మనసు లోపలి మనిషి

Spread the love

 ప్రతీ ఒక్కరిలోనూ ఓ ఆలోచనా స్రవంతి ఉంటుంది.

మనసు వెళ్లిన దగ్గరికల్లా మనిషి ప్రయాణించగలడా?!

మనసు మనిషి వేరు వేరా?!

మనిషి లోపలి మనిషిగా,

లో లోపలి మనసుగా ,

రెండు ముఖాలుగా వేరు పడ్డ రెండు ప్రపంచాలు మనకు దర్శనం ఇస్తాయి ఇక్కడ కథల్లో.

           ఈ అపురూప చింతన కథలు సాలోచనగా ఆలోచించి చదివితే మాత్రం ప్రతి కథకు ఓ అంతర్వాణి ఉంటుంది.

            ‘వినదగునెవ్వరుచెప్పిన’ అన్న వాక్యాన్ని అనుసరించే వారే ఎక్కువగా ఈ సామాజిక వ్యవస్థలో మనకు తారసపడతారు. అటువంటి వ్యవస్థలో బ్రతికే వారికి అంటు కట్టుకున్న మొక్కలు చిగురించి నట్టు,  గుండెలో బరువుని ప్రకృతి అంత అందంగా  మోస్తూ.., తిరిగే మనసులు కో కొల్లలుగా తారసపడతాయి మనకు.

      మనసు బరువుని అంత తేలికగా మోయగలిగిన వారు జీవితాన్ని ఈదలేక బతుకు దుర్భరమైనప్పుడు

మనిషి మనసు మెలకువతో ఉంటుందా?! ఉంటే మనిషి లోపలి మనిషి వాడిని బ్రతకనిస్తుందా..?

 ఇలా వేల ప్రశ్నలు మన చుట్టూ ప్రవహిస్తూ ఉంటాయి ఈ కథల్లో.

        అజయ్ ప్రసాద్ కథలతో ఇంతకుముందు పరిచయం ఉన్నా అది అతనిలోని తాత్విక చింతన అని అనిపించేది. కానీ ఇక్కడ ఈ కథల్లో కథకులు అందరూ కూడా తమలోని  తాత్వికతని కథగా మలచడం గొప్పగా ఉంది.

    ఈ పుస్తకం చేతికి వచ్చాక మాత్రం మనసు భలే తేలిక పడింది. Literally I enjoyed a lot with this stories.

           మనసు ఎంత బరువెక్కి పోతుందో అంత తేలిక పడుతుంది. గాలి పొరల్లో మనిషి తేలి ఆడే ఆట ఈ కథలు.

            ఇందులో ఇరవై మంది రచయితలు

 ఇరవై రకాల తాత్వికతతో కూడిన దిగులు పడ్డ మనసుల్ని ఊయల కట్టి ఊపి నిద్దుర పుచ్చారు.

        ఇందులో బంధాలు, బాంధవ్యాలు, పెనుగులాటలు ఉండవు. బతుకు భయాలు ఉండవు. అధికార దాహాలు, బానిస బతుకులు, ఊడిగపు సేవలు, అహంకార పెళుసు ముక్కలు ఉండనే ఉండవు. వెటకారపు వికారాలు ఉండవు. మోహావేషాలు ఉండవు,  కన్నీటి ప్రవాహాలు, ఈర్షలు,  ద్వేషాలు, అంటరానితనాలు,  ఆర్థిక సంబంధాలు,  రాజకీయ విద్వేషాలు, అట్టడుగు ఆలోచనలు ఏవి, ఏవీ ఉండవు.

 మరి  ఏముంటుంది ఈ కథలో అంటే మనిషిలోని మనోచింతన ఉంటుంది.

 మనిషిగా బ్రతకడానికి కావలసిన తాత్వికత ఒక్క కథలో ఒక్కో ఆలోచన మనకు ముళ్ళ కిరీటాల నుండి విముక్తి కలిగిస్తాయనిపిస్తుంది.

           విద్వేషపు లోగిలి నుండి బతుకు భయం లో నుంచి జారిపోయే కాలంలో ఈ క్షణం,  ఈరోజు ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో చూసుకోమంటాయి. 

     ఒంటరితనానికి, ఏకాకి తనానికి మధ్య ఉన్న తెర ఏమిటో అర్థం చేసుకోవడానికి గొప్ప ఉదాహరణలు ఈ కథలు.

       రీడర్ ని ఇవి పరిగెత్తిచ్చి చదివించవు. గుండె బరువెక్కి ఏం జరుగుతుందో ఈ ఆలోచనలు ఎటు ప్రయాణిస్తున్నాయి.,  ఎక్కడ మొదలు , ఎక్కడ ముగింపు,  అంతుపట్టని అగాధాలలోని ఊహావేశపు మాతృకలని పరిచయం చేస్తాయి.

       ఒక్కసారిగా కూర్చుని మాత్రం ఈ పుస్తకం చదవాలి అనుకుంటే ఏమీ అర్థం కాదు. ప్రశాంతంగా మనదైన ఏకాంతంలో మనకోసం మనం చదువుకోవాలి.  అప్పుడే ఈ కథల్లోని సారం గుండెలోకి ప్రవహిస్తుంది.

      ప్రఖ్యాత నవలా రచయిత హెమింగ్వే  రచనా శైలి గుర్తొచ్చింద.  సముద్రం లోపలి మనిషినీ ఆవిష్కరించిన కథ గుర్తొచ్చింది ఈ కధలు చదువుతుంటే.

     ఈ కథలన్నింటికీ ప్రేరణ మనసుని కంపింపచేసే అలజడలే కారణం అనిపిస్తుంది.

 మరి ఇలాంటి ఆలోచనలు అందరిలో ఉండవా అంటే నీలో నాలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సందర్భంలో మనకి మనం తారసపడతాం. అలా తారసపడినప్పుడు నిన్ను నీవు గుర్తించగలగాలి. అలా గుర్తించగలిగిన క్షణాలు కొన్ని ఉంటాయి.  ఆలోచనల వరసల్లో కదిలే చిత్రాలు ఈ కథల మధ్య మనకు దొరుకుతాయి.

    ఈ కథల్లో ప్రధాన వస్తువు ‘తాత్వికత’ మనిషి మనసు చేసే కేరింతల నడుమ అన్ని కథలకు వస్తువు ఒక్కటే ఇసుమంత తేడా ఉండదు.  కథా వస్తువులో వీరందరూ విభేదించిన ఆలోచనలో, రూప, సారాల్లో కథా గమనాలు ఎలా మారాయి అన్నది ఈ కథల్లోని చింతన స్వరూపం.

        కథల్లోకి వెళ్తే

     ‘జెన్‘ నాయుడు గారు రిటైర్మెంట్ తీసుకున్న మిషనరీని ఆయన రిటైర్ అయినాక కూడా వినియోగంలోకి తేవాలన్న తపనలో ఏకలవ్య శిష్యుడిలా ప్రయత్నిస్తూనే ఉంటాడు. మెదడుకు పదును పెట్టే పాడైన వస్తువునే కాదు మనసుల్ని రిపేర్ చేయడంలో మెలకువ అవసరం అని చెప్తారు ‘పతంజలి’ గారు

      లోయ చివరి రహస్యం  జీవితాన్వేషణలో మనిషి తేలిక పడతాడో లేదో, పుట్టుక మరణం ఈ రెండింటి మధ్య ఇరుక్కున్న మనిషి స్వానుభవాలను వదిలి మిధ్యా జీవితంలోని లాలసను అందుకునే ప్రయత్నం ఇది. దేహదారులన్నీ వీడి గాలిలో కలిసిపోయే క్షణాలని ఉద్విగ్నంగా వివరిస్తారు.  ప్రకృతి మహా అందంగా ఉందండి మీ కథలో  “భగవంతం”  గారు.

     ‘వెదురు పువ్వు’ ఎదుటివారు మనకి చెప్పిన మాటలో మనోఫలకంపై ఉన్న మనిషి గురించిన విషయం అయితే ఎంతగా మెదడు ఒత్తిడికి గురి అవుతుందో తెలియజేసే కథ. ఓ వెదురు పువ్వు కానుకగా తీసుకెళ్లి తన భార్యకి ఇస్తే ఆమె పూర్తి ప్రేమ నీకు దక్కుతుందన్న ఒక చిన్న గారడి మాటకి ఆమెలోని ప్రేమకు మకుటం లేని మహారాజు అవ్వాలన్న తాపత్రయం నెరవేరిందా లేదా అన్న కుతూహలంతో మనసు చంచలత్వం లేకుండా మనసు చేసే తపస్సు “మధురాంతకం” గారి కథ.

  ‘ఒక సాయంత్రపు అదృష్టం’ ఒకానొక కాలంలో పుట్టుక మరణం మధ్య మనిషిగా నీకు నువ్వు మిగిల్చుకున్నది ఏమిటి అని ప్రశ్నించే కథ ఇది. సాధించాల్సిన టార్గెట్ల మధ్య జీవించడానికి వదిలేసుకుంటున్న మనిషి వ్యధ “ఖదీర్ బాబు” గారి చింతనలో మనకు మనలోనుండి రాలిపోతున్న క్షణాలు తారసపడతాయి.

      ‘పాఠాంతరం’  మనకు చేరుతున్న అంశమా లేదా మనం తీసుకున్న అంశము మాట్లాడుతున్న అంశము చెప్పాలనుకున్న విషయము కొన్నిసార్లు సూటిగా చర్చించలేము. ఒకసారి చదివిన పుస్తకం రెండోసారి చదివినప్పుడు మన ఆలోచన క్రమంలో మార్పు వస్తుంది మనిషికి కూడా నిర్ణయాలు సరియైనవి తీసుకోకపోయినప్పుడు వెనక్కు తిరిగిరానికాలం వేసే ప్రశ్నలలో జవాబులు లేని ప్రశ్నగా నిలబడి పోవాల్సి వచ్చినప్పుడు ఒక వ్యక్తికి సాయం చేయగలిగి చేయలేకపోయిన ఒత్తిడి ఎంత వేదనకు గురి చేస్తుందో మన అంతరాల్ని తడిమి చెప్తారు “చినవీరభద్రుడు” గారు.

   ‘ ఐకాంతిక’ ఏ కాంతిలో అయినా ఏకాంతాన్ని అన్వేషించడం.  ఒకరిని ప్రేమిస్తున్నాం అన్న ఆలోచనల్లో కరిగిపోతూ ఆ మనిషిని అందుకోవాలని తపన వెంటాడుతుంది ఈ కథలో. ప్రేమను అందుకొని, అందించాల్సిన  మనిషిని ఒంటరిగా రమ్మంటుంది. ఒంటరిగా రావడం అంటే మనిషి ఒక్కడుగా రావడం కాదు ఏకాంతంగా రావడం, ఏ చింత లేకుండా రావడం మనసు భారాన్ని వదిలించుకొని ఏకాంత భావనలో ఆమెను చేరలేకపోయిన బతుకు చిత్రాన్ని మనోహరంగా చెప్తారు “బండి నారాయణస్వామి” గారు.

      ‘సముద్రం’ అందరూ సముద్రాన్ని కలగంటారు. కానీ ఇక్కడ కథలో కథానాయకుడు సముద్రాన్ని నిర్మించాలనుకుంటాడు. సముద్రాన్ని చూడాలనుకుంటే ఎక్కడ సముద్రం ఉందా అని వెతుక్కుని అక్కడికెళ్ళి సేద తీరుతాం మనం . మరి ఇక్కడో సముద్రం కోసము నేలని,కొండలను,రాళ్లను, రప్పలను, పర్వతాలను తవ్వి వెతుకుతాడు.  విషయం తెలిసిన సముద్రం కథకుని వెతుకుతూ అతని చెంతకు చేరుతుంది.  కథ పూర్తయ్యేసరికి మనల్ని కూడా సముద్ర స్నానం చేయిస్తారు ‘రమణ జీవి’ గారు.

     దేవుని అటకాయించిన మనిషి. మానవత్వంతో ఉన్నవాడే దేవుడు అన్న నిజాన్ని మర్మగర్భంగా బిచ్చగాడి మనోఫలకాలని చూపించి ఒప్పించి చెప్తాడు మెహర్.

       ఈ కథల్లో సముద్రం తర్వాత అమేజింగ్ థాట్స్ అన్నట్లుగా ఉన్న కథ “పుష్ప వర్ణమాసం” మానసిక ఒత్తిడికి గురి అయిన వారు లోకంతో సంబంధం లేకుండా ఎలా నడుచుకుంటారో వాళ్ళ లోకంలో వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటారో మంచి భావుకతతో చెప్తారు “సామాన్య”.

   ‘వాంగ్మూలం’ నైతికత లోపించిన మనుషుల మధ్య బంధాలు బాంధవ్యాల మధ్య మిగుల్చుకున్న మనుషుల వికారపు చేష్టలను ‘స్వాతి కుమారి’ చెప్తారు.

 అతి తక్కువ మంది తమదైన ఏకాంతాన్ని సృష్టించుకుని ఇంట్రావర్ట్స్  గా మిగిలిపోతారు. వారి ప్రపంచంలో వారు సమ్మోహనంగా జీవిస్తారు. అటువంటి ప్రవాహంలో ఉన్న ఓ సంగీత కళాకారుడు అతన్ని చూసినప్పుడు, అతని సంగీతాన్ని విన్నప్పుడు ఆమె లో కలిగిన ఆలోచనల వెంట పరిగెత్తిన నీలి కళ్ళ పరిచయం , మనోఫలకం పైన మొలకెత్తిన దిగులు వెలిగించిన దీపాలు. విషాద ఏకాంతం కథ గొప్పగా చెప్తారు కాశీభట్ల వేణుగోపాల్ గారు.

    ‘మంచు’ ఏకాంత భావాలు మోసుకు తిరిగే సంచారితో నడవడం సామాన్యుడికి ఎంత కష్టమో చెప్పి, వద్దన్న పని చేసే  మనసులోని కురూపితనాన్ని వదిలి మనోవికాసాన్ని చేతబట్టిన కథ మూల సుబ్రహ్మణ్యం చెప్పారు.

     అజయ్ ప్రసాద్ గారి ‘గాలి పొరలు’  మనిషి దేహం పైన ఎన్ని పొరలుగా చర్మం కప్పబడి ఉందో మనసు పొరల్లో దాగిన జ్ఞాపకాల్లోనుండి చీలినప్పుడు గుండెల్లో వచ్చే శబ్దము ఈ కథ.

    ఏం జీవితం అంటూ చంద్ర కన్నెగంటి చెప్పిన చివరి క్షణాల్లోని మనిషి ఆశపడే క్షణాన్ని కథగా మార్చడం బాగుంటుంది.

       శ్రీవల్లి రాధికా రాసిన ‘నాన్న దగ్గరికి’ కథలో అమాయకత్వం నిండిన ప్రశ్నలలో ఎదిగే మనస్సు వేసే ప్రశ్నల్లోనుండి తెరలు దించుకున్న చైతన్యం లేని  సంకెళ్లను విడిపించుకున్న స్వేచ్ఛ కనిపిస్తుంది.

   ‘దౌలత్’ తండ్రి కొడుకుల మధ్య సారూప్యతల్లోని అగాదాలు పూడిపోయే క్షణాలు కొన్ని ఉంటాయని, ప్రతి బంధం వెనక కనిపించని కన్నీటి చెమ్మ గుండె కింద నదిలా ప్రవహిస్తూనే ఉంటుందని చెప్తుంది అపర్ణ.

     బ్రతికుండగానే మరణాన్ని పొందిన వారు లేరా అంటే చాలామంది మనకు తారసపడతారు.  తమ జీవన చక్రంలో చచ్చి బతికిన వాళ్ళు ఉంటారు,  కానీ కొందరు బ్రతుకుతూ ఓడిపోయి బ్రతికే వాళ్ళు మరణాన్ని నిత్యం అనుభవంలో పొందుతూనే ఉంటారు.  అటువంటి సంఘటనను తెలియచేసే కథ మేడి చైతన్య చెప్పిన “రెండో మరణం”.

 ‘అదృశ్యం’  యాత్రలు చేస్తారు కొందరు, సన్యసిస్తారు మరికొందరు, వీరి గురించి కథలు కథలుగా చెప్తారు కానీ అసలు త్యజించిన వారు ఎలా ఉంటారు. ఎలా ఉండాలి. హిమాలయాలకు వెళ్ళాం సన్యాసులమయ్యాము. సన్యాసి బ్రతుకుని బ్రతుకుతున్నాము అంటూ వికారపు మనుషుల మనస్తత్వాల్లో మనిషిలో మనిషి అదృశ్యం అవ్వడాన్ని  చక్కగా చెప్పారు ‘సుధా మోదుగు’.

       ‘విషప్ప్రేమ’   నేటి యువత ప్రేమల్లోని కల్చర్ ని, నేటి ప్రేమ రూపాన్ని,  మనుషులుగా గొడవ పడుతూ.., విడిపోతూ,  ప్రేమికులుగా కలిసిపోవడాన్ని నేటి ప్రేమగా మానస చాలా బాగా చెప్పారు. నిజానికి ఇప్పటి లైఫ్ స్టైల్ కూడా ఇదే అనిపించింది.

      ‘జీవగంజి’  జీవిత ప్రయాణంలో కొంత దూరం ప్రయాణించాక అలసట, విసుగు,నిరాకారము, నిరామయము , మోహము, అమోహమో తలకి ఎక్కుతుంది ఈ ప్రపంచంలో నా స్థానం ఏమిటి అన్న ప్రశ్న తలచుకున్నప్పుడు మనసు పెనుగులాటని పూడూరి రాజి రెడ్డి గారు కథ చేశారు.

      ఇలా ఈ పుస్తకం మనోయాత్ర చేసిన చింతనలలో సాగే కథలు.  ఈ పుస్తకానికి సంపాదకత్వం వహించిన  అజయ్ ప్రసాద్ గారికి, పుస్తక రూపంలో తీసుకువచ్చిన ఉదయిని కుమార్ కూనపరాజు గారికి,  ఎన్నెలపిట్ట ప్రచురణకర్త శేషుకి అభినందనలు.

For Copies

Rupa Rukmini

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *