మా నేలకు...
దేవుని వాక్కుకు దగ్గరగా,
మేఘాలు పైకప్పుగా ఉన్న
మా నేలకు
నామ విశేషణాలకు దూరంగా
ఉనికి లేని దేశ పటం లాంటి
మా నేలకు
నువ్వు గింజ అంత చిన్నగా
ఆకాశం భూమి కలిసే స్వర్గమయ క్షితిజరేఖ అదృశ్య లోయ
మా నేలకు
పవిత్ర గ్రంథాలు... అస్తిత్వ గాయం
'గ్రౌస్ ' పక్షి రెక్కలంత నిరుపేద
మా నేలకు
గతం ఆకస్మికంగా చేసే కొత్త దాడిలో,
శిధిల పర్వతాలు చుట్టి ఉన్న
మా నేలకు
దహించే ఆకాంక్షతో చావడానికి స్వేచ్చ
యుద్దం ఇచ్చే బహుమతి
మా నేలకు
ఇంకా...
మా నేల
రక్తసిక్తమైన రాత్రి,
దూరాల అవతలి దూరాల నుండి చూస్తే
మెరిసే ఆభరణపు పైపూత
లోపలి మాకు మాత్రం
ఊపిరాడని ఉక్కపోత!
మహమూద్ దర్విష్
పాలస్తీనా జాతీయ కవిగా గౌరవించబడే మహమూద్ దర్విష్ మార్చి 13, 1941 లో జన్మించారు. ప్రస్తుత ఇజ్రాయెల్కు ఏర్పాటు కోసం జియోనిస్ట్ మిలీషియాలచే తమ మాతృభూమిని కోల్పోయిన పాలస్తీనియన్లలో అతని కుటుంబం కూడా ఉంది .ఆ తర్వాత అతని కుటుంబం లెబనాన్కు పారిపోయింది. జీవితంలోని ఎక్కువ భాగం ప్రవాసంలో మగ్గిపోయిన అతనికి పాలస్తీనా తల్లి, పాలస్తీనా ఒక ప్రేయసి, నెరవేరని స్వేచ్ఛా వాంఛ.దాదాపు శతాబ్ద కాలంగా ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న శరణార్థులుగా జీవిస్తున్న పాలస్తీనియన్ల బాధలకు ఆయన కవిత్వం గొంతు నిచ్చింది .దర్విష్ 2008 ఆగస్టు 9న హ్యూస్టన్లో గుండె శస్త్ర చికిత్సకు సంబంధించిన సమస్యలతో మరణించారు. దర్విష్ దాదాపు ముప్పై కవితా సంపుటాలను ప్రచురించాడు, ఇవి ఇరవై రెండు కంటే ఎక్కువ భాషలలోకి అనువదించబడ్డాయి.అందులోంచి కొన్ని తెలుగులో స్వేచ్ఛానువాదంగా ఉదయిని పాఠకుల కోసం...
రహీమొద్దీన్
కవి రహీమొద్దీన్ ప్రభుత్వ ఉపాధ్యాయులు, మహబూబాబాద్ నివాసి. డిగ్రీ నాటి నుండి కవిత్వం రాస్తున్నారు. 2018 నుంచి రైటింగ్ ని సీరియస్ గా తీసుకున్నారు. 2023 లో 'కలల రంగు' కవిత్వ సంపుటి వెలువరించారు. పలు కవిత్వ సమీక్షలూ చేశారు.
