ఈ దారిలో
నేను వేరొకరినయ్యుంటే
వెనక్కి తిరిగి చూసేవాడినే కాదు
ఒక బాటసారి
తన సహచరునితో చెప్పేదే
నేనూ చెప్పేవాడిని
అపరిచితుడా!
నీ చేతిలోని గిటార్ను నిద్రలేపు!
మన రేపటిని
ఇంకా కొంచెం ఆలస్యంచేయి
పాటతో మన బాట విస్తరించి
ఈ ఇరుకు చోటు
ఇంకాస్త విశాలమవొచ్చు
ఇద్దరం కలిసికట్టుగా
మన పాత వెతల కథ నుండి
బయటపడొచ్చు
నువ్వు అచ్చంగా నువ్వే
నీ ముందున్న నేను మాత్రం
నేను కాదు!
నేను వేరొకరిని అయ్యుంటే
ఈ దారికి
స్థానిక బాటసారినయ్యేవాడిని
నువ్వైనా
నేనైనా
ఈ దారిలో ఇక తిరిగి రాలేము!
ఆ గిటార్లోని పాటల్ని నిద్రలేపు
మనల్ని ఊరించే
తెలియని తోవ ఏదో తోచవొచ్చు
నడుస్తున్న ఈనేల
గురుత్వాకర్షణను పరీక్షించడానికి
నేను అడుగును మాత్రమే!
నా దిక్సూచివైనా
అగాధమైనా
నువ్వే
ఈ బాటలో
నేను ఇంకొకరిని అయిఉంటే
నా భావోద్వేగాలను
భద్రంగా సూట్కేస్లో దాచి ఉండేవాడిని
అప్పుడు నా కవిత
లోతైన నీరులా సగం మార్మికంగా
తెల్లగా తేలికగా
జ్ఞాపకం కంటే బలంగా
మంచు బొట్టు కంటే బలహీనంగా ఉండేది
అప్పుడు
ఈ విస్తీర్ణమంతా
నా అస్తిత్వమేనని ప్రకటించేవాణ్ణి
ఈతోవలో
నేను ఇంకొకరిని అయ్యుంటే
ఇంకో కొత్త స్వరాన్ని నేర్పమని
నా గిటార్ను అడిగేవాణ్ణి
ఎందుకంటే
ఇల్లు ఇంకా చాలా దూరంలో ఉంది
ఎంత దూరమైనా
ఇల్లు చేరే దారి అందమైనదని
నా కొత్త పాట చెప్తుతుంది
దారి పొడవు పెరినప్పుడల్లా
నడక అర్థం
మళ్ళీ మళ్ళీ కొత్తగా పుడుతుంది
నేనీ దారిలో ఇద్దరవుతాను
నేనూ
ఇంకా...
నా వేరొకరు!
మూలం: (If I Were Another)
మహమూద్ దర్విష్
పాలస్తీనా జాతీయ కవిగా గౌరవించబడే మహమూద్ దర్విష్ మార్చి 13, 1941 లో జన్మించారు. ప్రస్తుత ఇజ్రాయెల్కు ఏర్పాటు కోసం జియోనిస్ట్ మిలీషియాలచే తమ మాతృభూమిని కోల్పోయిన పాలస్తీనియన్లలో అతని కుటుంబం కూడా ఉంది .ఆ తర్వాత అతని కుటుంబం లెబనాన్కు పారిపోయింది. జీవితంలోని ఎక్కువ భాగం ప్రవాసంలో మగ్గిపోయిన అతనికి పాలస్తీనా తల్లి, పాలస్తీనా ఒక ప్రేయసి, నెరవేరని స్వేచ్ఛా వాంఛ.దాదాపు శతాబ్ద కాలంగా ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న శరణార్థులుగా జీవిస్తున్న పాలస్తీనియన్ల బాధలకు ఆయన కవిత్వం గొంతు నిచ్చింది .దర్విష్ 2008 ఆగస్టు 9న హ్యూస్టన్లో గుండె శస్త్ర చికిత్సకు సంబంధించిన సమస్యలతో మరణించారు. దర్విష్ దాదాపు ముప్పై కవితా సంపుటాలను ప్రచురించాడు, ఇవి ఇరవై రెండు కంటే ఎక్కువ భాషలలోకి అనువదించబడ్డాయి.అందులోంచి కొన్ని తెలుగులో స్వేచ్ఛానువాదంగా ఉదయిని పాఠకుల కోసం...
రహీమొద్దీన్
కవి రహీమొద్దీన్ ప్రభుత్వ ఉపాధ్యాయులు, మహబూబాబాద్ నివాసి. డిగ్రీ నాటి నుండి కవిత్వం రాస్తున్నారు. 2018 నుంచి రైటింగ్ ని సీరియస్ గా తీసుకున్నారు. 2023 లో 'కలల రంగు' కవిత్వ సంపుటి వెలువరించారు. పలు కవిత్వ సమీక్షలూ చేశారు.
