కన్నీళ్ళు ఎక్కడ వుంటాయో ?
ఆనంద భాష్పాలు ఎక్కడ వుంటాయో ?
కన్నీళ్ళలో ముంచి తీసిన వాక్యాలు
తేటగా వుంటాయి.
సంతోషవిషాదాల జిగీషతో
జీవం తొణికిసలాడతాయి.
చూసే చూపులో
తలపులో తూగులో
యోచించి వేసే అడుగులో
సమస్తం దాగి వుంటాయి.
జీవితం
నిర్వచనాల వలలకనులకు అందక
జారిపోయే చేప.
ఒకరికొకరు జీవించాలనిపించడమే
ఒకరినొకరి జీవితానందమే
జీవన ప్రతిఫలం.
దుఃఖం మన గురువు.
సంతోషం మన సహచరి.
జగత్తుని
ఒక్క క్షణం వెలిగించి
తొలగిపోయేదే కదా మన జన్మ.

P. Srinivas Goud
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపాధ్యాయులుగా పని చేసి, ప్రస్తుతం నిర్మాణ రంగంలో వున్నారు. కవిత్వం, కథ, విమర్శ, అనువాదాలలో కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు 9 కవిత్వ పుస్తకాలు వెలువరించారు. 2024లో మార్జినోళ్ళు కథా సంపుటి వెలువరించారు. శ్రీనివాసం- కవిత్వ విశ్లేషణలు వెలువరించారు. కవిత్వ అనువాదంలో 4 పుస్తకాలు వచ్చాయి. ఈ సంవత్సరం మరికొన్ని అనువాదాలు రానున్నాయి. రచనలకు గాను పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్నారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్.
సెల్ : 9949429449 మెయిల్ : srinivasgoudpoet@gmail.com



















