిసారి ఢిల్లీకి వచ్చినప్పుడే మనోహర్ తో” నా కుట్టు మిషన్లన్నీ ఇచ్చేసాను ” అని చెప్పింది .కుట్టు మిషన్లు ఉన్నా ఫ్లొర్ ని అద్దెకిచ్చి అద్దెతో గడుపుకుంటున్నది.
పూజ ముగించుకొని వంటింట్లోకి వెళ్తూ పిన్ని,” మనూ ఎందుకు అంతగా ఆలోచనలలో మునిగిపోతున్నావు? అంతగా నిన్ను ఆలోచింప చేస్తున్న విషయాలు ఏమిటి ?”అని అడిగింది .మను మంచం మీద నుంచి కిందికి దూకి వంటింట్లోకి పిన్నిని అనుసరించాడు. పిన్ని గ్యాస్ పొయ్యి వెలిగించి పరాటాలు చేసింది.
“అవును పిన్ని ,ఢిల్లీ వాళ్ళ కి ఎవరినీ పలకరించే సమయమే ఉండదని నువ్వు ఎందుకు అనుకున్నావు?” అని అడిగాడు.
అవునురా, ఇటువంటి మాటలు అకారణంగా నేను అనను. తాను పడ్డ బాధని అణచుకునే ప్రయత్నం చేయకుండానే చెప్పింది.
ఆ తర్వాత పిన్ని తన మాటని ఎలా సమర్ధించుకుంటుందో విందామని మనోహర్ ఎదురు చూస్తున్నాడు. అసలు పిన్నికి ఈ గదిలో ఎలా పొద్దు పోతుంది ?ఇక్కడ ఒక టెలివిషన్ లేదు. వార్తాపత్రిక లేదు. ఆమెకి బంధు వర్గం ఎవరూ ఉత్తరాలు రాయరు. ఏదో అర్జెంట్ విషయం ఉంటే ఫోన్ చేసి చెప్పడం తప్ప ఎటువంటి సంబంధాలు ఉండవు. పాపం పిన్ని ఒంటరిగా ఎలా ఉంటుందో అనుకున్నాడు. నిజానికి అర్జెంట్ విషయం ఏమన్నా చెప్పాలనుకున్నా పిన్నికి ఫోన్ లేదు .12,15 కిలోమీటర్ల దూరంలో మానస్ నగర్ లో ఉన్న బంధువుల ఇంటికి ఫోన్ చేస్తారు. వాళ్లు పిన్నికి విషయం చేరవేయాలి. నిజానికి అసలు పిన్నికి చదివే రాకుండా ఉంటే న్యూస్ పేపర్ లేదన్న విషయానికి అంత ప్రాధాన్యత లేకుండా పోయేది. కానీ పిన్నికి చదవొచ్చు .ఏమైనా ఈసారి ఢిల్లీ వెళ్ళిన దగ్గర నుంచి క్రమం తప్పకుండా ఉత్తరాలు రాస్తుండాలి అనుకున్నాడు. కానీ ఢిల్లీ వెళ్ళినాక ఈ ఆలోచనలు గుర్తుంటాయా?
పిన్ని రెండు పళ్ళేలు పట్టుకుని వచ్చి మంచం మీద కూర్చుంది .రెండు కటోరీలలో పెరుగు వేసింది. తన ప్లేట్లో మూడు పరోటాలు వేయడం పిన్ని ప్లేట్లో ఒక్క పరోటా ఉండడం మనోహర్ గమనించాడు.
“పిన్నీ ,ఒక్కతికి నీకు బోర్ కొట్టదూ” అని అడిగాడు.
పిన్ని,” అవున్రా, బోరే నీలాంటి కొడుకులు పిన్ని ఒంటరి తనాన్ని గుర్తించి అప్పుడప్పుడు ఇలా కనిపిస్తుంటే ఎంత బాగుంటుంది. ” అనింది.అమ్మ కూడా ఇలాగే మాట్లాడేది .ఆ మాట తీరు ఇద్దరిదీ ఒకటే. ఒక క్షణం తర్వాత పిన్ని,” జీవితం మనం మలుచుకున్నట్టే ఉంటుంది. ఇక నా జీవితంలో ఏం మిగిలింది చెప్పు? “అని నిర్జీవంగా నవ్వింది. వెంటనే తేరుకుని, “సరేలే ఇంక నీ విషయాలు చెప్పు. ఢిల్లీలో అంతా బాగున్నారా ?అన్నట్టు నీ చెల్లి విమల పిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ల చదువులన్నీ పూర్తయిపోయాయా? ఇంకా కాలేజీల్లో చదువుతున్నారా? అని అడిగింది.
మనోహర్ ఒక్కసారి గతుక్కుమన్నాడు. విమల గురించి అడగంగానే తన బావగారు చనిపోయిన సంగతి పిన్నికి చెప్పలేదన్న విషయం గుర్తొచ్చింది.
పిన్ని వెంటనే “ఏమైంది” అని అడిగింది .మనోహర్ అనుకోకుండా ఇరుక్కుపోయాడు.” ఏం లేదు పిన్ని నీకో విషయం చెప్పడం మర్చిపోయాను .దురదృష్ట వసాత్తు విమల భర్త కొన్ని నెలల క్రితమే చనిపోయాడు. ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్ తీవ్రంగా రావడం వల్ల చనిపోయాడు.”
పిన్ని కి దుఃఖం ఉప్పొంగింది .ఆమె బాధ లో మునిగి “వీల్లేదు వీల్లేదు అలా జరగడానికి వీల్లేదు”, అంటూ కళ్ళు మూసుకుంది. చనిపోయిన కుమార్ ఆత్మశాంతి కోసం ప్రార్థించిందేమో! కళ్ళు తెరిచిన తర్వాత “నాకో టెలిగ్రామ్ పంపించడమో,,ఉత్తరం రాయడమో చేసి ఉండొచ్చు కదా! ఇంత దురదృష్ట సంఘటన జరిగినప్పుడు కూడా నాకు తెలియజేయలేదు. నేను ఇంకా బతికే ఉన్నాను .అయినా చనిపోయి వాళ్లలో జమ కట్టేశారు” అంటూ కన్నీరు పెట్టుకుంది.
పిన్ని లో లోతులలో మదనపడడాన్ని మనోహర్ గుర్తించాడు. నిజమే తాను కుటుంబంలో పెద్దకొడుకు. తన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కుటుంబంలో మంచి చెడ చూసుకోవలసిన బాధ్యత తన మీదే ఉంది .చుట్టాలందరితోనూ బంధుత్వాలు జరపాల్సిన బాధ్యత కూడా తనదే. ఇప్పుడు ఆమెకు ఏమని సంజాయిషీ ఇస్తాడు?
పిన్నీ ,”నేను ఏమని చెప్పను? “అన్నాడు పశ్చాత్తాపంతో. నిజమే నేను తప్పు చేశాను. చాలా బాధపడుతున్నాను. వారణాసిలో మన వాళ్ల కుటుంబాలలోని అన్నదమ్ముల పెళ్లిళ్లు జరిగాయని నీకు తెలుసు కదా.వాళ్ళు ఆ పెళ్లిళ్లకి ఆహ్వానాలు పంపించారు. ఉత్తరాలు కూడా రాశారు. కానీ మేమంతా ఎంత దుఃఖంలో ఉన్నామంటే ,మేము ఆ పెళ్లిళ్లకు వెళ్లలేకపోయాము. కనీసం వాళ్ల ఉత్తరాలకి సమాధానాలు కూడా రాయలేకపోయాం. ఇప్పుడిప్పుడే కోలుకొని వాళ్ళని వ్యక్తిగతంగా కలుసుకొని క్షమాపణలు చెప్పుకుంటున్నాను”అన్నాడు .
కానీ పిన్ని బాధ ,దుఃఖం వర్ణించలేనిది. ఆమె “అవున్రా నువ్వు చెప్పలేకపోయావు. విమల భర్త గురించి చెప్పలేకపోయావు. ఇప్పుడయినా నేను విమల గురించి అడిగిన తర్వాత, ఆమె పిల్లల గురించి వాకబు చేసిన తర్వాత మాత్రమే చెప్పావు. నేను నీతో పాటు ఢిల్లీకి విమలని ఓదార్చడానికి బయలు దేరతానేమో అని భయపడ్డావు కదూ!
“అబ్బే అటువంటిదేం లేదు పిన్నీ, నిజానికి అలా మేము ఎప్పుడూ అనుకోలేదు. అలా అనుకున్న గుర్తు కూడా నాకు లేదు.”
“ఇందాకల నేను ఢిల్లీ వాళ్ళకి బంధుత్వాలు నిలుపుకునే సమయం ఉండదని అన్నది ఇందుకే” అన్నది తడికళ్ళతో .ఏ కారణం లేకుండా నేను అలాంటి మాటలు అంటానా! క్రితం సారి నేను ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు మా బావగారి కొడుకుని “అప్పుడప్పుడు నన్ను చూడ్డానికి వస్తూ పోతూ ఉండు నాయనా “అన్నాను. దానికి సమాధానంగా వాడేమన్నాడో తెలుసా! “పిన్ని నీకు పుణ్యం ఉంటుంది,మమ్మల్ని వదిలిపెట్టేయ్” అన్నాడు .ఈ మాటలు అంటూ పిన్ని భోరున ఏడ్చింది. “ఆరోజు తర్వాత నేను మళ్ళీ మా అత్తగారింట అడుగు పెట్టలేదు. నా వంటరి తనంతో సమాధాన పడ్డాను.”
మనోహర్ ఆమెని ఓదార్చే ప్రయత్నం చేశాడు. క్షమించమని, జరిగిందంతా మర్చిపోమ్మని కోరాడు. పిన్ని ఒంటరితనం వల్ల, బంధు వర్గం ఎవరూ చేరదీయకపోవడం వల్ల బాధపడుతోందని భావించాడు . ఒక్కరే ఉండడం ఒంటరిగా ఉండడం మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని గ్రహించాడు . సమాజం వ్యక్తుల మీద ఒంటరి తనాన్ని బలవంతంగా రుద్దుతోంది. అందువలన వాళ్ళు ఒక్కరే ఉండాల్సి వస్తోంది .ఒక్కరే ఉండడం కాలక్రమంగా ఒంటరితనానికి దారితీస్తుండడం వేరే విషయం.
తిన్న కంచాలు, గిన్నెలు తీసి వంట గదిలోని సింక్లో వేశాడు .ఆ తర్వాత ముందు రూమ్ లోకి వచ్చి మంచం మీద బోర్లా పడుకుని దిండు లో తలదూర్చి కళ్ళు మూసుకున్నాడు. పిన్ని దుఃఖాన్ని ఎదుర్కొనే ధైర్యం లేకపోయింది.
_________________________________________________________________________________________________________
ఇది అనువాద కథ. అకేలి, అకేలి హు. అనే మోతీలాల్ జత్వాన్ని అనే హిందీలో ప్రశ్నించబడిన కథ కి తెలుగు అనువాదం. జూలై- సెప్టెంబర్ 1999 లో సింధి లో ప్రచురించబడింది. కథ ప్రైజ్ స్టోరీస్ వాల్యూమ్ పది నుండి స్వీకరించబడింది