అధ్యాయం -20
వసంతకాలం వచ్చినా ఇంకా పూర్తిగా వాతావరణం చల్లబడలేదు.ఎప్పుడో ఓ సారి ఓ వాన జల్లు పడుతూ ఉంది. శక్తి హీనంగా ఉన్న సూర్యుడు చిన్న పట్టణమైన బైఖోవ్ లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నాడు. అక్టోబర్ నెల నుండి పక్షుల వలస ఆరంభమైంది. రాత్రుల సమయాల్లో కూడా ఆ పక్షుల అరుపులు ఆ ప్రాంతమంతా ధ్వనిస్తూనే ఉన్నాయి. చల్లటి గాలుల్లో, అప్పుడప్పుడు కురిసే మంచులో, ఆ చల్లదనాన్ని భరిస్తూనే ఆ పక్షులు వలస పోతున్నాయి.
కొర్నిలోవ్ విషయంతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కుo టున్న ఖైదీలు అప్పటికే ఆరు వారాల నుండి విచారణ కోసం చూస్తున్నారు.బైఖోవ్ లో వారి నిర్భంద జీవితం ఒక రకంగా స్థిరపడి పోయి, ఒక అసాధారణ దినచర్యగా మారిపోయింది. ఉదయం అల్పాహారం తర్వాత జనరల్స్ నడక కు వెళ్లేవారు. తిరిగి వచ్చాక వారికి వచ్చిన ఉత్తరాలు, సందేశాలు చదువుకునేవారు. తమను చూడటానికి వచ్చిన మిత్రులు , బంధువులతో ఆత్మీయంగా ఉండేవారు. మధ్యాహ్నం భోజనం తర్వాత కొద్ది సేపు చిన్నపాటి కునుకు తీసేవారు.
సాయంత్రాలు కొర్నిలోవ్ గదిలో అందరూ సమావేశమై, మాట్లాడుకుని, అర్ధ రాత్రి అయ్యే వేళకు తిరిగి వెళ్లిపోయేవారు.
వారికి జైలుగా ఉన్న ఆ యువతుల పాఠశాల పెద్దగా అసౌకర్యంగా లేదు.
ఆ భవంతిని బయట సెయింట్ జార్జ్ బెటాలియన్ మనుషులు కాపలా కాస్తే, లోపల టెకిన్లు రక్షణగా ఉండేవారు. ఈ కాపలాదారులు కొన్ని విషయాల్లో కఠినంగా ఉన్నప్పటికీ కూడా, వారు అక్కడ ఉన్న ఖైదీలు ఏ క్షణంలోనైనా తప్పించుకుపోవడానికి వీలు ఉండేలా వ్యవహరించేవారు. అక్కడ ఉన్నంతకాలం ఖైదీలుగా ఉన్నవారు బయటి ప్రపంచంతో అడ్డంకులు లేకుండా సంబంధాలు పెట్టుకుంటూ, బుర్జువా వ్యవస్థ వేగంగా విచారణ జరిగే దిశలో ఒత్తిడి ఉండేలా చేసేవారు.వారు విప్లవ జాడలు కనిపించకుండా జాగ్రత్త పడుతూ, అక్కడి అధికారుల భావోద్వేగాలను గమనిస్తూ, చివరిగా పారిపోవడానికి ప్రణాళికలు వేసుకున్నారు.
టెకిన్లను తనకు విధేయులుగా ఉంచుకోవాలన్న ఉద్దేశంతో కలేడిన్ తో సమాచార వ్యవహారాలు మొదలుపెట్టాడు. అతన్ని ఒత్తిడి చేసి ఒప్పించి, తుర్కేస్తాన్ లో తిండి కూడా లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు బండ్ల మీద ధాన్యం పంపించే ఏర్పాటు చేశాడు. తనకు దాడుల్లో సహకరించిన అధికారుల కుటుంబాలకు సాయం అందించడానికి మాస్కో, పెట్రో గ్రాడ్ లలో ఉన్న పెద్దగా బ్యాంకుల అధికారులకు ఘాటైన ఉత్తరాలు రాసాడు కొర్నిలోవ్. కొన్ని ఇబ్బందికర రహస్యాలు బయట పడకుండా ఉండేందుకు వారు వేల రూబుళ్ళు ఇచ్చారు. నవంబర్ వరకూ కూడా కొర్నిలోవ్ కాలేడిన్ తో సమాచారాలు నెరుపుతూనే ఉన్నాడు.
అక్టోబర్ మధ్యలో పంపించిన పెద్ద ఉత్తరంలో డాన్ లో పరిస్థితి గురించి, తాను అక్కడికి వస్తే కొసాక్కుల స్పందన గురించి కనుక్కోవడానికి రాసాడు. కాలేడిన్ సమాధానాలు సంతృప్తికారంగా ఉన్నాయి.అక్టోబర్ ఉద్రిక్తత వల్ల బైఖోవ్ ఖైదీల కాళ్ల కింద భూమి కంపించేలా చేసింది. ఆ తర్వాతి రోజు అన్ని దిక్కుల్లో వార్తహకులతో సందేశాలు పంపించారు. ఒక వారం తర్వాత ఆ ఖైదీల పట్ల ఆపేక్ష ఒక ఉత్తరం రూపంలో కాలేడిన్ నుండి ఇప్పుడు కమాండర్ ఇన్ చీఫ్ గా ఉన్న జనరల్ దుఖోనిన్ కు వచ్చింది.
కొర్నిలోవ్,ఖైదీలుగా ఉన్న ఇతర అధికారుల బాధ్యత తనకు అప్పగించమని అడిగాడు కాలేడిన్ ఆ ఉత్తరంలో. కొసాక్కు సైన్య దళాల నుండి, సైన్య-నౌకా దళ అధికారుల కమిటీ నుండి కూడా ఇటువంటి సందేశాలే వచ్చాయి. దుఖోనిన్ సందిగ్దతలో పడ్డాడు.
నవంబర్ ఒకటో తేదీన కొర్నిలోవ్ అతనికి ఓ ఉత్తరం పంపించాడు.ఆ ఉత్తరంలో పక్కగా సూచనలు ఇస్తున్నట్టు దుఖినోవ్ రాసిన వ్యాఖ్యలు ప్రధాన కార్యాలయ దీన స్థితికి చిహ్నాలుగా ఉన్నాయి.అప్పటికే సైన్యం మీద ఆ కార్యాలయ అధికారం పూర్తిగా పోయింది.
యువర్ ఎక్సలెన్సీ ,నికోలాయ్ నికోలాయేవిచ్,
విధి ఇప్పుడు మీపై చరిత్రను మార్చే పెద్ద భారాన్నే పెట్టింది. ఓ పక్క సైన్య అధికార వర్గం ఎటు తేల్చుకోలేక ఊగిసలాడుతూ ఉన్నారు, ఇంకో పక్క కొందరు రహస్యంగా శత్రువులతో చేతులు కలుపుతున్నారు. ఈ సందర్భంలో దేశం కోసం నిలబడాలి లేదంటే రాజీనామా చేయాలి. లేకపోతే ఈ దేశం విధ్వంసానికి మనవాళ్ళే కారణం అవుతారు.
ఇప్పటివరకూ నాకున్న సమాచారం మేరకు, పరిస్థితి విషమంగానే ఉంది కానీ పూర్తిగా చెయ్యి జారిపోలేదు. ఒకవేళ ఈ కార్యాలయాన్ని బొల్షివిక్కులు చేజిక్కించుకునే అవకాశం ఇస్తే మాత్రం ఇక ఏమి చేయడానికి ఉండదు.
సెయింట్ జార్జ్ బెటాలియన్ లో సగం మందికి పైగా వారి ప్రభావంలోనే ఉన్నారు. బలహీనపడి ఉన్న తెకిన్ రెజిమెంటు ఈ పరిస్థితుల్లో పెద్ద బలమవ్వదు. ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మీరు వెంటనే తగు చర్యలు చేపడితే రాబోయే ప్రమాదాన్ని నివారించగలము.
నేను మీకు సూచించే చర్యలు ఏమిటంటే:
1)వెంటనే ఇక్కడి కార్యకలాపాలను మొగిల్యోవ్ లో ఉన్న జెక్, పోలిష్ ఉలాన్ రెజిమెంట్ల దగ్గరకు బదిలీ చేయడం.
దుఖోనిన్ వాఖ్య:ఆ రెజిమెంట్లు అసలు నమ్మదగినవి కావని,అవకాశం ఉంటే బొల్షివిక్కులతో మొదట రాజీ పడేది వారేనని కార్యాలయ అధికారుల సమిష్టి భావన.
2)సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న కొసాక్కుల ఆయుధ బలంతో,పోలిష్ సైన్యంతో ఓర్షా, స్మోలెంస్క్ ,జోలోబిన్ ,గోమేల్ ప్రాంతాలను ఆక్రమించాలి.
వాఖ్య: రెండవ కుబాన్ విభాగం, అష్ట్రాఖాన్ కొసాక్కుల బృందాలు ఇప్పటికే ఓర్షా,స్మోలెంస్క్ ప్రాంతాలను చుట్టుముట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఖైదీల భద్రతను దృష్టిలో ఉంచుకుని బైఖోవ్ కి చెందిన మొదటి పోలిష్ సైన్య విభాగాన్ని మాత్రం అక్కడే ఉంచితే మంచిది. మొదటి పోలిష్ విభాగ సైన్యం ఇప్పటికే బలహీనపడి ఉంది,అది ఈ సమయంలో అండగా ఉంటుందని అనుకోలేము. వారు రష్యా అంతరంగ కలహాలకు దూరంగా ఉండాలన్న అభిప్రాయంతో ఉన్నారు.
3) జెకో శ్లావ్స్క్ సైన్యాన్ని, కొర్నీలోవ్ రెజిమెంటును ,నమ్మదగిన ఒకటి రెండు కొసాక్కు విభాగాలను పెట్రోగ్రాడ్ ,మాస్కో పంపిస్తున్న నెపంతో ఓర్షా-మొగిల్యోవ్-జోలోబిన్ సరిహద్దు ప్రాంతం దగ్గరే ఉండేలా చూడాలి.
వ్యాఖ్య:కొసాక్కులు బొల్షివిక్కులతో యుద్ధం చేయడానికి సుముఖంగా లేరు.
4) కవచరహితమైన బ్రిటిష్,బెల్జియన్ వాహనాలను కూడా అదే ప్రాంతంలో,అధికారులతో సహ ఉండేలా చూడాలి.
5)మొగిల్యోవ్ ప్రాంతంలో అందరూ ఉండేలా జాగ్రత్త తీసుకుంటూ ;ఇంకో పక్క ఆ ప్రాంతంలో వారికి తుపాకులు,మిగిలిన అన్ని రకాల ఆయుధాలు కూడా వారికి అందుబాటులో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
వాఖ్య:దీని వల్ల ఏ దాడినైనా ఎదుర్కునే అవకాశం ఉంటుంది.
6)డాన్ అటామన్ తోనూ ,తెరెక్ ,క్యూబాన్ ,పోలిష్ ,జెకొస్లావ్స్క్ కమిటీ అధికారులతో మంచి సంబంధాలు నెరపుతూ, వారితో చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించాలి.వీరంతా మనకు అనుకూలంగానే ఉన్నారు.
* * *
ప్రతి రోజూ ఏదో రకమైన ఉద్విగ్నత చోటు చేసుకుంటూనే ఉంది. బైఖోవ్ లో ఆందోళకరమైన వాతావరణం నెలకొంది. కొర్నీలోవ్ కి మద్ధతుగా దుఖోనిన్ ఖైదు చేసిన ఖైదీలను వెంటనే విడుదల చేయాలని అడుగుతున్న వారు కారుల్లో మొగిల్యోవ్ నుండి బైఖోవ్ వరకు తిరుగుతూ ఉన్నారు. కొసాక్కు కౌన్సిల్ కూడా ఒత్తిళ్లకి లొంగిపోయింది.
జరుగుతున్న ఉదంతాల గంభీరత దృష్ట్యా,తన భుజాలపై ఉన్న అతి పెద్ద బాధ్యత విషయంలో దుఖోనిన్ సతమతమవుతూ ఉన్నాడు. నవంబర్ 18 న ఖైదీలను వెంటనే డాన్ ప్రాంతానికి తీసుకువెళ్ళాలని ఆజ్ఞ ఇచ్చాడు.కానీ వెంటనే ఆ ఆజ్ఞను రద్దు చేశాడు.
ఆ తర్వాతి రోజు మురికిగా ఉన్న ఒక కారు జైలుగా మార్చబడ్డ బైఖోవ్ హై స్కూల్ దగ్గరకు వచ్చింది. ఆ కారు డ్రైవర్ వినయంగా తలుపు తెరిచాడు. వయసు పై బడ్డ అధికారి అందులో నుండి దిగాడు. అక్కడ కాపలాగా ఉన్న గార్డుకి కల్నల్ కుసోన్ స్కీ పేరు మీద ఉన్న పత్రాలను చూపించాడు.
‘నేను ప్రధాన కార్యలయం నుండి వస్తున్నాను. ఇప్పుడు ఖైదులో ఉన్న జనరల్ కొర్నీలోవ్ గారికి ఒక ప్రత్యేక సందేశం అందించాల్సి ఉంది. నేను కమాండెంట్ ను ఎక్కడ కలవొచ్చు?’
వెంటనే తెకిన్ దళానికి చెందిన కమాండెంట్ ,లూయీటెంట్ కల్నల్ ఎర్గార్డ్ ఆ కొత్త వ్యక్తిని కొర్నీలోవ్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. కుసోన్ స్కీ తనను తాను పరిచయం చేసుకుని, తను చెప్పదలచుకున్న విషయాన్ని వినమ్రంగా చెప్పాడు.
‘ఇంకో నాలుగు గంటల్లో క్రిలెంకో మొగిల్యోవ్ కి వస్తాడు. ప్రధాన కార్యాలయ సిబ్బంది ఏ వ్యతిరేకత లేకుండా వెంటనే ఆ ప్రాంతాన్ని అప్పగిస్తారు. జనరల్ దుఖోనిన్ నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఖైదీలందరూ ఒక్కసారిగా బైఖోవ్ కి బయలుదేరాలి.’
కొర్నీలోవ్ కుసోన్ స్కీ ని మొగిల్యోవ్ లో ఉన్న పరిస్థితి గురించి అడిగి,తెలుసుకుని,తర్వాత లూయీటెంట్ కల్నల్ ఎర్గార్డ్ తో సమావేశమయ్యాడు. బల్ల అంచు మీద తన ఎడమ చేతి వెళ్లతో గట్టిగా రాస్తూ, ‘జనరల్స్ ను వెంటనే విడుదల చేయి. తెకిన్స్ అందరూ అర్థరాత్రి కల్లా బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలి. నేను రెజిమెంటుతో కలిసి వస్తాను’,అన్నాడు.
ఇక అప్పటి నుండి తెకిన్స్ ఆయుధాలను సాన పెడుతూ,తుపాకులను సిద్ధం చేసుకుంటూ, గుర్రాలను ప్రయాణానికి సిద్ధం చేస్తూ ఉన్నారు.
పగలు సమయంలో జనరల్స్ ఒక్కొక్కరుగా తమ కారాగారం నుండి బయటకు వచ్చారు. అర్థరాత్రి సమయంలో ఆ చిన్న పట్టణం అంతా నిద్ర పోతున్న వేళలో, గుర్రాల మీదకి ఎక్కి, ముగ్గురు ముగ్గురుగా ఆ బైఖోవ్ హై స్కూల్ వాకిట్లో నుండి బయటకు వచ్చారు. ఆ చీకట్లో వారి నీడలు మాత్రం లీలామాత్రంగా కనపడుతూ ఉన్నాయి. నల్ల పక్షులు తమ ఈకలు చుట్టూ పరచుకున్నట్టు వారు కూడా గుర్రాల మీద వంగి కూర్చుని, తమ టోపీలను కళ్ళ మీదకు లాక్కుని,నిశ్శబ్దంగా ముందుకు సాగిపోయారు. రెజిమెంటు దళం మధ్యలో కొద్దిగా వంగినట్టు ఉన్న దేహంతో కొర్నీలోవ్ , ఆ రెజిమెంటు కమాండర్ కల్నల్ కుగెల్జన్ పక్కన పొడుగైన సన్నటి గుర్రం మీద ఉన్నాడు. ఆ చల్లటి గాలిలో నుదురు చిట్లించుకుంటూ,నక్షత్రాలతో నిండిన ఆకాశం వైపు చూశాడు.
ఆ వీధులంతా గుర్రపు డెక్కల శబ్దంతో కాసేపు హోరెత్తి, కొద్ది సేపటికి యధావిధిగా ఏమి జరగనట్టే నిశ్శబ్దంగా అయిపోయాయి.
* * *