రక్తపు రంగు రొట్టె…!

Spread the love

అస్పష్టంగా తెల్లారిందీరోజు 
దట్టమైన పొగ మబ్బుల చాటుగా
అయిష్టంగానే ఉదయించాడు సూర్యుడు 
బతుకు భవనాలు కాలి కూలిపోతూఉంటే
తూర్పు దిక్కును కప్పేసింది
ఖనిజపు బూడిద

మేఘాల సిరల్లో
కుళాయిల ధమనుల్లో గడ్డగట్డిన నీరు
బీరుట్ నగర జీవితంలో 
ఇది చిక్కని నిరాశల శరదృతువు

రాజభవనం నుండి రేడియోకు
కోరికల సేల్స్ మాన్ కు
కూరగాయల మార్కెట్‌కు
మరణం గుబులు గుబులుగా వ్యాపించింది

సమయం సరిగ్గా ఐదు గంటలు
ఇప్పుడు మిమ్మల్ని నిద్ర లేపుతున్నదేమిటి?
బహుశా మృత్యువా?!
అప్పుడే ముప్పైమంది మరణించారు

తిరిగి పడుకోండి!
ఇదీ మరణ సమయం 
ఇదీ  మంటల సమయం
2
"ఇబ్రాహీం " ఒక అద్భుత చిత్రకారుడు
నీటిని ఒక బొమ్మగా చిత్రీకరించాడు
తన గుండెల మీద లిల్లీలను పెంచే
పూలకుండి అతడు!

తెల్లవారుజామున లేవడమంటే
మృత్యువును కళ్ళారా చూడడమేనని!
బహుశా అతనికీ తెలుసు గానీ
పాపం అతని పిల్లలకేం తెలుసు!

'లిలక్' పొదల పిలుపుతో
గోరువెచ్చని ఎండ స్పర్శతో
నిద్రలేచి చూస్తున్నారు
వాళ్ళ ఆకలి
పాలూ రొట్టెలు అడుగుతుంది

అంతుచిక్కని ఈరోజు
నా ముఖం
బుల్లెట్ల పొలంలో
గోధుమగింజలతో రాసిన టెలిగ్రామ్!
అదే
ఇప్పుడు మిమ్మల్ని మేల్కొల్పుతుంది!

సమయం సరిగ్గా ఐదుగంటలు
ముప్పైమంది మరణించారు

బేకరీలోని ఈ రొట్టెలకు
ఇంతకుముందెన్నడూ ఈ రుచిలేదు !
రక్తం గుసగుసలాడే ఈ రహస్యం
ఈ అనంత దిగులు నిండిన సారం ...
రొట్టెకు ఇంత మృత్యు వాసన
ఇంతకు ముందెన్నడూ లేదు!

సమయం సరిగ్గా ఐదు గంటలు
చనిపోతున్నదెవరు
బహుశా బాధితులేనా?
...చివరి రంగును
చేతుల్లోకి తీసుకున్నాడు ఇబ్రాహీం
అనేక రహస్యాలను కలిపిన
అతని రక్తపు రంగు అది

అతడు ఒక చిత్రకారుడు 
ఒక తిరుగుబాటుదారుడు
పోటెత్తిన ప్రజలతో 
ఓక్ చెట్లతో
యుద్ధంతో నిండిన నేల చిత్రాన్ని గీసాడు

సముద్రపు అలలు 
శ్రామిక ప్రజలు
వీధి వ్యాపారులు 
పల్లెటూర్లు
అన్నీ...
అద్భుతాన్ని చిత్రించాడు ఆ రొట్టెలో ...!

మూలం:   ( Bread)
 -  మహమూద్ దర్విష్)
మహమూద్ దర్విష్

పాలస్తీనా జాతీయ కవి‌గా గౌరవించబడే మహమూద్ దర్విష్ మార్చి 13, 1941 లో జన్మించారు. ప్రస్తుత ఇజ్రాయెల్‌కు ఏర్పాటు కోసం జియోనిస్ట్ మిలీషియాలచే తమ మాతృభూమిని కోల్పోయిన పాలస్తీనియన్లలో అతని కుటుంబం కూడా ఉంది .ఆ తర్వాత అతని కుటుంబం లెబనాన్‌కు పారిపోయింది. జీవితంలోని ఎక్కువ భాగం ప్రవాసంలో మగ్గిపోయిన అతనికి పాలస్తీనా తల్లి, పాలస్తీనా ఒక ప్రేయసి, నెరవేరని స్వేచ్ఛా వాంఛ.దాదాపు శతాబ్ద కాలంగా ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న శరణార్థులుగా జీవిస్తున్న పాలస్తీనియన్ల బాధలకు ఆయన కవిత్వం గొంతు నిచ్చింది .దర్విష్ 2008 ఆగస్టు 9న హ్యూస్టన్‌లో గుండె శస్త్ర చికిత్సకు సంబంధించిన సమస్యలతో మరణించారు. దర్విష్ దాదాపు ముప్పై కవితా సంపుటాలను ప్రచురించాడు, ఇవి ఇరవై రెండు కంటే ఎక్కువ భాషలలోకి అనువదించబడ్డాయి.అందులోంచి కొన్ని తెలుగులో స్వేచ్ఛానువాదంగా ఉదయిని పాఠకుల కోసం...

రహీమొద్దీన్

కవి రహీమొద్దీన్ ప్రభుత్వ ఉపాధ్యాయులు, మహబూబాబాద్‌ నివాసి. డిగ్రీ నాటి నుండి కవిత్వం రాస్తున్నారు. 2018 నుంచి రైటింగ్ ని సీరియస్ గా తీసుకున్నారు. 2023 లో 'కలల రంగు' కవిత్వ సంపుటి వెలువరించారు. పలు కవిత్వ సమీక్షలూ చేశారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *