తల్లి మనస్సు

Spread the love

పిడుగులాంటి వార్త! నాన్న ఏక్సిడెంట్లో పోయాడు! తాగుడు మైకంలో రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు స్పీడ్ గా వచ్చిన లారీ కింద పడి చనిపోయాడు.  శవాన్ని ఇంటికి తీసుకచ్చారు. అమ్మ హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకి నిశ్చేష్టురాలైంది. తర్వాత ఏడవడం ప్రారంభించింది. నేను, తమ్ముడు అమ్మ పక్కన చేరి ఆమె ఏడుపు చూసి ఏడవడం మొదలుపెట్టాం. అమ్మ అంత ఎందుకు ఏడుస్తుందో పదోక్లాసు చదువుతున్న నాకు, ఆరో క్లాసు చదువుతున్న తమ్ముడికి అర్థంకాలేదు. నాన్న ఉన్నప్పుడు అమ్మకి  దుఃఖం తప్ప ఎపుడూ సంతోషం లేదు.

నాన్న మహబూబ్ నగర్ లో ఉన్న ఒక స్కూలు ఆఫీసులో క్లర్క్ గా పనిచేసేవాడు. సంపాదనలో చాలావరకు తాగుడికి ఖర్చయ్యేది. ఇలా చేస్తే ఎలా అని అమ్మ అడిగితే కొట్టేవాడు. కూర బాగాలేదని, బట్టలు సరిగా ఉతకలేదని, ఇంకా చాలా చిన్న చిన్న విషయాలకి అమ్మని తిట్టేవాడు, సతాయించేవాడు. అమ్మ చూడటానికి బాగుండేది. అది కూడా ఆమె తప్పయిపోయింది. ఆమె మీద అనుమానంతో ఎవరితోనైనా మాట్లాడితే సహించలేకపోయేవాడు. అమ్మ అన్నింటినీ సహిస్తూ నేనూ, తమ్ముడే ఆమె లోకం అన్నట్లుండేది. వీలయినంతవరకు మాకే కష్టం కలుగకుండా నాన్న పడే చిరాకు నుండి,  వేసే దెబ్బలనుంచి మమ్మల్ని కాపాడేది. అమ్మ పిండివంటలు బాగాచేసేది. ఉన్నవారిళ్లల్లో పిండివంటలు చేసి ఎంతో కొంత సంపాదించి ఇల్లు గడిచేలా చూసేది.

ఇరుగుపొరుగు వాళ్ళ సహాయంతో నాన్న అంత్యక్రియలు జరిగిపోయాయి. ఆ తర్వాత ఇంటిని ఎలా నెట్టుకురావాలో తెలియక అమ్మ మదనపడసాగింది. ఒకరోజు అమ్మ స్నేహితురాలు కనకదుర్గ చూడటానికి వచ్చింది. అమ్మ తన గోడు చెప్పుకుంది.

“జానకీ! నువ్వు హిందీలో భాషాప్రవీణ కదా? మీ ఆయన పనిచేసే స్కూల్లో హిందీ టీచర్          పోస్ట్ కి ప్రయత్నించు. హిందీలో చక్కగా మాట్లాడగలవు కూడా. వెళ్లు మీ ఆయన పనిచేసిన స్కూల్ ప్రిన్సిపాల్ ని కలువు. ఆమె చాలా మంచిదని విన్నాను.  నీకు తప్పకుండా సహాయం చేస్తుంది అని సలహా ఇచ్చింది.

అమ్మ నిజామాబాద్ లో పుట్టింట్లో ఉన్నప్పుడు పక్కన ఉత్తర భారతీయుల కుటుంబముండేది. వారు హిందీలో మాట్లాడుకుంటుంటే  అమ్మకి ఆ భాష చాలా ఇష్టంగా అనిపించేది. వారి దగ్గర మాట్లాడటం నేర్చుకుంది. వాళ్ళ ప్రోత్సాహంతో హిందీ పరీక్షలు రాసి పాసయిది.  అమ్మ పదవ తరగతి వరకు చదువుకుంది. పెళ్లి అయిన తర్వాత నాన్నకి ఇష్టం లేక ఎక్కడా ఉద్యోగం చేయలేదు. ఇంట్లోనే  హిందీ పుస్తకాలు చదువుకుంటూ ఉండేది.

అమ్మకి కనకదుర్గ ఆంటీ మాటలు ధైర్యానిచ్చాయి. వెళ్ళి ప్రిన్సిపాల్ ని కలుసుకుంది. అమ్మతో పాటు నేనూ వెళ్ళాను. ఆమె చాలా ఆదరంగా మాట్లాడింది.

        “జానకీ! నీ ఉద్యోగం గురించి మేనేజ్మెంట్ తో తప్పక మాట్లాడుతాను. నిజానికి మీ ఆయన స్థానంలో నీకా ఉద్యోగం ఇవ్వాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ కి ఉంది.  ఏ సంగతి నీకు త్వరలో తెలియజేస్తాను” అంది.

మేం సంతోషంగా ఇంటికొచ్చాం. ప్రిన్సిపాల్ హామి ఇచ్చినట్లుగానే రెండు నెలల్లో అమ్మకి హిందీ టీచర్ గా ఉద్యోగం వచ్చింది. అమ్మ ముఖం వెలిగిపోయింది. జీవితంలో మొదటిసారిగా ఆమె మొహంలో ఆనందం చూడగలిగాను. నన్ను, తమ్ముడ్ని గుండెలకి హత్తుకుని ఆనందబాష్పాలు కార్చింది.

       అప్పటినుంచి మా జీవితాలు ఒక గాడిలో పడ్డట్టయింది.  అమ్మ చీకటితోనే లేచి టిఫిను, వంట చేసేది. మాకు పెట్టి,  తను తిని, ముగ్గురికి క్యారేజీలు సర్దేది.   ముగ్గురం స్కూళ్ళకి వెళ్లేవాళ్ళం. సాయంకాలం వచ్చి పనంతా చేసుకుని, పుస్తకాలు ముందేసుకుని మరుసటి రోజు క్లాసులకి ప్రిపేర్ అయ్యేది. అమ్మని చూసి నేను కూడా పనిలో కొంతలో కొంత సాయం చేస్తుండేదాన్ని. కానీ అమ్మ నన్ను ఎక్కువగా చెయ్యనిచ్చేది కాదు.

“సుజా! నువ్వు, తమ్ముడు, పెద్ద చదువులు చదువుకుని పైకి రావాలి. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. అదే నా కోరిక, ఆశయం కూడా” అనేది.

అమ్మ కోరిక తీర్చాలని నాలో పట్టుదల వచ్చింది. టెన్త్ పరీక్షలకి బాగా చదివి పాసయ్యాను. మహబూబ్ నగర్ కాలేజిలో ఇంటర్మీడియట్ లో చేరాను. తమ్ముడు కూడా మంచి మార్కులతో పాసయి ఏడో తరగతికి వచ్చాడు.

నేను అమ్మలాగే ఒడ్డుపొడుగుతో బాగుండేదాన్ని. నాకు అమ్మ అందం వచ్చిందని అందరూ అనేవారు. ఆటలు బాగా ఆడేదాన్ని. బాడ్మింటన్ సింగిల్స్, డబల్స్ రెండింట్లో ఆడేడాన్ని. జిల్లా లెవెల్ లో ఫ్రైజ్ కూడా వచ్చింది. అమ్మ కూడా ఆటల విషయంలో ప్రోత్సహించేది. ఇంటర్మీడియట్ ఫైనల్లో ఉండగా స్టేట్ లెవెల్ లో ఆడటానికి హైదరాబాద్ లో స్పోర్ట్స్ క్యాంప్ పెట్టారు. మా కాలేజీ వాళ్ళు నన్ను కూడా పంపారు.

అక్కడే మురళీతో పరిచయం అయింది. అతను ఎత్తుగా, చక్కని ముఖకవళికలతో బావుండేవాడు. అతను బాడ్మింటన్ సింగిల్స్ బాగా ఆడేవాడు. మొదట్లో పరిచయం మాట్లాడటం వరకే ఉండేది. క్రమేణ అతనిలో మార్పు రావడం మొదలయింది.  నాతో చనువుగా ఉండటం, నా అందాన్ని, ఆటని మోచ్చుకోవడం చేసేవాడు. నన్ను వంటరిగా కలవడానికి  ఇష్టపడేవాడు. నేను కూడా నెమ్మదిగా అతని ఆకర్షణలో పడిపోయాను. అతను హైదరాబాద్ లో ఉంటాడు. తల్లీ, తండ్రి లేరు. అన్నయ్య మదన్ అతనికంటే ఎనిమిదేళ్ళు పెద్ద. రైల్వేస్ లో ఉద్యోగం. రైల్వే క్వార్టర్స్ లో అన్నయ్య, వదినలతో ఉండేవాడు.

       ఇంటర్ లో మంచి మార్కులతో పాసయ్యాను. బి.ఏ.,  హైదరాబాద్ లో చెయ్యమని మురళి ప్రాదేయపడ్డాడు. హైదరాబాద్ లో ఉంటే కేరీర్ కి ఇంకా మంచిదని అమ్మని ఒప్పించి ఉమెన్స్ కాలేజిలో చేరాను. అది మెరిట్ స్టూడెంట్స్ చదవే కాలేజీ! నాకు మంచి మార్కులు రావడం వలన సీటు సునాయసంగా దొరికింది. కాలేజ్ హాస్టల్ లో ఉండేదాన్ని.

           హైదరాబాద్ లో మురళిని కల్సుకోవడం ఎక్కువయింది. ఇక మ్యాచ్ లప్పుడు, స్పోర్ట్స్ క్యాంపులప్పుడు సరేసరి. నాతో శారీరక సంబంధం పెట్టుకోవాలని చూసేవాడు. నేను ససేమిరా అనేదాన్ని.

“సుజాతా! మనిద్దరం ఎలాగూ పెళ్ళి చేసుకుంటాం కదా? అంత బెట్టు చేస్తావేం?” అనేవాడు.

“మీరు పెద్ద కులస్థులు. మీ అన్నయ్య, వదిన మన పెళ్ళికి ఒప్పుకుంటారా? ముందు వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకొ!” అనేదాన్ని.

         ఇక చేసేది లేక వాళ్ళని పెళ్ళికి ఒప్పించాడు. ఒకరోజు నేను, మురళి కలసి మహబూబ్ నగర్ వెళ్ళి అమ్మకి చెప్పాం. అమ్మ మొదట నిర్ఘాంతపోయింది. చివరికి నేను మురళి ప్రేమలో నిండా మునిగున్నానని గ్రహించి ఒప్పుకుంది. కానీ ఉద్యోగాలొచ్చి సెటిల్ అయ్యేదాక ఆగమంది. నన్ను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది. తమ్ముడు సురేష్ మురళి పర్సనాలిటీ చూసి బాగా ఇష్టపడ్డాడు.

           రోజులు గిర్రున తిరిగాయి. నా బి.ఏ., మురళి ఎమ్.ఏ., పూర్తయ్యాయి. మురళికి స్టేట్ గవర్నమెంట్లో, ట్రాన్సెపోర్ట్ డిపార్ట్మెంట్లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చింది. అమ్మ అమితానందపడింది. మంచి ముహుర్తం పెట్టించి పెళ్ళి జరిపించింది. ట్రాన్సుపోర్ట్ డిపార్ట్ మెంట్ క్వార్టర్స్ లో సంసారం మొదలయింది. సంవత్సరంలోనే జాగృతి పుట్టింది. నేను ఎమ్.ఏ.,లో చేరాను. ఎమ్.ఏ., పూర్తయ్యేనాటికి రెండో అమ్మాయి మహతి పుట్టింది. అమ్మ రెండు డెలివరీలప్పుడు స్కూలుకి లాస్ ఆఫ్ పే మీద ఆర్నెల్లు సెలవు పెట్టి నా దగ్గరుండి ఎంతో సహాయం చేసింది. అమ్మ వెళ్లినతర్వాత తీరికలేని పనితో పిల్లలిద్దర్నీ చూసుకుంటూ సతమతమయ్యేదాన్ని. మురళి మీద ధ్వాస తగ్గింది.  

      మూడేళ్ళు గడిచాయి. ఎమ్.ఏ.లో నాకు చదువు చెప్పిన ప్రొఫెసర్లు నన్ను పిహెచ్.డి., చెయ్యమని, స్కాలర్ షిప్ తప్పక వస్తుందని ప్రోత్సహించారు. నన్ను డాక్టరు సుజాతగా చూడాలనుకున్న అమ్మ కోరిక తీర్చాలన్న పట్టుదలతో పిహెచ్.డి.,కి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. పిల్లల్ని స్కూలునుంచి క్రష్ కి వెళ్లే ఏర్పాటు చేశాను. ప్రొద్దున్నే లేచి వంట చేసి, వాళ్ళని క్యారేజీలతో స్కూలుకు పంపి, యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్లేదాన్ని. సాయంత్రం వాళ్ళని క్రష్ నుండి ఇంటికి తెచ్చేదాన్ని. మళ్లీ వంట చేసి, వాళ్ళతో హోమ్ వర్క్ చేయించి, చదవించేదాన్ని. వాళ్లు తిని పడుకున్న తర్వాత నాకంటూ సమయం దొరికేది.

       ఈ బాధ్యతల్లో మునిగి తేలుతూ మురళీలో వస్తున్న మార్పుల్ని ఆలస్యంగా గుర్తించాను. తాగటం ఎక్కువ చేశాడు. బెడ్రూమ్ లో పక్క నలిగి ఉండేది. నాకు అనుమానం రాసాగింది. నా భ్రమేమోలే అనుకుని సమాధానపడేదాన్ని. ఒకసారి లేడీస్ హెయిర్ పిన్, లిప్ స్టిక్ మరకలు కనపడ్డాయి. మురళిని నిగ్గదేశాను. మొదట్లో బుకాయించినా, చివరికి కోపంగా అరిచేవాడు.

     “నా ఇష్టం. నువ్వెప్పుడు బీజీగా ఉంటావు. పిల్లలతోనే నీ లోకం. నా అందం చూసి వెంటబడే ఆడవాళ్ళు కోకొల్లలు. నీ పని నువ్వు చూసుకో. నీ పని నువ్వు చూసుకే నాకు అడ్డంరాకు” అనేవాడు.

అప్పటి నుంచి మనస్పర్ధలు మొదలయ్యాయి. అతను పిల్లల్ని పట్టించుకునేవాడు కాదు. అన్నీ నేనే చూసుకోవాల్సి వచ్చేది. నేనేమన్నాఅంటే కోపంతో చేతిలో ఎదుంటే అది విసిరేసేవాడు. అప్పడప్పుడు నా మీద చెయ్యి చేసుకునేవాడు. పార్టీలు చేసుకుంటూ రాత్రిళ్లు ఇంటికి ఆలస్యంగా వచ్చేవాడు. అదివరకి మురళేనా అని బాధ పడేదాన్ని, ఏడ్చేదాన్ని.

జాగృతికి ఎనిమిదేళ్ళు వచ్చాక మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యాను. ఈసారి ఎవరు పుట్టినా మా అన్నయ్యకి ఇవ్వాల్సిందే అని మురళీ వత్తిడి పెట్టసాగాడు. నేను కాదు కూడదంటే ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా చెయ్యిచేసుకునేవాడు. వాళ్ళన్నయ్యకి పెళ్లయి ఇన్నేళ్లయినా పిల్లలు పుట్టలేదు. వాళ్లు కూడా పుట్టిన బిడ్డని దత్తత తీసుకుంటామని వత్తిడి పెట్ట సాగారు. కొడుకు పుట్టాడు. హాస్పిటల్ నుంచి బలవంతంగా నన్ను వాళన్నయ్య వాళ్ళింటికి తీసుకెళ్లారు. జాగృతి, మహతీలను కూడా అక్కడికి తీసుకొచ్చారు. మమ్మల్ని ఒక గదిలో పెట్టి, పిల్లవాణ్ణి పాలు ఇచ్చేటప్పుడు తప్ప మిగతా సమయాల్లో వాళ్ళ దగ్గరే ఉంచుకునేవారు. నా ప్రాణం ఉసూరుమనేది. వాడ్ని నా పక్కలో పడుకోపెట్టుకోవాలని హృదయం తహతహలాడేది. వాడికి ఆర్నెల్లు వచ్చేవరకు నా పాలిచ్చాను. ఆ తర్వాత వాడికి పోతపాలు అలవాటు చేశారు. నన్ను, కూతుళ్ళను ఇంటికి పంపేసారు. వాడి కోసం నా తల్లి హృదయం ఆక్రోసించేది. ఎదురు తిరిగితే కొట్టి బెదిరించేవారు. మొదట్లో అప్పడప్పుడు, చూపించేవారు. రాను రాను అది కూడా మానేసారు.

జాగృతికి పన్నెండేళ్ళు వచ్చాయి.  బాగా ఒడ్డుగా పెరిగి అందంగా తయారయింది. పెద్దమనిషి కూడా అయింది. ఈ మధ్య కొన్ని నెలలుగా దానిలో మార్పు కనబడింది. ముభావంగా తయారయింది. అడిగిన దానికి సమాధానం చెప్పడమేగాని తనంతట తను మాట్లాడటం మానేసింది. ముఖంలో దిగులు కనపడేది. మొదట్లో పెద్దదవుతుంది కదా అని సమాధాన పడేదాన్ని. ఎంతో మృదువుగా బుజ్జగించి అడిగేదాన్ని. ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడనుంచి లేచి వెళ్ళిపోయేది. నాకు ఆందోళన కలగసాగింది.  నా పనిలో పడి పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నానేమొనన్న అపరాధభావం నాలో కలిగేది. ఇప్పుడు పిల్లలు స్కూలు నుంచి క్రష్ కి వెళ్ళకుండా నేరుగా ఇంటికే వస్తున్నారు. అందుకని నేను ఆరింటికి కాకుండా  నాలుగింటికే ఇంటికి రావడం మొదలుపెట్టాను.

         ఒకరోజు అనుకోకుండా మూడింటికే ఇంటికొచ్చాను. మహతీ ఇంట్లో లేదు. జాగృతి కూడా కనపడలేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బెడ్ రూమ్ తలుపు దగ్గరికి వేసుంది. బెదురూమ్ తలుపు తోసి నిశ్చేష్టురాలయ్యాను. జాగృతి నగ్నంగా పడుకునుంది. మురళి దాని మీదకి వంగి ముద్దులు పెడుతున్నాడు. అది దిగులుగా గోడవైపు చూస్తున్నది. నాకు పట్టరాని కోపం వచ్చింది.    

      “మురళీ! ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వసలు మనిషివేనా?” అని గావు కేక పెట్టాను.

మురళి గాబరాగా లేచి బట్టలు సవరించుకుంటూ బయటికి వెళ్ళాడు. నేను జాగృతి దగ్గరికెళ్ళి దానికి బట్టలు వేసి గుండెలకు హత్తుకుని పెద్దగా ఏడ్చాను. అది కూడా నన్ను గట్టిగా పట్టుకుని ఏడ్చింది.

“ఏన్ని రోజుల్నించి ఇలా జరుగుతుంది? నాకెందుకు చెప్పలేదమ్మా? అమ్మకి కూడా చెప్పకుండా రహస్యంగా ఉంచావా?” అని వెకివెక్కి ఏడ్చాను.

ఒక ఆర్నెల్ల నుంచి ఇలా జరుగుతుందని వెక్కిళ్ళ మధ్య ఎంతో బతిమాలితే చెప్పింది.

       “ఇంటికి రాగానే చెల్లిని దాని ఫ్రెండ్స్ ఇంటికి పంపేవాడు.  ఈ విషయం ఎవరికైనా చెబితే నిన్ను చంపేస్తానని బెదిరించాడు నాన్న. నువ్వు లేకుండా ఎలా ఉండాలమ్మ? నన్నెప్పుడూ నాన్న దగ్గర వదలేసి వెళ్లకమ్మ !”  అని హృదయవిదారకంగా రోదించింది.

          నా హృదయం ద్రవించిపోయింది. ఇన్ని రోజులూ జాగృతి ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటున్నా గ్రహించలేని బుద్దిహనురాలినని నన్ను నేను తిట్టుకున్నాను. శపించుకున్నాను. చాలాసేపటి తేరుకుని జాగృతిని తీసుకుని బయటికొచ్చాను. మురళి ఎక్కడాకనపడలేదు. అతని మొటర్ బైక్ కూడా లేదు. వెళ్లిపోయినట్లున్నాడు.

         “చీము, నెత్తురున్న మనిషివైతే మళ్ళీ ఈ ఇంటిరాకు. వస్తే నాలో రాక్షస రూపాన్ని చూస్తావు. జాగ్రత్త! నిన్ను నా జీవితంలో క్షమించలేను” అని మెసేజ్ పెట్టాను.

         మరుసటిరోజు జాగృతిని తీసుకుని విమెన్స్ పోలీస్ సెల్ కి వెళ్ళాను. వాళ్ళు చెప్పిన ప్రకారం మురళి మీద కేస్ వేసాను. అన్ని సాక్ష్యాలతో బుజువు అవడం వలన మురళిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కొడుకు వాసుని కూడా నా దగ్గరికి తెచ్చుకోడానికి ప్రయత్నాలు మొదలెట్టాను. లాయర్స్ సలహా ప్రకారం కోర్టులో కేసు వేసాను. డి.ఎన్. ఏ. టెస్ట్, ఇంకా వాడు పుట్టిన హాస్పిటల్ వాళ్ళ సాక్ష్యాల ఆధారంగా కోర్టు వాడిని నాకప్పగించింది.

       జాగృతికి ఆర్నెల్లపాటు కౌన్సిలింగ్ ఇప్పించాను. చదువేకాకుండా ఆటలు, నాట్యం, సంగీతం మీద ఆసక్తి కలిగేలా ప్రయాసపడ్డాను. ఎక్కువ ఆలోచించే సమయం ఉడకుండా వీటిల్లో బిజీగా ఉండేలా ఏర్పాట్లు చేసాను. అది కొన్ని నెలల్లోనే తేరుకుని అందరి పిల్లల్లా సంతోషంగా ఉండటం చూసి తృప్తిగా  నిట్టూర్చాను. మహతి కూడా ఏదో అర్థం అయినట్లు అదివరకటికంటె అక్కతో ప్రేమగా ఉండసాగింది.

         పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ పిహెచ్.డి., థీసిస్ సబ్మిట్ చేశాను. ఉద్యోగాలకు దరకాస్తులు పెట్టుకున్నాను. నేను చదివిన ఉమెన్స్ కాలేజీలోనే లెక్చరర్ పోస్ట్ ఇచ్చారు . కాలేజీలో ఉన్న లెక్చరర్స్ క్వార్టర్స్ కి మారిపోయాను. అమ్మని ఉద్యోగం మాన్పించి నా దగ్గరికి తెచ్చుకున్నాను. దానివలన ఈ వయస్సులో ఆమె విశ్రాంతిగా ఉండటమే కాకుండా, నాకు, పిల్లలకు తోడూ, నీడా అయింది. తమ్ముడు, మరదలు మహబూబ్ నగర్ లో ఉద్యోగాలు చేసుకుంటూ, పిల్లలతో హాయిగా ఉన్నారు.

ఎన్నో చేదు వాస్తవాలను చవిచూచిన నా మనస్సు విరిగి ముక్కలైంది. నా పిల్లల్ని పెద్ద చేసి, మంచి చదువులు చదివించి, మనసున్న మనుషులుగా తీర్చి దిద్దడమే నా జీవిత పరమార్థం అనుకున్నాను. ఇంతకంటే నేను జీవితంలో ఆశించేది ఏమి లేదు!

శాంతిశ్రీ బెనర్జీ

శాంతిశ్రీ బెనర్జీ గుంటూరు లో పుట్టి పెరిగారు. ఎమ్.ఏ., వరకు వారి విద్యాభ్యాసం అక్కడే జరిగింది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, డిల్లీ లో ఎమ్.ఫిల్., చేసారు. తీన్ మూర్తి భవన్, డిల్లీ లో నెహ్రూ కి సంబంధించిన 'సెలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ' ప్రాజెక్టు లో అసోసియేట్ ఎడిటర్ గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అప్పటి నుంచి కథలు, కవితలు, వ్యాసాలు, ట్రావెలాగ్స్ రాస్తున్నారు. అవి వివిధ ప్రింట్, వెబ్ పత్రికల్లో ప్రచురించ బడ్డాయి. 2022లో వారి కథా సంపుటి 'మానుషి', కవితా సంపుటి 'ఆలంబన' వచ్చాయి.


Spread the love

One thought on “తల్లి మనస్సు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *