మంచితనం చక్కదనం
నా చిన్నప్పుడు నే నొకసారి ఒకరింటికి పెళ్ళి భోజనానికి వెళ్లాను. నాకప్పుడు ఏడెనిమిదేళ్ళుండొచ్చు.
రాత్రి తొమ్మిదిగంటలయింది. పెళ్ళివారి ఇల్లు నిండుగా చాలా సందడిగా ఉంది. నాకు మాత్రం కరకరమని ఆకలి వేసేస్తోంది. మా అమ్మావాళ్ళు ఓచోట ఆడంగులతో మాట్లాడుతూ కూర్చున్నారు. వాళ్ళందరి మధ్యకి వెళ్ళి ‘అమ్మా నాకు ఆకలేస్తోంది!” అని చెప్తే మా అమ్మ కోప్పడుతుందేమోనని నేను భయపడి ఆకలి దిగమింగుకొని ఊరుకున్నాను.
పెళ్ళివారి ఇల్లు కళగా, సందడిగా, సువాసనగా ఉంది. పెళ్ళివాసనంటే నాకు ఎంతో ఇష్టం. ఆ వేళ ఆ వాసన నా ఆకల్ని మరి ఎక్కువ చేసింది. అయితే, భోజనాలు మాత్రం ఆ పెళ్ళివారు ఆ రోజు రాత్రి ఇంతకీ అంతకీ ఎంతకీ పెట్టేరుకారు. నడుంమీద చేతులు పెట్టుకు నిల్చున్న రమ్యమైన రాక్షసకన్యల్లా గాస్ లైట్లు ప్రతి చోటా ధగధగ వెలుగుతున్నాయి. జిగజిగమెరిసే బంగారు నగలు, చుక్కలముక్కల్లాంటి వజ్రాల దుద్దులు, స్వర్ణసర్పాల్లాంటి మువ్వల వడ్డాణాలు, మైనపు బొమ్మల్లాంటి తెల్లటి ఆడవాళ్ళు – కదిలే పూదోటలా ఉంది. పెళ్ళివారి ఇల్లు.
అయితే, అక్కడ తెల్లటి మగవారు కొందరు చొక్కాల్లేకుండా జవజవలాడే బొజ్జల్ని ఊరేగించుకొంటూ తిరుగుతున్నారు. (ఆ రోజుల్లో అటువంటి బొజ్జలుగల పెద్దమనుష్యులకీ డబ్బంటే లోభమూ, పేదవారంటే అసహ్యమూ, కోపమూ, బ్రిటిష్ వారంటే భయమూ భక్తి ఉండేవి. ఆ విషయం నాకు అప్పటికప్పుడు బాగా బోధపడే ఉంది. వాళ్ళు తరచుగా పెద్దపెద్ద ప్లీడర్లో, అతి పెద్ద గవర్నమెంటు ఆఫీసర్లో, ఎంతో పెద్ద మొఖాసాదార్లో, కనీసం చిన్న చిన్న జమీందార్లో అయుండే వారు. వారంతా గాంధీ గారికీ కాంగ్రెసువారికీ దూరం ఉండేవారు. అందుచేతనే అనుకుంటాను. పెద్ద బొజ్జలున్నవారికి దేశభక్తికంటే (పర) రాజభక్తి ఎక్కువ ఉంటుందనే (మూఢ) నమ్మకం నాకు ఆనాడే కలిగిపోయింది.
ఆ రోజు రాత్రి ఆ బొజ్జలున్న వారంతా సర్దుకొని మాకు భోజనాలు పెట్టేసరికి రాత్రి పదిగంటలయింది. నేను రెండు బియ్యపు బస్తాలమధ్య గుళ్ళీ చెంబులా రెండు బొజ్జలమధ్య ఇరుక్కొని కూర్చున్నాను. పెద్దవరండాలో రెండు పంక్తులుగా మేమంతా కూర్చున్నాం. వడ్డనవాళ్లు హడావిడిగా తిరుగుతున్నారు. పంక్తులమధ్య పెళ్ళికూతురి పెత్తల్లో మేనత్తో అయుంటుంది. పట్టుచీర, కాసులపేరు, బొజ్జ, వడ్డాణం, తెల్లని తెలుపు ముందుకి మూతి, గడ్డంకింద గంగడోలు వగైరాలతో ఒంగోలు ఎద్దుకి ఆడవేషం వేసినట్లుగా ఉంది. ఆవిడ మామధ్య తిరుగుతూ వడ్డనవాళ్ళని “చూచుకొని వడ్డించండి!” అని హెచ్చరిస్తోంది.
చక్కగా తయారుచేసిన చవకరకపు కూరలూ, పచ్చళ్లూ ఆ రోజున ముందుగా వడ్డించేరు. ఆకలి మీద ఉన్నానేమో అవన్నీ నేను ఎంతో తొందరగా ఎక్కువగా తినేసి అవి ఎంతో బాగున్నాయనుకున్నాను. అవన్నీ తినిన మీదట నాకు ఆకలి బాగా తీరింది. నేను తృప్తిగా కూర్చున్నాను. అప్పుడు మరికొంత సేపటికి ఆ పెత్తల్లో మేనత్తో లడ్డూ, జిలేబీ, పాయసం వగయిరా మంచి పదార్థాలన్నీ ఒక్కొక్కటి చొప్పున రప్పించింది.
కాని, ఏం లాభం?
నా ఆకలి అప్పటికి తీరేపోయింది. నాకు అవేవీ తినాలని అనిపించలేదు. చూస్తే మొహం మొత్తింది.
కథల విషయంలో కూడా నాకు అలాగే జరిగింది.
కథల దాహం నాకు ఎక్కువగా ఉన్నప్పుడు చెత్త కథలూ, బూతు కథలూ ముందుగా నాక్కనిపించేయి. నేను వాటిని చాలా ఆశగా చాలాచాలాగా చదివేను. దాంతో నాకు అటువంటి కథలే చదవాలనిపించేది తప్ప ఇతర కథలు చదవాలనే అనిపించేదికాదు. తాగుడులోనే సుఖం అలవాటు చేసుకున్నవాడికి ఆ తరువాత మరింత తాగితేనే తప్ప సుఖంలేనట్టు, బూతూ చెత్తా ఉంటేనే తప్ప నేను కథలజోలికి పోలేక పోయేవాణ్ని. ఆ ఘోరమైన అవస్థలోంచి నేను ఎంతో ఘోరంగా శ్రమపడి యాతన పడి బైటపడి “మంచి” కథల లోకంలో పడగలిగేను.
అందుచేతనే మంచికథలు చదివే అలవాటు ఎవరైనా సరే ఎంత వేగిరం చేసుకొంటే వారికి అది అంత మంచిదని తలుస్తాను. అయితే, ఇంతకీ ఏవి మంచి కథలు?
‘ఏవి, సార్, మంచి కథలు?’ అని నిలదీసి అడిగితే ఎవరైనా సులభంగా జవాబు చెప్పగలరేమో కాని నేను మాత్రం గుక్కిళ్ళు మింగకుండా జవాబు చెప్పలేను. అంటే ‘మంచికథకి’ నేను నిర్వచనం చెప్పలేను. ఉదాహరణ యివ్వగలను. ‘ఓ హెన్రీ కథలు, మొపాసా కథలు, చెకోవ్ కథలు, డికెన్స్ కథలు, కొడవటిగంటివారి కథలు, బీనాదేవిగారి కథలు ఇలా ఎన్నో చెప్పగలను.
మానవలోకాన్నీ మానవనైజాన్ని అర్థం చేసుకొని మనిషి ఈ లోకంలో ఈ సంఘంలో మంచి సభ్యుడిగా ఉండేట్టు చేసే కథలు(ఆ విధంగా ఉండడానికి అతని చేత ప్రయత్నం చేయించే కథలు) మంచివని నేను తలుస్తాను. రచనకి సాంఘిక ప్రయోజనం ఉండాలని కొంతమంది అంటూ ఉంటారు. దానికి నేను పై ప్రకారం అర్థం చెప్పుకున్నాను.
మంచితనం, చక్కదనం-
రెండూ కలిసి ఉంటే అందరూ హర్షిస్తారు. ఆ రెండూ ఉంటేనే ఏ రచనైనా మంచిదవుతుందని నే ననుకుంటాను. అందువల్లనే నాకు శుకసప్తతి కథలకంటే పంచతంత్రం కథలంటే ఎక్కువ ఇష్టం. అందువల్లనే నాకు ‘ప్రబంధ’ కావ్యాల కంటే పురాణ గ్రంథాలంటేనే ఎక్కువ ఇష్టం. అందువల్లనే నాకు క్షేత్రయ్య పదాల కంటే త్యాగరాజులవారి కీర్తనంటే ఎంతో ఎక్కువ ఇష్టం.
నేను ఇంటర్మీడియట్ క్లాసు (ఏ.వి.ఎన్. కాలేజీలో) చదువుతూన్నప్పుడు మాతో చదివే ఆడపిల్లల్ని ఆకర్షించడానికి కొంత మంది విద్యార్థులు నానాతంటాలూ పడేవారు. వారిలో ఓ కుర్రాడు రోజుకొక కొత్తసూటు తొడిగి, రోజుకొక కొత్తసెంటువాడి, నిగనిగలాడుతూ ఆ అమ్మాయిలని ఆకర్షించడానికి తాపత్రయపడేవాడు. మరో కుర్రవాడు ఆ ఆడపిల్లలు పక్కున నవ్వేలా అల్లరిగా మాట్లాడుతూ బఫూన్ లా ప్రవర్తిస్తూ వారికి కితకితలు పెట్టబోయేవాడు. ఇంకో కుర్రాడు తన ఖద్దరు బట్టల్తోనూ జాతీయ తత్వంతోనూ వాళ్ళని సింపుల్గా ఋష్యశృంగుళ్ళా ఆకర్షింప ప్రయత్నించేవాడు. మరొకడు ఫస్టుమార్కులు కొట్టి, ప్రయిజులు పుచ్చుకొని వారిని ఆకర్షిద్దామని చూసేవాడు. రకరకాల కుర్రవాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేసేవారు.
తాము చెప్పేది పాఠకలోకం వినేలా చేసేందుకు రచయితలు ఈ కుర్రవాళ్ళలాగే రకరకాల ప్రయత్నాలు చేస్తూంటారు. అయితే చమత్కారంగా చెప్పడం తప్ప చెప్పినదాంట్లో పసలేనప్పుడు విన్నవాడు (చమత్కారాలకోసం మాత్రం వింటేనే తప్ప) విసుక్కుంటాడు. ఎంత మంచి చెప్పదల్చుకొన్నప్పటికి అది అందంగా చమత్కారంగా చెప్పకపోతే, వినవలసినవాడు నువ్వు చెప్పేది విననే వినడు.
శ్రీమతి బీనాదేవిగారి కథలు ఆంధ్ర పాఠకలోకాన్ని మంచిమార్గాన్న నడిపించడానికి ప్రయత్నించేసే కథలుగా నేను భావిస్తాను. ఆనందం కలిగించడమే కాకుండా మనసుకి వీరి కథలు ఆరోగ్యాన్ని కూడా కలుగజేస్తాయి. రుచిగా ఉంటూ బలం ఇచ్చే మంచి ఆహారపదార్థాల్లాగ అవి ఎంతో బాగున్నాయి. వీరి కథలు గురజాడ వారి కథల ఫక్కీలో ఉన్నాయని నాకు తోచింది. (ఆ మంచి ఫక్కీ ఇటీవల చాలా మంది విడిచి పెట్టేరెందుచేతనో? నాకు వీరి కథలు చదువుతూంటే చల్లగాలి పీల్చినట్టుగా హాయిగా వుంది; తలుపులన్నీ మూసిన పంకాల గదిలోంచి బైటకి రాగానే చల్లని పైరుగాలి తగిలినట్టుగా ఎంతో హాయిహాయిగా ఉంది. నాలుగిళ్ళ వాకిళ్ళలోనూ, కాలేజ్ గరల్స్ షోకుల్లోనూ, భార్యాభర్తల కౌగిళ్ళలోనూ, ప్రేమికుల వియోగాల్లోనూ, “ఎటర్నల్” లోనూ, సినిమా స్టూడియోల్లోనూ, సర్కస్ ఫీట్స్ లోనూ నలిగిపోతున్న ఆంధ్ర పాఠకలోకాన్ని రెక్కపట్టుకుని మిగతా ప్రపంచంలోకి తీసుకురా ప్రయత్నిస్తున్నారు శ్రీమతి బీనాదేవిగారు. వీరి కథల్లో ఒరిజినాలిటీ ఉంది. అవి ప్రతిభా సమన్వితంగా ఉన్నాయి. నవరస భరితంగా ఉన్నాయి. చాలా బాగున్నాయని నాకు అనిపించింది.
అవి చదివేక మీరు కూడా నాతో తప్పకుండా ఏకీభవిస్తారని నేను నమ్ముతాను.
(బీనాదేవి కథల సంపుటి ‘రాధమ్మ పెళ్ళి ఆగిపోయింది’కి ముందుమాట.
3-1-1966)
ఉత్తరాయణం
కన్యాశుల్కం చదివినా, మహా ప్రస్థానం చదివినా నాకో విధమైన సంతృప్తి కలుగుతుంది. బీనాదేవిగారి ‘రాధమ్మ పెళ్ళి ఆగిపోయింది’ అనే కథ అటువంటి సంతృప్తినిస్తూంది. నావల్ల సెకండ్ హేండీగా కథ విన్నవాళ్ళు అసలు కథ చదవడానికి ‘జ్యోతి’ కోసం పరిగెడుతున్నారు. ఆ కథ అద్భుతంగా ఉంది. ఈ ప్రాంతాల్లో మంచి అలజడి కలిగించింది.
రాచకొండ విశ్వనాధశాస్త్రి, విశాఖపట్నం.
(జ్యోతి, మాసపత్రిక – మార్చి 1965)
చిన్నమాట
“ఆగండి!” అంటే ఆగుతారేమోగానీ,
“ముందుకు పదండీ!”
అని చెప్తే మాత్రం చాలా మంది భయపడతారు. ఆ మాట చెప్పడానికి భయపడతారు. వినడానికి కూడా భయపడతారు. అలాగే, ముందుమాట చెప్పడానికి నాక్కొంచెం భయం వేస్తుంది. ధైర్యం అంటే భయం వేసినప్పటికీ ముందుకి వెళ్ళగలగడమే (Courage is to be afraid, but still to carry on) అని నేనెక్కడో చదివేను. తంతారేమో, జెయిల్లో వేస్తారేమో,చావజంపి చెవులు మూస్తారేమో? అని ఎంత భయం వేసినా నిజం చెప్పగలగడం చాలా మంచిదికదా, నిజంగా చూస్తే!
పాలకులూ – పాలితులూ, అత్తలూ – కోడళ్ళూ, పిల్లులూ – ఎలుకలూ, యాచకులు, యాచకులు వగైరా సహజ శత్రువులని పెద్దలు చెప్పగా నేను విన్నాను. ఆ వగైరా వగైరాల్సి “రచయితలూ రచయితలూ” అనే పదాలు కూడా చేర్చవలసి వున్నదని నేను ఇటీవల తెలుసుకున్నాను.
రచయితగా మిగతా రచయితలకి నేను సహజశత్రువుని కాబట్టి కాబోలు ఎవరైనా బాగా రాస్తే నాక్కొంచెం ఈసుగానూ, చిరాగ్గానూ ఉండేది. కాని, అలా బాగా రాసినవాడు “మనవాడే” అయితే నాలో ఈసూ, చిరాకూ కలక్కపోవడం నాకు చాలా గమ్మత్తుగా కనిపిస్తుంది. ఈ “నటనాలయం” నేను శ్రీజాన్సన్ గారికి స్నేహితుడిగా, “వేరొక రచయితనే అయినప్పటికీ ఎంతో సరదాగా చదవగలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను.
శ్రీ మోదుకూరి జాన్సన్ గారు లోగడ (విశాఖపట్నంలో) నటనాలయపు జాన్సన్ గా నాకు తెలుసు. “కవిత్వానికి ‘బాధ’ పర్యాయపదం” అని శ్రీశ్రీ గారొకసారి చెప్పేరు. జీవితంలోని బాధ (అనుభవించకపోయినా) తెలుసుకోగలిగినవారే నాటకాల్లో నటులుగా రాణించగలరని నాటకాల్లో తిరిగిన రోజుల్లో నేను పాఠం నేర్చుకున్నాను. శ్రీ జాన్సన్ గారు నటించిన నాటకాలు చూసిననాడే ఆయన బాగా రాయగలిగారని కూడా నేను గ్రహించవలసింది. అయితే “నటనాలయం” చదివేక కాని ఆ విషయం నేను తెలుసుకోలేకపోయాను.
మానవుడు దేవుణ్ణి తెలుసుకొందికి ఎంతగా ప్రయత్నిస్తాడో తోటి మానవుణ్ణి తెలుసుకొందికి కూడా అంత ప్రయత్నమూ చేస్తూంటాడు. ప్రతి మనిషీ కూడా మూసుకుపోయిన మేడలా అభేద్యమైన కోటలా ఉంటాట్ట. ఆకాశపు చుక్కల తెరవెనక ఏముందో తెలుసుకోడం కష్టం. అందుకే “ప్రతి మనిషీ ఒక కోట” అన్నారు. మానవులంతా అలా వున్నప్పటికీ వారిలో రచయితలు మాత్రం తలుపులు తెరిచిన మేడల్లో మానవులంతా అలా వున్నప్పటికీ ద్వారాలు తెరుచుకున్న దుర్గాల్లో ఉంటారు. అందుచేత, ఈ “నటనాలయం” లోంచి శ్రీ జాన్సన్ గారిని చూద్దామనే క్యూరియాసిటీతో కూడా నేనిది చదివేను.
ఈగ తన పేరును మర్చిపోయి తిన్నగా వెళ్ళి “పెద్దమ్మా! నా పేరేమిటి?” అని పేదరాశి పెద్దమ్మని అడిగిందట. ఆ విధంగా కవులు తమ కవిత్వానికి కారణాలు కనుక్కోవలసిందిగా మనల్ని (చెట్టుమీద కూర్చొని) కూసే కోయిలమ్మ దగ్గరికి వెళ్లమంటారు. “కోయిలా! ఎందుకు కూస్తున్నావే?” అంటే మనం గింజుకు చచ్చినా అది జవాబివ్వదు. పాడే కోయిలా, ప్రవహించే సెలయేరూ, కరిచే నల్లీ, కుట్టే దోమా ఇటువంటివేవీ కూడా మన ప్రశ్నలకి సమాధానాలివ్వవు. అందుకే అనుకుంటాను మనల్ని చెట్ల చిగుళ్ళకీ ఏటి గట్లకీ పంపించేది మోడర్న్ కవులే కాని పూర్వకవులు కాదు. రామకథ ఎందుకయ్యా గానం చేసేవంటే ఆదికవి మనకు సమాధానం చెప్పగలిగేవాడేకాని మనల్ని పేదరాశి పెద్దమ్మ దగ్గరికీ పెద్దమ్మ కొడుకు దగ్గరికీ, కొడుకు చేతిగొడ్డలి దగ్గరికి వెళ్ళమని ఉండేవాడు కాడని నేను నమ్ముతాను. అలాగే వ్యాసుడు, కాళిదాసు, అలాగే నన్నయ, తిక్కన, అలాగే ఇంకొకరు, మరొకరు. వాళ్ళు, పాపం మోడర్న్ కవులు కారు. పాపాలని ఖండించడానిక్కాని, పుణ్యం గురించి ప్రచారం చెయ్యడానిక్కాని వారు భయపడేవారు కారు.
ఆ మాదిరిగా -కళ ఎందుకు? కళాసేవ ఎందుకు? అని ప్రశ్నిస్తే ఈ రోజుల్లో జవాబులు దొరకడం కష్టం. ఈ కాలం ‘కళకాలం’ కాదని మనందరికి బాగా తెలుసు, సిరిని కాలదన్నిన మహాఋషులు, మహాకవుల జీవితాన్ని సిరికోసమే సినిమా తీసే కాలం ఇది. ఆనాడు నిప్పులా బతికిన పతివ్రతామతల్లుల నందర్నీ తెరమీద కెక్కించి ప్రొడ్యూసర్ల డబ్బుకోసం – వారందరికీ మానభంగం చేసే రోజులివి. “మహాభక్త విజయం” లోని గాథలన్నీ – డబ్బుకోసం కొక్కోకపు కథలుగా చెప్పే ఘోర కలికాలం ఇది. ఇది ప్రళయం వస్తే మారాలితప్ప మంచికి మరోలా మారదనే ప్రాచీనపు పురాణ సిద్ధాంతం తిరగదోడి చెప్పేవారంతా పొలిటికల్ ఎక్స్ ట్రి మిస్ట్స్ గా పిలవబడి వేటాడబడే కాలం ఇది. కళ ఎందుకో, ఏమిటో తెలిసినా తెలియకపోయినా, నిశ్చలంగా, నిజాయితీగా కళాసేవ చేసేవారికి ఈ సాంఘిక వ్యవస్థలో స్థానం లేదనీ, వారికి చివరికి ఈ సంఘంలో శ్రీశ్రీగారు చెప్పినట్లు – “దుర్హతి దుర్గతి దుర్మతి దుర్మృతి” తప్ప వేరేమీ దక్కవనీ ఈ నాటకం చదివితే తెలుస్తుంది.
ప్యాషన్ (లేక పేషన్) Passion అనే ఇంగ్లీషు పదానికి సరైన తెలుగు నాకు తెలియదు. అంటే-అదొక తపన, అదొక తీవ్రమైన వేదన అని నేననుకుంటాను. చరిత్ర పుటలు తిరగవేసి చూస్తే, ఏమాత్రం సాధించగలిగిన ఏ మానవుడికైనా (సాధించిన విషయం గురించి) తీవ్రమైన తపన ఉండేదని మనకి తెలుస్తుంది. శ్రీ మోదుకూరి జాన్సన్ గారికి ఏం సాధించాలని వుందో నాకు తెలియదు. కాని ఈ “నటనాలయం” చదివితే ఆయనకి ఉన్నతమైనదీ ఉత్తమమైనదీ ఏదో సాధించాలని ఉందని మాత్రం మనకి తెలుస్తుంది. ఈ నాటకంలో ఒప్పులు ఎన్నో వున్నాయి. తప్పులున్నా వాటిని నేనంతగా పట్టించుకోలేదు. వాటికోసం వెతకలేదు. కాని ఇందులో తపన తప్పక ఉంది. అందుకే నాటకం నిలుస్తుంది.
(మోదుకూరి జాన్సన్ గారి ‘నటనాలయం’ నాటకానికి ముందుమాట 26-5-1966)
ముచ్చట వేరు – ముచ్చట్లు వేరు
దేశంలో పురాణ సీత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేనట్టే, ఆంధ్రదేశంలో ప్రస్తుతం ఈ పురాణం సీత గురించి కూడా చదువుకున్న వారెవరికీ ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆనాటి సీతాదేవిలాగే ఈనాటి సీతలకి కూడా ముచ్చట్లు తక్కువా, బాధలు ఎక్కువాను . ఆ బాధనూ, ఆ ఆవేదననీ ముచ్చటగా వ్యక్తం చేసేరు పురాణం సీతగారు.
మనదేశంలో నూటికి తొంభై తొమ్మిది మంది ఇల్లాళ్ళకీ జీవితం ముచ్చట అనే ప్రసక్తి పువ్వుల తోటలో నిప్పుల మంటలా వుంటుందికదూ! అటువంటప్పుడు ఇల్లాలి ముచ్చట్లు అనడంలో అర్థం ఉందా అనిపించింది నాకు. చదివేక మాత్రం, ముచ్చటవేరు, ‘ముచ్చట్లు’ వేరు అని తెలుసుకున్నాన్నేను.తీర్ తారుగా చిక్కులు చిక్కులుగా బాధలు బాధలుగా వున్న ఈ జీవితం ఎందుకు ఇలా వుంది అని తెలుసుకొందికి ఈ వ్యాసాల్లో ఈ ఇల్లాలు కొంత ప్రయత్నించినట్టుగా నాకు తోస్తోంది. రాక్షసులతో పేచీలన్నీ ముఖ్యంగా ముందుగా సెటిల్ చేసుకోకుండా మీనమేషాలు లెక్కెడుతూ ఉండిపోయినట్లయితే, తమ తమ జీవితాలన్నీ ముందుముందుకి ముళ్ళ తీగెలతో ఇంకా ముడిపడిపోయి, ఉక్కిరిబిక్కిరయిపోయి ఊపిరి విడుస్తాయని ప్రతి సీతా, ప్రతి రాముడూ కూడా త్వరలోనే తెలుసుకోవలసి వుంటుంది.
అన్యాయం అంటే సీతలందరూ కోపంగానే ఉన్నారు. కాని ఎందుచేతనో గాని రామచంద్రులే ఇంకా రంగంలోకి దిగడం లేదు. అన్యాయం మీద తిరుగుబాటు చెయ్యని దేవుళ్ళు దొంగదేవుళ్ళే అని మనం తెలుసుకోవలసి ఉంది.
12-10-1968
(పురాణం సీతగారి ‘ఇల్లాలి ముచ్చట్లు’ వెనక మాట)
కత్తిమాట – కలం మాట
ఈ పుస్తకంలోని కథలు రాసినవాళ్ళంతా యువకులు. ఏ విషయంలోనైనా ఎవరైనా ఎక్కువగా చేసేరంటే ఆ విషయంలో కృషి వారు చిన్నతనంలోనే ఆరంభిస్తారని నేననుకుంటాను. ఆట, పాట, చదువు, సంధ్య అన్నీ మనకి చిన్ననాడే మొదలవుతాయి. అలాగే, కథా రచన కూడాను. కథ రాయడానికి యువకులు సరదా పడ్డారంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు.
ఏ గూటి చిలక ఆ పలుకు పలుకుతుందంటారు. అలాగే, గూడులేని చిలకల గోడు వేరుగా వుంటుంది. కూడూ, గూడూ లేని చిలకలకి కాలం ఎలా కత్తుల కోతలా ఉంటుందో ఆ పరిస్థితుల్లో మనుష్యులకి కూడా కాలం అలానే ఉంటుంది. అయితే అదే కాలం కొందరికి మాత్రం బంగారు పంటగా లేకపోలేదు.
బంగారు పంటగాళ్లు బాగానే వున్నారు. వాళ్ళకి సరదాలెక్కువ, బాధలు తక్కువ. ఆటలు, పాటలు, పిక్నిక్కులు, పువ్వులు, పూబోడులు వాళ్ళకి ఎందుకైతే యిష్టమో కథలు కూడా వాళ్ళకి అందుకే యిష్టం. కథ లెందుకు రాయాలి అని ప్రశ్నిస్తే సరదా కోసం అని వారు సమాధానం చెప్పగలరు. ఉండేలు దెబ్బకి కూలిపోయిన కోయిలమ్మ గుండెలు పగిలేలా ఏడ్చినప్పటికీ వాళ్ళకి దాని కంఠంలోని మాధుర్యమే కావాలి కాని, దాని అలసటకాని, బాధకాని, ఆవేదనకాని అక్కర్లేదు. ఆర్తనాదమే అయినప్పటికీ “అదెంత హాయిగా ఉంది!!” అని వాళ్ళు మధురభావన చెయ్యగలరు.
కోతకత్తుల మధ్య ఇరుక్కున్నవాళ్ళు బంగారు పంటగాళ్ళ కంటే భిన్నంగా ఉంటారని నేను తెలుసుకున్నాను. వారిలో చాలామందికి వారెందుకలా ఇరుకన పడవలసి వచ్చిందో సరిగా తెలియదు. అయితే, కారణాల కోసం వారు వెతుక్కొని తెలుసుకోక తప్పదు. (కోయిలమ్మలు ఎందుకు ఏడుస్తున్నాయో వాళ్ళు తప్పక తెలుసుకుంటారు.) ఇదేమిటి? ఇది ఎందుకిలా ఉంది? ఇది ఎలా వుంటేమనందరికి శ్రేయస్కరం? ఏది మంచి? ఏది చెడ్డ? – ఇటువంటి ప్రశ్నలకి సమాధానాల కోసం వాళ్ళు శ్రమపడతారు.
యువతరం వారు రాసిన, ఇందులోని కథల్లో కొన్ని ప్రశ్నలు ఫ్రేమ్ చేసుకొందికీ, వాటికి సమాధానాలు చెప్పుకొందికీ చేసిన శ్రమ కనిపిస్తుంది. ప్రశ్నలు వేసుకోడం తెలియకపోవచ్చు జవాబులు సరిగా ఉండకపోవచ్చు; మంచి ఏదో గ్రహించలేకపోవచ్చు; ఏది చెడ్డో తెలుసుకోలేకపోవచ్చు, కాని తెలుసుకోవాలనే కాంక్ష వీరిలో కొందరికైనా వున్నదని నాకు తోచింది.
లోకాన్ని పరికించి చూస్తే, అందులో ఎక్కువవాళ్ళం అనుకొనేవారే నిజానికి చాలా తక్కువ. తక్కువవాళ్లనిపించుకొనేవారే ఎంతో ఎక్కువ. తక్కువ్వారనబడే ఆ ఎంతో ఎక్కువవారికి మాత్రం బతుకులో న్యాయం దొరకడం లేదు, జరగడం లేదు. పెద్దవారనబడేవారు వారి జీవితాలతో ఫౌలాట ఆడుతన్నారు కాబట్టే బీదవారి బతుకులు అధోగతికి పోతున్నాయి; రాక్షసులు రాజ్యం చేసినప్పుడు మంచివారు మన్ను కొట్టుకోకతప్పదు.
రాజ్యాన్ని రాక్షసుల బారినుండి తప్పించాలంటే మిగతావారు గట్టిగా నిలబడవలసి వుంటుంది. దుష్టుల్ని శిక్షించాలంటే భగవంతుడైనాసరే మనిషి జన్మ ఎత్తవలసిందేనంటారు. మనిషైన తరువాత ఆయనకైనాసరే మరో మనిషి సాయం అవసరం కాక తప్పదు. అందుచేత, ఉడుకు నెత్తురున్నవారు దుష్టశిక్షణ కోసం కత్తులైనా పట్టాలి, కత్తుల్లాంటి . కలాలైనా పట్టాలి.
28-4-1969
(ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థి రచయితల సంఘం వారి కథాసంకలనం ‘విద్యార్థి సాహితి’కి ముందుమాట)
పావలా గురించి, పాత్రో గురించి
‘ఆశ ఖరీదు అణా’ అని గోరాశాస్త్రిగారొక నాటిక రాసేరు. కాని ఈ ‘పావలా’ ఖరీదు. మాత్రం చాలా ఉంటుంది. ఎంతో చెప్పలేం. ఎందుచేతనంటే ఆనందానికి విలువ కట్టడం కష్టం.
ఈ నాటిక చాలా బావుంది. ఉత్తమ నాటికల్లో ఇది అగ్రశ్రేణిని ఉంటుందని చెప్పడానికి సందేహించనవసరం లేదు. ఇంత చిన్న వయస్సులో పాత్రోగారు ఇంత మంచి నాటిక రాయగలిగారంటే; దేశం ఈయన్నుండి మంచి రచనల నెన్నింటినో ఆశించవచ్చునన్నమాట.
ఉత్తమ సాహిత్యం ఏం చేస్తుందో ఏం చెయ్యగలదో ఏం చెయ్యాలో నాకు సరిగ్గా తెలియదు. కాని, ఈ నాటిక చదివితే (చూస్తే) కొందరి జీవితాలు ఎలా ఎంత దుర్భరంగా ఉన్నాయో తెలుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మానవనైజం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఈ పరిస్థితులు మారాలనిపిస్తుంది. ఇంత చిన్న పరిధిలో రచయిత ఎంతో జీవితాన్ని తరిచి చూపించగలిగినందుకు ఎంతో ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. అద్భుతమనిపిస్తుంది.
కాని,
ఓ ప్రమాదం ఉంది. ఇంత చక్కని మంచి రచయితని పెద్దలెవ్వరూ పేదల పక్షాన నిలబడనివ్వరు. కాని, పాత్రోగారు ఈ నాటకంలోని పాత్రల వంటి పేదవారి పక్షాన ఖచ్చితంగా నిలబడి సాహిత్య రచన చేస్తే పేదలంతా సంతోషిస్తారు. ఈయనకి ప్రతిష్ఠి ఉంది. ఆ ప్రతిభని అన్యాయాలని ఎదిరించడానికి ఈయన ఉపయోగిస్తే దేవుడమ్మ సంతోషిస్తుంది. ఆయమ్మ సంతోషిస్తే ఈయన రచనలు నిలుస్తాయి.
9-3-1970
(గణేశ్ పాత్రో గారి ‘పావలా’ నాటికకి ముందుమాట.)
శ్రీ కాళీపట్నం రామారావుగారు
చెఖొవ్ రాసిన ‘ఇన్ దిగలీ’ అనే కథలో దిక్కూ మొక్కూ లేని ఓ పేదపిల్లని ఓ పోలీసువాడు పెళ్ళాడతాడు. వాళ్ళకి ఓ కొడుకు పుడతాడు. ఈలోపున ఓ దొంగనాణేల కేసులో ఆ పోలీసువాడికి శిక్షపడగా అతను సైబీరియాలో కలిసిపోతాడు. అప్పుడా పేదపిల్ల తన కొడుకుని పెట్టుకుని అత్తమామల పంచని ఊడిగం చేస్తూ ఉంటూండగా, పేద్దాని కొడుక్కి ఆస్తి పంచవలసివస్తుంది కదా అనే కోపం పెట్టుకొని ఆమె తోటికోడలు ఆమె లేత కొడుకు మీద ఉడుకు నీళ్లు కుమ్మరించేస్తుంది. ఉడికిపోయిన కొడుకుని భుజాన వేసుకొని కొన్ని మైళ్ళు నడుచుకొని ఆ పేత్తల్లి ఆస్పత్రికి వెళ్ళేసరికి సాయంకాలం అవుతుంది. అక్కడ డాక్టరు ఆ పిల్లవాణ్ణి తణిఖీ చేసి ఆమెతో, “అమ్మా, నీ కొడుకు చచ్చిపోయేడమ్మా” అని చెప్తాడు. అస్తమించబోయే సూర్యకిరణాల్లో ఆస్పత్రి అద్దాల తలుపులు భగభగ మండుతున్నట్టుంటాయి. ఆ మంటల్లోంచి ఆ పేత్తల్లి ఆలేత శవాన్ని భుజాన వేసుకొని వచ్చి నాటు రోడ్డు చేరుకొనేసరికి కారుచీకట్లు పులుముకుంటాయి. అప్పుడు, ఆమె ఊరివైపే వెళ్ళే ఓ ముసలిబండివాడు ఆమె సంగతి తెలుసుకొని ఆమెని తనబండి ఎక్కమని చెప్పి ఆమెకి తన అనుభవాల సారాంశం ఏమిటో తెలియజేస్తాడు.
ఆ బండివాడు చాలా రాజ్యాలు వెళ్ళేట్ట, చాలా జీవితం చూసేట్ట. ఎక్కడ చూసినా చెడ్డే చెలామణి అవుతోందిట. ఎక్కడకెళ్ళినా పాపమే తెగ పెరుగుతోందిట. అయితే, ఇంత ఘోరపాప పంకిలంలో ఇంతమంది జనం ఇంకా ఈ మేరకైనా బతగ్గలిగే వున్నారంటే ఈ లోకంలో “మంచి” అనేది ఎక్కడో అక్కడ ఎంతోకొంత ఉండే ఉండాలిట. ఆ మంచితనం ఉంటుందనే నమ్మి, ఉండాలనే ఆశించి మనం బతకాలిట (ఆ పేత్తల్లి, ఆఖరికి, తన తోటికోడలు కట్టే ఇటికల (?) ఫ్యాక్టరీలో కూలిమనిషిగా చేరి తన కష్టాల్ని పాటలుగా మార్చుకొని కాలం వెళ్ళబుస్తుంది.)
చెఖోవ్ చెప్పిన బండివాడు చెప్పిన బతుకు మాటలు నన్నెందుకోగానీ బాగా ఆకర్షిస్తాయి. శ్రీ కాళీపట్నం రామారావుగార్ని చూసినప్పుడల్లా ఆ మాటలే నాకు గుర్తుకొస్తాయి.
పోలీసులూ, ప్లీడర్లూ, కోర్టులూ, బేంకులూ, వడ్డీలూ, ఫ్యాక్టరీలూ, లాభాలు, వేలాలూ, అరెస్టులూ, రోగాలూ, దారిద్ర్యాలూ, మేడలూ వాటి పక్క గుడిసెలూ, అమెరికన్ బాంబులూ, రష్యన్ రాకెట్టులూ, పెద్దవారి కాల్పులూ, పేదవారి చావులూ, దొరలూ, దొంగకవులూ తెగ పెరిగే ఈ పాడు లోకంలో ఎక్కడో అక్కడ ఈపాటైనా ఏపాటైనా వర్షాలు కురుస్తున్నాయన్నా, కాల్వలు పారుతున్నాయన్నా, పంటలు పండుతున్నాయన్నా, కొంతమందైనా పేదలు కొన ఊపిరితోనైనా బతగ్గలుగుతున్నారన్నా, శ్రీ కాళీపట్నం రామారావుగారి లాంటి సజ్జనులుండబట్టేనని నేను నమ్ముతాను.
భగవంతుడికి జనం నమస్కరిస్తారు. ఆ భగవంతుడు మనిషిగా మారితే అప్పుడు కూడా అందరూ నమస్కరిస్తారని మనందరికీ తెలిసిన విషయమే. అయితే, దేముడు మానవుడైతే అప్పుడు అతనైనా సరే శ్రీ కాళీపట్నం రామారావుగారికి నమస్కరించి తీరవలసిందే! పురుషులలో పుణ్యపురుషులు వేరయా అని వేమన్నగారు రామారావుగార్లాంటి వారిని చూసే చెప్పి ఉంటారు.
రామారావుగారి వంటి సజ్జనుడి సాంగత్యం లభించడం నా అదృష్టం. ఆయన అలా గొప్ప కథకులుండడం మన జనం అదృష్టం.
7-1-1971
(‘యజ్ఞం’ కథాసంపుటికి ముందుమాట)
“ప్రజలకు న్యాయంగా ఏ న్యాయమైతే జరగాల్సివుందో, ఆ న్యాయం జరక్కుండా అడ్డుకోజూస్తే ఆ ఘర్షణ నుండి హింస తప్పకుండా వుద్భవిస్తుంది. అంతేకాని, ప్రజలకు ఇలాంటి న్యాయం జరగాలని కోరడం హింసకాదు. కోరినంతమాత్రాన హింస రాదు కూడా. ఏది హింస? ఎవరిది హింస? అనే మౌలిక ప్రశ్నలకు జవాబులు మనకు “యజ్ఞం”లో దొరుకుతాయి.”
(‘యజ్ఞం’ పుస్తకావిష్కరణ సభలో – 1-2-’71 న, విశాఖ )
ఉగ్ర కాళిక
డాక్టర్ శామ్యూల్ జాన్సన్ గారు ఆలివర్ గోల్డ్ స్మిత్ గురించి “అతడు పట్టినదేదీ అలంకరించకుండా ఉండలేదు.” అని ఆంగ్లంలో అన్నాడు. అదేవిధంగా తెలుగులో అతడి ‘పట్టినదల్లా బంగారం’ అవుతుంది అనే సామెత ఒకటి ఉంది. ఆ ప్రకారం చూస్తే అదంతా శ్రీ కాళీపట్నం రామారావుగారికి వర్తిస్తుంది. ఆయన అనేకమైన చిన్నకథలు రాసేరు. పెద్ద కథలు కూడా రాసేరు. ఆంగ్లంలో స్కెచెస్ అనబడేవి కూడా ఆయన దానిని ఒక విధంగా ప్రత్యేకంగా అలంకరించకుండా ఆయన ఉండలేదు. ఆయన పట్టినదల్లా ‘పాళాబంగారం’ అయింది. అలాగే ఈ ‘యజ్ఞం’ కథ ఒక విధంగా చూస్తే భయంకరమైన బంగారం; మరొక విధంగా చూస్తే మనోహరమైన బంగారం. ఆ విచిత్రం ఆ కథలోని ఇతివృత్తంలోనే ఉంది.
బంగారంతో మనోహరంగా లక్ష్మీదేవి విగ్రహం అయినా చేయవచ్చు. లేదా, ఉగ్రంగా కాళికాదేవి విగ్రహాన్నైనా తయారుచేయవచ్చు. ఏది చేసినప్పటికీ అది బంగారమే అవుతుంది. ఆ విధంగా చేసినందుచేతనే ఈ యజ్ఞం కథని భయంకరమైన బంగారం అని అన్నాను. ఇది చిన్న విగ్రహం కాదు పెద్ద విగ్రహం.
లోగడ శ్రీ ఇంద్రకంటి హనుమచ్ఛాస్త్రిగారు కథానికలు గురించి వ్రాస్తూ “కథానిక అంటే అభినవ సాహిత్య సంసారానికి ఆత్మబంధువైన చిన్న కథకు పురాణ భారత సాహిత్యవేత్తలు పెట్టిన ముద్దుపేరు ” అన్నారు. అయిదు రకాలైన గద్యకావ్యాల్లో ఒకటిగా చెప్పబడిన కథానిక లేక చిన్నకథకి అగ్ని పురాణంలో చెప్పిన లక్షణాలేమిటో కూడా శాస్త్రిగారు ఈ విధంగా వివరించారు.
“1. కథ సుదూరంగా సాగిపోక పొందికగా ఉండాలి.
2. పెద్ద సమాసాలూ వర్ణనలతో కథాశరీరం బిగిసిపోకూడదు.”
ఇవి బాహ్యలక్షణాలు.
అభ్యంతర లక్షణాలు మూడు: “1. పఠితను భయసంభ్రమాశ్చర్యాలలో ముంచే విచిత్ర సంఘటనలుండాలి. 2. కథాగర్భంలో… కరుణ సన్నివేశం కూర్చాలి. 3. పాఠకుడు అనుకోని కొత్త మలుపులతో కథ తమాషాగా ముగిసిపోవాలి. ప్రతికథలోనూ పైన చెప్పిన అన్ని లక్షణాలూ ఉండకపోయినా, ముఖ్యమైనవి కొన్ని ప్రతి కథలోను కనిపిస్తాయి. ”
ఈ విధంగా విచారించి చూస్తే రామారావుగారి యజ్ఞం కథానిక అవుతుందా లేక మరొకవిధమైన ప్రక్రియ అవుతుందా అనే అనుమానం కలుగవచ్చు. కాని, నా ప్రకారం ఇది కథానిక లేక చిన్నకథ మాత్రమే కాగలదు.
ఎందుచేతనంటే, ఇందులోని ఇతివృత్తం చాలా చిన్నదే. కాని ఆ చిన్న వృత్తాంతం బోధపరుచుకోవాలంటే దానికి ముందు జరిగిన కథనంతా చెప్తేగాని అసలా వృత్తాంతం అర్థం కాదు. ప్రతి ఘోరం వెనకా అది అలా జరగడానికి కారణాలు ఎన్నో ఉంటాయి. అన్ని ఘోరాలు జరిగితేనే ఈ ఘోరం జరిగింది అన్నదే ఈ కథ సారాంశం. ఆ కారణాలు చెప్పకపోతే ఈ ఫలితం అర్థం కాదు. అందుచేతనే రామారావుగారు రాసిన యజ్ఞం చిన్న కథా అంటే చిన్న కథే. పెద్ద కథా అంటే పెద్ద కథే. భూమ్మీద బతికే మానవులు భూమికోసం ఏమైనా చేస్తారు. ప్రాథమికంగా, మానవుడు బతకాలంటే భూమి కావాలి. ఆ దాహం యుద్ధాలకి దారితీస్తుంది, కొట్లాటలకి దారితీస్తుంది, లేదా మోసాలకి దారితీస్తుంది. భూమి దాహపు మోసం కథ ఈ కథ. ఇది చదివితే నేడు భారతదేశంలో జరుగుతూ : అన్యాయాలకీ, అక్రమాలకీ గల కారణాలు మనకి స్పష్టంగా సుస్పష్టంగా కనిపిస్తాయి. అందుగురించి ఎందరెందరు అమాయకులు ఏవిధంగా బలయిపోతున్నారో మనకి బోధపడుతుంది.
ఇది తెలుగులో రాసిన కథ. కాని తర్జుమా చేస్తే ప్రపంచంలో ఏ భాషలో ఎవరికైనా బోధపడే కథ. ఎందుచేతనూ అంటే, ఇందులో చెప్పిన న్యాయం లేక అన్యాయం ప్రపంచంలో చాలాచోట్ల జరిగేదే, లేక జరుగుతున్నదే.
తెలుగు కథలో ఒక కొత్త శకం. ఈ కథతో ప్రారంభం అయిందని చెప్పవచ్చు. ఈ కథ రాక మునుపు తెలుగు కథానికా సాహిత్యం వేరు. ఈ కథ వచ్చిన తరువాత తెలుగు కథానికా సాహిత్యం వేరు. జీవితాన్ని లోతుగా తరిచి చూసిన ప్రతిభ ఇందులో కనిపిస్తుంది. అందువల్లనే అనేకమంది ఇతర కథకులని ప్రభావితం చేయగలిగింది ఈ యజ్ఞం కథ. ఇది రాయక ముందు రామారావుగారు చాలా కథలు రాసేరు. అయా ఇతివృత్తాలలో ఈయన ప్రతిభ కొంత కనిపించినప్పటికీ అది ఇందులోని ప్రతిభకి నాంది మాత్రమే. దీని తరువాత రామారావుగారు రాసిన కథలన్నింటిలోనూ ఈ ప్రతిభ ఇంకా ముందుకు సాగిందేకాని తరగలేదు. జీవధార, చావు, కుట్ర వగయిరా ఏ కథ చదివినా మనకి ఇది స్పష్టంగా అవగాహన అవుతుంది.
భారతీయ భాషలో ఏ భాషకైనా వన్నె తెచ్చే కథ ఈ కథ. అది తెలుగులో రావడం తెలుగువారి అదృష్టం. దేవుణ్ని మన దేశంలో కొందరు సింహాసనం మీద కూర్చోబెట్టి పూజిస్తారు. అలాగే కథకులందరూ పూజింపదగిన కథ ఈ ఒక్క ‘యజ్ఞం’ కథ.
9-6-1991
(నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా 1995లో కాళీపట్నం రామారావుగారి యజ్ఞం, తీర్పు, ఆర్తి కథలు హిందీలోకి అనువదించి ఒక సంపుటిగా ప్రచురించింది. యజ్ఞం కథనే దృష్టిలో పెట్టుకుని రావిశాస్త్రిగారు ఈ సంపుటానికి ముందు మాట రాశారు. దీనినే భూమిక పేరుతో హిందీలోకి అనువదించి అచ్చువేసింది – నేషనల్ బుక్ ట్రస్ట్.)
“యుగ సంధ్య”
చిరంజీవి అత్తిలి కృష్ణారావుని నాకు (అతని) చిన్నప్పణ్ణించి తెలుసు. ఇతను నటుడిగా రూపొందడం, మారడం, ఎదగడం అంతా నాకు తెలుసు. కథలు రాయడం ఎలా, అనుభవం సంపాదించడం ఎలా అని ఇతను పడ్డ తాపత్రయం నాకు తెలుసు. పాటలో ఇతని ప్రావీణ్యం, అందుకోసం ఇతను చెవి కోయించుకోడం నాకు బాగా తెలుసు. ప్రఖ్యాత నాటక రచయిత శ్రీ అంగర సూర్యారావుగారు ఇతని బావగారని నాకు తెలుసు. అంతెందుకు గిరిబాబుతో సహా శేషగిరి రావుతో సహా అత్తిలి కృష్ణుడి స్నేహితుల్ని, బంధువుల్ని, తల్లిని, తండ్రిని, పిల్లల్ని, ఇతని ఆటల్ని, పాటల్ని, మాటల్ని, ఇతని సుఖ దుఃఖాలని, ఇతని గురువుల్ని, శిష్యుల్ని అందర్నీ, అన్నిటినీ నాకు చాలా బాగా తెలుసు. అందువల్లనే “యుగసంధ్య”కి ముందుమాట నేను తప్పక చెప్తానని అత్తిలి కృష్ణారావు అనుకున్నాడు. అయితే, ఆ మాట చెప్పడానికి, అందువల్లనే, నేను కొంత మొహమాట పడ్డాను.
అత్తిలివారి చిన్నవాడు ఇంత వాడవడానికి అతనే కాక మరికొంత మంది కారకులున్నారు.
ఇతని తల్లీ తండ్రీ (ముఖ్యంగా తల్లి) ఇతని మీద చాలా ఆశలు పెట్టుకోడం నాకు బాగా తెలుసు. అయితే, ఆది గురువులైన తల్లితండ్రులు కాక బళ్ళో మామూలు గురువులు కాక, ఇతన్లో కళంటే ఆసక్తీ అభిరుచీ జిజ్ఞాసా కలిగించిన వారిలో గురువు లనదగ్గవారిలో శ్రీ అంగర సూర్యారావుగారూ, శ్రీ అనుపోజు లక్ష్మణదాసుగారూ శ్రీవంకమామిడి వాలయ్య పంతులుగారూ, శ్రీ చాగంటి సన్యాసిరాజుగారూ, శ్రీ డి. కృష్ణమూర్తి (డాక్టర్ డిక్కీ) గారూ ముఖ్యులని నాకు తెలుసు. ఇతను నాతో స్నేహంగా మాత్రం ఉంటున్నప్పటికీ నేనితని ఆదిగురువుల వయసువాణ్నీ, గురువుల స్నేహితుడ్ని అవడం వల్ల నేనో గురువుని ఇతనికని కొంత మంది మావూళ్ళో అనుకొంటూ ఉండడం నాకు తెలుసు.
అందుచేత ఇతని ఈ రచన గురించి ఏ మంచి మాట రాసినప్పటికీ అది అభిమానం వల్లను వాత్సల్యంవల్లను రాసేసానని అందరూ అనుకోవచ్చు. అందుచేత మొహమాట పడ్డాను.
అయితే –
“యుగసంధ్య” మంచి నాటికేనని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. ఇటీవల వచ్చిన నాటికల్లో దేనికీ ఇది తీసిపోదని నేను తప్పక చెప్పగలను. వస్తువు ప్రధానమా, శిల్పం ప్రధానమా అంటే మంచి వస్తువుకి మంచి శిల్పం వుంటే మంచి కావ్యం అవుతుందని నేను తలుస్తాను. మంచి బొమ్మల్ని పిండితోనూ చేయవచ్చు, బంగారంతోనూ చేయవచ్చు. కాని సాహిత్యంలో అలా కుదరదు. శిల్పమే కాక వస్తువు కూడా మంచిదవాలి. శిల్పం వల్ల మాత్రమే రాణించే రచన సింగారించుకుంటేనే తప్ప మరోలా బాగుండునని మనిషిలా నాకు కనిపిస్తుంది. దూలాలకి రంగు వెయ్యడం మంచిదే. కాని కర్రలోచేవలేకపోతే రంగు సొగసు దాన్ని నిలబెట్టదు; చేవ వుంటే రంగు లోపం దాన్ని పాడుచెయ్యదు. వస్తువు మంచిదైతే శిల్పం దాన్నికి వన్నె తెస్తుంది. పూర్ణచంద్రుళ్ళో మంచి శిల్పం ఉంది. అయితే శిల్పం కొంత లోపించినా, వంకర చంద్రుడు కూడా నాకు బాగానే ఉంటాడు. గేదెలు గోవులంత అందంగా లేకపోయినా అవి పులుల కంటే చాలా నయమని నేను తలుస్తాను. నమ్ముతాను.
శిల్పం విషయంలో “యుగసంధ్య”కి ఇంకొన్ని నగిషీలు చెక్కి మరికొన్ని రంగులు వెయ్యవచ్చునేమో? నేను చెప్పలేను. ఇతర సెంటిమెంటల్ నాటకాల ప్రభావం దీనిమీద కొంత ఉన్నప్పటికీ ఇందులో చాలా మట్టుకు నిజమూ నిజాయితీ కూడా ఉన్నాయి. నాకు తెలుస్తుంది. నీ తల్లిని వాడు చెరచి చంపితే నువ్వు జాలిగా ఏడుస్తూ కూర్చోడం వేరు; ఏడుస్తూ వెళ్ళి కోపంతో వాణ్ని నరికి చంపడం వేరు.
ఇతర సాహితీ ప్రక్రియల మాట ఏమైనప్పటికీ, నాటకం మాత్రం సమాజానికి పూర్తిగా సంబంధించిన ప్రక్రియ. ఈనాటిక రచించడంలో అత్తిలి కృష్ణారావు సమాజ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొన్నాడనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇతని భావంలో ఉద్రేకం ఉంది, భాషలో బలం ఉంది. భావంలోనూ భాషలోనూ స్పష్టత ఉంది. నాటిక ‘డ్రమెటిగ్గా’ కూడా ఉంది.
ఇటువంటి నాటికలు రాయాలంటే రచయితకి కొంత ధైర్యం ఉండాలి. అత్తిలి కృష్ణుడికి ఆ ధైర్యం కూడా ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. అతణ్ని అభినందిస్తున్నాను. ఈ ముందుమాట రాయడానికి నాకు అవకాశం కలిగినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను.
22-5-1971 (‘యుగ సంధ్య’ – అత్తిలి కృష్ణారావు)
ప్రతి గేయం నెత్తుటి దీపం
బాధలోంచి కవిత్వం వస్తుందని మహాకవి శ్రీశ్రీగారు ఎప్పుడో చెప్పినట్టు నాకు లీలగా గుర్తు. అటువంటి కవిత్వమే నిలిచే కవిత్వం అని నేను తరువాత తెలుసుకున్నాను. అయితే, కొందరికి తిండి ఎక్కువా, పని తక్కువా, తీరుబాటు ఎక్కువా, చదువు చక్కగా ఉన్నందువల్ల వారికి ‘అందాలకవిత్వం’ అందుబాటులో కొస్తుంది. వారు మదన కవులు కావచ్చు. మహాభక్త కవులే కావచ్చు. కాకపోతే వెచ్చని ఎండమీదా, చల్లని మంచుమీదా, పువ్వురంగు మీదా, ప్రియురాలు పైటంచు మీదా పులకరింపు మాటలు చెప్పే మధురాతి మధుర కవులు కావచ్చు. కాని, ఆ కవిత్వంలో ఎందుగురించి ఏ బాధా ఉండకపోతే ఆ కవిత్వం కూడా వుండదు. ఆ కవిత్వం అనవసరం అని నేననను. అవి వాళ్ళకీ వాళ్ళ వాళ్ళకి అవసరం. అందుచేతనే నాకు అనిపిస్తూంటుంది. ఏ జాతి కవిత్వం ఆ జాతికి అవసరం అని. ఉదయం అవగానే మంచి మేకల్ని ప్రసాదించు మహా ప్రభో అని, సవినయంగా చక్కని పద్యాల్లో పెద్దపులి భగవత్ర్పార్ధన సలపవచ్చు. ఆ కవిత్వం మరో జాతికి అనవసరం. ఈ మధ్య పులిజాతి నశించిపోతోందని కొందరు పెద్దలు గోలచేస్తూ ఆ జాతిని నిలబెట్టడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ జాతీ నాకనవసరం.
చెరబండరాజుగారి కవిత్వం, శ్రీశ్రీగారు చెప్పిన చోటులోంచే పుట్టుకొచ్చిందని నాకు స్పష్టంగా తెలుస్తోంది. పెద్ద పండుక్కి భార్యకి చాలినన్ని పట్టుచీరెలు కొనలేకపోయినందుకు వగచే పెద్దమనిషికి ఈ కవిత్వం అనవసరం. పొద్దు పొడుపు కిరణంతో లేచి పట్టెడన్నం పెట్టమ్మా అంటూ పొట్ట చేతపట్టుకుని వచ్చే వారికీ, రెపరెపలాడే పంట పొలాలకు ఎముకలు కొరికే చలిలో గజగజ వొణుకుతూ పోయి పొలాల గట్లను తీసేవారికి మాత్రం ఈ కవిత్వం అవసరం అని నేను తలుస్తున్నాను.
మిత్రులు శ్రీ చెరబండరాజుగార్ని నేను ప్రజకి పరిచయం చెయ్యనవసరం లేదు. వారి కవిత్వం ప్రజలందరికి చేరిపోతుందేమోననే భయంతో, తట్టి లేపుతుందేమోననే బెదురుతో “ప్రభుత్వం” వారే వారిని చెరసాలలో పెట్టి ఆ మూలంగా కూడా ప్రజలందరికీ పరిచయం చేసేరు. చీకటి పనులు చేసేవాడే దీపాలార్పేస్తాడు. ఆర్పలేకపోయినా, అందుగురించి ప్రయత్నం లోటు మాత్రం ఉంచడు. దీపాలు ఎవరు ఆర్పుతారో తెలుసుకునే ప్రజ ఈ వెలుగుని దీవిస్తుందని నేను నమ్ముతాను.
దెబ్బతిన్నవాడే దెబ్బ బాధ తెలుసుకోగలడు. అనాది నుంచి అధికార్ల కాళ్ళ కింద నలిగిపోయిన కర్షక వర్గం చెరబండరాజుగారి వర్గం అని ఈ గేయాలు చదివితే తెలుస్తుంది. వీరికీ ఇటువంటి వారికీ విముక్తి ఎప్పుడో కూడా చెరబండరాజు గారు సూటిగా, స్పష్టంగా ఆవేశంతో అందంగా చెప్పగలిగేరు. అలలు విరిగినట్టు, నీరు పారినట్టు మంట పరిగెత్తినట్టు, చెలరేగిన గాలి సుళ్ళు తిరిగినట్టు ప్రజలు ఎదురు తిరిగి పనిచేస్తేనే వారికి విముక్తి కలుగుతుంది. ప్రజలు ఎదురు తిరగాలి, తిరుగుతారని చెరబండరాజుగారి ఉద్దేశం, నమ్మకం.
ఇందులో ప్రతి గేయం నెత్తుటి దీపం! ఇదంతా పోరాటానికి పిలుపు.
19-4-1972
(చెరబండరాజు ‘ముట్టడి’ కవితా సంపుటికి ముందుమాట)
‘న్యాయం‘
వెనక మాటలు చెప్పడం కంటే ముందుమాటలు చెప్పడం కష్టం. కాని శ్రీ భూషణంగా కథలకి ముందుమాట చెప్పడానికి సంతోషంగా సుఖంగాను కూడా వుంది. ఎందుకంటే కథలు చెప్పడం కొందరికి ఎంత సులభమో కథలు రాయడం కూడా కొందరికి అంత సులభంగానూ వస్తుంది. తప్పుల్ని కప్పిపుచ్చుకొందికో, లేక ఒప్పుల్ని తప్పులు చూపించడానికో, లేకపోతే కేవలం సరదాగా కాలక్షేపం చేసుకోడానికో పెద్ద మనుషుల కథలు చెప్తూంటారు. ఈ విధంగా చెప్పబడే కథలు కోర్టుల్లోనూ, పెద్దవారి క్లబ్బుల్లోనుం పోలీసు స్టేషన్లలోనూ, ఎన్నికల మీటింగుల్లోనూ, ప్రభుత్వపు ఆఫీసులలోనూ వినపడుతూ వుంటాయి.
అదేవిధంగా కథలు రాయడంలో కూడా ఎన్నో మోసాలూ సరదాలూ చేయవచ్చు సరదా కోసం ఎవరైనా కథలు రాసుకొంటే అంత ప్రమాదం ఏమీ లేకపోవచ్చు. అదైనా ఓ విధంగా చూస్తే అసహ్యంగానూ దగాగానూ కనిపిస్తుంది. ప్లేగువ్యాధిలో వూరంతా చస్తూంటే కొందరు పెద్దలు ఊరవతలకి పోయి బూతుకథలు చెప్పుకొంటూ కూర్చున్నారట. అవే “డెకామేరియన్” కథలుగా వెలిసేయని నేను విన్నాను. ఈ విధంగా కథలు చాలా వస్తున్నాయి. ఈ సంఘం యిలా వుండేంత వరకూ అవి అలా వస్తూనే వుంటాయి.
మరో రకం కథలు సంఘంలో కొందరు చేసే దగాల్ని దాచి పెడతాయి. అబద్ధం రంగులు నిజానికి పూస్తాయి. దొంగదార్లే మంచి దార్లన్నట్టుగా ప్రజలకి చెప్పజూస్తాయి. “మనిషి మనిషీ మంచిగా మారితే సంఘం సంఘం అంతా పూర్తిగా మారిపోతుంది. ఆ మంచి మార్పుని ఆదినారాయణుడే ఆఖర్నో మధ్యనో ఎక్కడో ఎప్పుడో తెస్తాడు” అంటూ చెప్పజూసే కథలు మాయ కథలుగా మోసం కథలుగా అమాయకుల్ని చల్లచల్లగా చంపే విషపు కథలుగా కొన్నాళ్ళుంటాయి. ఆ తరువాత పోతాయి.
అయితే, శ్రీ భూషణంగారి కథలు సరదా కథలు కావు. మోసం కథలూ కావు. అవన్నీ నీతి మార్గాన్ని అన్వేషించే కథలు, అవినీతిని ఎత్తిచూపించే కథలు, సంఘాన్ని మంచికి మార్చడానికి ప్రయత్నం చేసే చిన్నవైనా పెద్ద కథలు అంటే మంచి కథలు. అందుకే శ్రీ భూషణంగారు రాసిన కథలకి ముందుమాట రాయడం నాకెంతో సులభం.
4-5-72
(‘న్యాయం’ కథల సంపుటి – భూషణం)
‘అడివంటుకుంది‘
నా పోలికలున్న వాళ్ళంతా నాకు నకిలీలు కారు. బీనాదేవిగారు నాలాగే రాస్తారంటారు. వారు నాకంటే ప్రతిభావంతులు. అలాగే భూషణంగారు కూడాను. అందుకు నేను గర్విస్తున్నాను. వారికీ నాకూ ముఖ్యమైన తేడా ఏమిటంటే; వారికి (ఉభయులకీ) జీవితం గురించి నాకంటే ఎక్కువ విస్తృతంగానూ ఎక్కువ లోతుగానూ తెలుసు. తెలిసిన విషయాలని వారు నాకంటే ఎక్కువ స్పష్టంగా అర్థం చేసుకోగలరు. ఆ విషయం మీరు ఈ మూడు భూషణాల్నీ సరిగా చూసేరంటే మీకు స్పష్టంగా బోధపడగలదు.
ఎండకి ఎండి పుల్లలు ఎక్కువ వేగంగా అంటుకున్నట్టే కూలిపోయిన మనుష్యులు తొందరగా తిరగబడతారని భూషణం గార్లాగే నేను కూడా ఆశిస్తాను.
(‘అడివంటుకుంది’ -భూషణం కథలు, సెప్టెంబరు 1973)
ప్రజాకవి
మానవుల్లో ఎన్ని వర్గాలున్నాయో అన్ని రకాల కవులు కూడా వున్నారు. ఎవరి వర్గానికి వారు రాసుకుంటారు. ఎవరి వర్గ ధర్మాన్ని వారు ప్రచారం చేసుకుంటారు. కాని ఏవర్గం బాగుంటే దేశం అంతా బావుంటుందో ఆ కార్మిక కర్షక వర్గంలోంచి కవులు రావడం, వెలియడం సాహిత్యానికీ, దేశానికి కూడా మంచిది. మిత్రులు శ్రీ కొపనాతి అప్పలస్వామి అభ్యుదయ భావాలతో నిండిన కవిత్వం చెప్పేరు. వేడి భావాలకి తగిన వాడి మాటలతో కవిత్వం చెప్పేరు వీరు ఈవిధంగా ఇంకా ప్రజా సేవ చేయడం మనకి ఎంతో అవసరం.
19-7-’72
(కొపనాతి అప్పలస్వామి ఖండకావ్యం ‘హృదయ స్పందనం’కి ముందుమాట)
దీపం దీపం
కళలో వెలుగే కాకుండా వేడికూడా ఉంది. అందుచేతనే అది ఆనందాన్ని ఇస్తుంది. ఆవేశం పుట్టిస్తుంది. ఆవేశం కలిగితే అది కార్యసాధనకి దారి తీస్తుంది. సత్కళలైతే అవి సత్కార్యాలకి దారి చూపుతాయి- అని నేను తలుస్తాను.
అందుచేత,
పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మగారిని ఉషాకుమారిగా చూసిన శ్రీ కొపనాతి అప్పలస్వామిగారి రసావేశం గురించి కాని ‘రస సంవేదన’ గురించి కాని ఆశ్చర్యపడకుండా ఆనందిస్తున్నాను. ఇందులో ఎంతో వేదన ఉంది. కవిత్వ మొక తీరని దాహం అని గురువులు శ్రీశ్రీగారన్నారు. అలా ఇందులో ఆరని దేదో అటువంటి ఉంది.
శ్రీకొపనాతి అప్పలస్వామిగారి మంచి హృదయం వేదాంతానికి వెళ్ళింది; మంచి ఋక్కులు పలికింది.
10-8-1973
(‘రస సంవేదన’ – కావ్యం కొపనాతి అప్పలస్వామి)
నాంది
ఈ దిగువని వివరించిన దృశ్యకావ్యాలు నాకు చేరేయి.
నాంది : రచయిత – గంగిరెడ్డి
సంఘర్షణ: రచయిత – చెరబండరాజు
సత్యం: రచయిత – ఉదయకిరణ్
కూలినాయకుడు :రచయిత – కస్తూరి రంగారావు
విముక్తికై నడు : రచయిత – తేజోనిధి
1. వీటినన్నింటినీ నేను చదివేను. వీటిలో నాకు గంగిరెడ్డిగారి “నాంది” కాక మిగతావి బాగున్నాయి. గంగిరెడ్డిగారి “నాంది” చాలా బాగుంది.
2. దృశ్యకావ్యాలు రాయడం కష్టం: రాయగలిగిన వారికి చాలా సులభం. నాటకం రాయడానికి (అంటే బాగా రాయడానికి) ఎవరికైనా, ఏ శక్తియుక్తులు ఉండాలో నాకు తెలీదు. కాని, బాగా రాయగలగడానికి ఎవరికైనా సరే జీవితాన్ని బాగా తెలిసి వుండాలని నేను తలుస్తాను. గంగిరెడ్డిగారి “నాంది”లో జీవితాన్ని క్షుణ్ణంగా తెలిసినవారి “అధికార ” ముద్ర వుంది. అదాయన చాలా సీరియస్ నూ, ఈజీగానూ, నిజాయితీగానూ రాసేరు.
3. గేయాల్లోనూ కథల్లోనూ పాత చెడ్డనీ కొత్త చెడ్డనీ కూడా ఛేదించి భేదించి కవులూ కథకులూ మన ముందుకు దూసుకు వచ్చేరు. దృశ్య కావ్యానికి సంబంధించి నంత మట్టుకు గంగిరెడ్డిగారు కొత్త నీతికి నాంది పలుకుతూ కొమ్ము విసిరి కొమ్ము కాయడానికి ముందుకొచ్చిన వారిలో ముఖ్యులని నేను భావిస్తున్నాను; అతని గురించి నేను గర్విస్తున్నాను. గంగిరెడ్డిగారు ఓ కొత్త తరహా గురజాడని తనలోంచి వెలికి తీస్తున్నారు.
2-10-1972
(హైదరాబాద్ లో విరసం రెండవ మహాసభ 28-9-71న జరిగింది. విప్లవాత్మకమైన నాటకాలు రాసి ఉపాధ్యక్షుడు రావిశాస్త్రికి పంపమని విరసం సూచన చేసింది. అలా వచ్చిన వాటిలో ఉత్తమమైనదిగా ‘నాంది’ని ఎంపిక చేశారు.)
ఖండకృతులకి ముందు మాటలు
మిత్రులు, డాక్టర్ మోడేకుర్తి వెంకట సత్యనారాయణగారు సత్యశీలురూ సాధువర్తనులూను. అంతేకాదు వారెంతో అమాయకులు. వారి ఖండకృతులు చదివితే వారి మంచితనం, వారి అమాయకత్వం మనకి బాగా తెలుస్తాయి.
మంచి అమాయకులంతా సమాజంలోని చెడ్డని చూసి వాపోతారు. బక్క మనుషుల్ని చూసి బాధపడతారు; ఇందులోని కన్నెపడుచులాంటి వారికోసం కన్నీరు విడుస్తారు; ఇందులోని యువతి వంటి వారంతా ఏదో విధంగా మంచిదారికి మళ్ళితే బావుంటుందనుకుంటారు. సంఘ సంస్కరణ ద్వారా వర్ణాలన్నీ కల్లకల్ల కల్లలవాలనుకుంటారు; అందర్నీ కాపాడమని ఏడుకొండలస్వామిని వేడుకుంటారు; దేశాన్ని ప్రేమిస్తారు; జాతిని నమ్మేస్తారు; అందరి సుఖం ఆశిస్తారు; పసిపిల్లల్తో కలసిపోతారు; అచ్చంగా పిల్లల్లాగే ఉంటారు.
డాక్టర్ మోడేకుర్తి వారి ఖండకృతులు వారి మంచితనాన్ని అమాయకత్వాన్నీ ఆవేదననీ మనకి తెలియచేస్తాయి. కొంతకాలం పోతే-
ఊరి బావులతోపాటు పావన గోదావరుల్ని కూడా అందరికీ అందజేసి సమానంగా పంచడానికీ, అబలల్ని కాపాడ్డానికీ, ‘రామరాజ్యం’ నిర్మించడానికీ బక్కమానిసిలాంటి వాళ్ళూ కన్నెపడుచులాంటి వాళ్ళూ కత్తులు పట్టుకు ముందుకు ఉరికిననాడే అమాయకపు కవుల కలలన్నీ నిజమవగలవని డాక్టర్ మోడేకుర్తివారు తెలుసుకుంటారు.
23-11-72 (ఈ పుస్తకం అముద్రితం)
పరిచయం
శ్రీ అలంక బాబూరావుగారి “ఓ ముల్కీ-నాన్ ముల్కీ” నేను చదవలేదు. అదే నన్ను చదివించింది. ఎందుచేతనంటే అందులో నాకు అర్థం అయ్యే ఆవేదన ఉంది.
జరగకూడనిది దేదైనా జరక్క తప్పనప్పుడు అది ట్రాజెడీ అవుతుందంటారు. ఆంధ్ర రాష్ట్ర విభజన తప్పనప్పుడు అది చాలా మందికి ట్రాజెడీగా తోచవచ్చును. ఆ చాలామందిలో బాబురావుగారొకరు. సాధారణ జనం యెడల అభిమానం ఉన్నవాళ్ళందరికీ కూడా బాబురావుగారి ఆవేదన చూస్తే ఆవేదన తప్పక కలుగుతుంది. బాబూరావుగారికి జనం అంటే ఆదరణా, అభిమానమో దొంగలంటే “ప్రత్యేక బ్రాండైనా సరే, సమైక్య బ్రాండైనాసరే” అంత కోపమూ, కావేషీ ఉన్నాయి.
అలా ఉండడం సన్మార్గులకి సహజమేకదా మరి.
20-3-72
దీపాలు
మనకి మంచి కథలు రాసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంచి కథలు రాస్తున్నారు. అయితే, మాయగాళ్ళు, మోసగాళ్ళు, దుర్మార్గులూ – అంటే ప్రజల్ని పీడించే వాళ్ళు – ఎన్ని మంచి కథలు చదివినా మంచికి మారరు. వెంకటేశ్వరస్వామిని వేలి ఉంగరంలో దాచుకు పూజించే పోలీసు ఆఫీసర్లు నక్సలైట్లని చిత్రహింసలు పెట్టడం నాకు బాగా తెలుసు, వేదాలు చదివిన పులులు మేకల్ని తినడం మానవు. దైవభక్తి- దైవభక్తే. రక్తదాహం రక్తదాహమే.
అయితే…
అమాయకులైన వాళ్ళు విప్లవ రచయితల కథల్నిగాని, అటువంటి మంచి రచనల్ని చదివితే వాళ్ళకి పాలకజాతి మాయా, మోసం, పాపం తెలుస్తుంది. కాని, మనదేశంలో అమాయకులకి అక్షర జ్ఞానంలేదు.
సినిమాలకైతే అక్షరజ్ఞానంలేని అమాయకులకి అసలు దారులు చూపించే శక్తుంది. కాని, మనదేశంలో సినీశక్తి పెద్దపులిశక్తిగా వుంది గాని పేద జనశక్తిగా లేదు. అందుచేత జనానికి ఇటువంటి దృశ్యకావ్యాలే శరణ్యం.
ఒక దీపం వెలిగిందంటే చాలా సంతోషం. ఇందులో మరో దీపం కూడా ఉంది. శ్రీ కాశీవిశ్వనాథం గారు వెలిగించే దీపాలవంటి దీపాలు వెలుగు సాహిత్యాకాశంలో చాలా వెలగాలని నేను కోరతాను. చీకట్లో వున్నవాళ్ళు ఎలా ఉండలేకుండా ఉన్నారో తెలియడానికి ఇవి చాలా ఉపయోగిస్తాయి. అయితే అలా చూపించడంతోనే ఆగిపోక మిత్రులు శ్రీ కాశీవిశ్వనాథంగారు చీకట్లో ఉన్నవాళ్ళు ఏం చేసి వెల్తురు సంపాదించుకోగలరో కూడా సూచించినట్టుగా నాకు బోధపడుతోంది.
గాంధీగారు చేపాటి కర్రని తనకి వూతగా మాత్రం తీసుకున్నారు. జనం దాన్ని తమ ఆయుధంగా తీసుకోగలిగితే వాళ్ళు గొలుసులు తెంపుకునే కార్యక్రమంలోకి దిగగలరు. కాదు – ఎక్కగలరు.
రాజకీయాధికారం తుపాకీ గొట్టాల్లోంచి ప్రజ్వరిల్లేముదు బాణాకర్రల్లోంచి బయల్దేరవచ్చు.
కాశీ విశ్వనాథంగారి దీపం, కాశీవిశ్వనాథంగారు వెలిగించుకున్నట్టే జనం తమ దీపాలు తామే వెలిగించుకుంటారు. అవి శతకోటి దీపాలవుతాయి. అవి పెనుమంటలుగా మారుతాయి. పాపాన్ని దహిస్తాయి.
మంటలు చల్లారేక మంచి వర్షాలు కురుస్తాయి.
29-3-74
(కాశీ విశ్వనాథం ‘ఒక దీపం వెలిగింది’ (రెండు నాటికలు) కి వెనుక మాట.)
పోరాటపు మాట
ఈ నాటిక చదివితే, చూస్తే శ్రీ మానేపల్లి ప్రజల మనిషని తెలుస్తుంది. ఈ రోజుల్లో మధ్యతరగతి మనుష్యులు ప్రజల మనుష్యులుగా ఉండాలో ప్రజాద్రోహుల మనుష్యులుగా ఉండాలో నిర్ణయించుకోవలసిన అవసరం ఉంది. అటూ ఇటూ కూడా ఉండాలని కొందరు అలా ఉండడానికి నాటకాలాడొచ్చు. ఆ నాటకాలు అట్టే రోజులు ఆడ్డానికి కుదరదు. ఈ సమయంలో శ్రీ మానేపల్లి ప్రజల మనిషిగా ఉండడానికి నిశ్చయించుకోవడం ప్రజలకి సంతోషకారణం.
మధ్యతరగతి మేధావుల్ని బెదిరించి ప్రజల్ని నిరాయుధుల్ని చేసి దోచుకు బతుకుతోంది యీ ప్రభుత్వం. ఆయుధాలన్నింటినీ చేజిక్కించుకొంది యీ ప్రభుత్వం. నీరు కూడా దొరకని ప్రజల నెత్తుర్ని మంచినీళ్ళు చేసి తాగినట్టు తాగుతూంది ఈ గుత్తాధిపతుల ప్రభుత్వం. వారితో ఎలా పోరాడాలో ఈ ప్రజల మనిషి స్పష్టంగా చెప్తున్నాడు.
11-5-74
(‘ప్రజల మనిషి’ – మానేపల్లి సత్యనారాయణ)
“వి. ర. సం”
విప్లవ రచయితల సంఘం తెలుగు సాహిత్యం మీదికి దాడి చెయ్యక ముంద … అంటే విశాఖ రచయితల సంఘం అని ఒక్క అర్థం మాత్రం ఉండేది. విశాఖ రచయితల సంఘంలోని కొందరు విప్లవ రచయితల సంఘంలో కూడా సభ్యులుగా చేరిన తరవాత ఈ మా విశాఖ రచయితల సంఘంలోంచి కొంతమంది కొత్త సభ్యుల పాత సభ్యులూ కూడా విడిపోవడం సంభవించింది. మంచిచెడ్డల కలయికలోంచి మంచి విడిపోయిందా చెడ్డ విడిపోయిందా అంటే జనం జవాబు చెప్పవలసి వుంటుంది. ఏదేమైనా మేం చాలా మందిమి విశాఖ రచయితల సంఘాన్ని విడిచి వెళ్ళిపోడానికి ఇష్టపడలేదు.
నేను అజ్ఞాత రచయితగా ఉన్న రోజుల్లో కథాంజలి పత్రికా సంస్థవారు ఒక ‘కథాంజలి’ సంచికని విశాఖ రచయితల ప్రత్యేక సంచికగా ప్రచురించేరు. అది 1950 సంవత్సరానికి ముందని అనుకుంటారు. అంతకు ముందు, అంగర సూర్యారావు, కాళీపట్నం రామారావు, తిత్తి జనార్ధనరావు, పురాణం సుబ్రమణ్య శర్మ, బలివాడ కాంతారావు, మసూనా, జగన్నాథ్ వగైరాల కథలూ వ్యాసాలూ నేను ఎన్నెన్నో చూస్తూండేవాణ్ని, కొన్ని కొన్నింటిని చదువుతూండేవాణ్ని. కథాంజలి ప్రత్యేక సంచిక ద్వారా వారంతా విశాఖ వారని తెలిసే సరికి నేను విశాఖలో ఉండికూడా వారిలో ఎవర్నీ తెలుసుకోలేకపోయినందుకు చింతించేను. వారంతా విశాఖలోనే ఉన్నందుకు గర్వించేను. వారేకాదు మా గురువులు శ్రీ అబ్బూరి రామకృష్ణరావుగారు, గురుతుల్యులు (కీ॥శే॥) మల్లంపల్లి సోమశేఖర శర్మగారు, గురుసమానులు డాక్టర్ భద్రిరాజు కృష్ణమూర్తిగారు కూడా మా విశాఖ రచయితల సంఘంలో సభ్యులుగా ఉండేవారని చెప్పుకొందికి మా సంఘం గర్విస్తుంది. అదే విధంగా మా సంఘానికి రచయిత్రి రంగనాయకమ్మగారు సభ్యులుగా ఉండి శోభ తెచ్చారు. కళాప్రపూర్ణ శ్రీ పురిపండా అప్పలస్వామిగారు అప్పుడూ ఇప్పుడూ ఎప్పటికీ మా సభ్యులే. పోతే, మహాకవి శ్రీశ్రీ గారు మా సంఘంలో సభ్యులైనా కాకపోయినా అయినట్టే లెక్క మరింక బీనాదేవిగారు కూడా అంతే. డాక్టర్ శ్రీ తూమాటి దొణప్పగారు మా సంఘానికి మంచి దారి చూపించే చక్కని వెలుగు. కొత్తనీరొచ్చి పాతనీటిని కొట్టేస్తుందంటారు
అయితే-
విశాఖ రచయితల సంఘంలో పాత రచయితల్ని కొత్త రచయితలు కొట్టేయరు. ఇది
పాతకొత్తల మేలు కలయిక,
పాతవారు ఇంకా కొత్తకొత్తగా ఉండడం మంచిదే, కాని, మాలో కొన్ని కొత్త దీపాలు ఆరిపోయి మమ్మల్ని కన్నీటితో ముంచాయి. మా సంఘం తెలుగు సాహిత్యానికి ఏం సేవ చేసిందో కాలం తెలియచెప్పాలి. కాని శ్రీ రంగం రాజేశ్వరరావూ ఎన్.ఎస్. ప్రకాశరావు మాకు మిగిలి వుంటే తెలుగు సాహిత్య రంగంలో మరికొన్ని వందల కథానికలు మండే మాణిక్యాలుగా అమరజ్యోతులుగా మిగిలి ఉండేవని మేం తలుస్తున్నాం, ఈ కథలు సంపుటిని వారిరువురికి అంకితం ఇస్తున్నాం. ఈ సంపుటిని ప్రచురించి వారిరువురికి అంకితం ఇచ్చే అవకాశం మాకు కల్పించినందుకు శ్రీ ఎమెస్కో సంస్థవారికి
ధన్యవాదాలర్పిస్తున్నాం.
రాచకొండ విశ్వనాథశాస్త్రి
విశాఖపట్నం-2, 21-2-1974.
(‘విశాఖ కథలు’ విశాఖ రచయితల సంఘం. ఎప్పటికీ అచ్చుకాకుండా కాలగర్భంలో
కలిసిపోయిన పుస్తకం ఇది.)
వంగపండు విప్లవ ప్రసాద్
రాజకీయాల్లో విప్లవం వచ్చేముందు సాహిత్యంలో విప్లవం రావడం చాలా దేశాల్లో చాలా సార్లు జరగడం వల్ల అది సహజంగా జరుగుతూందని కూడా నేను తలుస్తున్నాను. ఈ పోరాటపు ఏరువాక పాటలు చదివితే నాకది స్పష్టంగా తెలుస్తూంది కూడాను.
సాహిత్యం పెద్దల ప్రైవేటు ఆస్తిగా ఎల్లకాలం ఉండిపోదు. అలా ఉండిపోవాలని శతాబ్దాలుగా తెలుగు పెద్దలు చేసిన ప్రయత్నాలమీద పెద్దదాడి చేసిన వారు స్వర్గీయ గిడుగు రామమూర్తిగారు. ఆ గిడుగు పిడుగు కూడా కోట కూల్చినపుడు శిష్టులే అందులో ప్రవేశిస్తారనుకున్నారు. కాని అది జరగదు. శిష్టుల కంటే జనులే విశిష్టులు. శిష్టులొక్కరే కోట గోడలు కూల్చలేరు. జనం ఆ గోడల్ని కూలుస్తారు. ఆ స్వేచ్ఛని అందరూ అనుభవిస్తారు.
వంగపండు ప్రసాద్ గారు ఏం చదువుకున్నారో నాకు తెలియదు. కాని జీవితాన్ని ఈయన బాగా చదువుకున్నారని ఈ పాటలు చదివితే, వింటే స్పష్టంగా తెలుస్తుంది. జనసామాన్యంలోంచి వచ్చేరు కాబట్టి ఈయనకి జనం కష్టాలు తెలుసు. అంతేకాదు. ఆ కష్టాలు ఎందువల్ల వచ్చాయో కూడా ఈయనకి పూర్తిగా తెలుసు. ఆ కష్టాలకి ఏది విరుగుడో కూడా ఈయనకి బాగా తెలుసు. అందుకే ఈయన పాటలు నీరు పల్లంలోకి దిగినట్టు జనంలోకి దిగుతున్నాయి. తీగెలోకి విద్యుచ్ఛక్తి ప్రవహించినట్టు జనంలోకి ప్రవహిస్తున్నాయి. ఆ విషయం నీకెలా తెలుసునంటే నేను కళ్ళారా చూసేను నేను కూడా అనుభవించేను కాబట్టి చెప్పగలుగుతున్నాను.
20-10-74
(వంగపండు ప్రసాదరావు ‘ఏరువాక’ (పోరాటపాటలు) ముందుమాట)
(వంగపండు ప్రసాదరావు విశాఖపట్నం హిందుస్థాన్ షిప్ యార్డులో కార్మికుడు. రావిశాస్త్రి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఈ ‘ఏరువాక’ ని శ్రీశ్రీ ఆవిష్కరించారు. “కథ కుంటుతుంది, నవల నడుస్తుంది, పాట పరిగెడుతుంది” అన్నారు రావిశాస్త్రి.)
దోపిడీ వర్గాల పులిపంజా కిందనలిగే జనం ఆ పులి పంజా మీదికి తమ నిప్పుల పంజా విసిరితేనే విమోచన మార్గం కలుగుతుందని ఈ నాటకం రుజువు చేస్తుంది.
‘పంజా‘కి జవాబు
ఈ రచయిత వయసెంతో నాకు తెలియదు. కాని ఈయనకి ప్రస్తుతం పెద్దలు ఎన్నికల పేరుతో కులం, మతం పేరిటో ఏదో పేరిట జరిపించే నాటకాలన్నీ బాగా తెలిసిపోయేయని ఈ నాటకం వల్ల తెలుస్తోంది. జనాన్ని దోచుకునే అవకాశాల కోసం పెద్దలు ఎలా జగడాలాడుకుంటారో, ఆ జగడాలు మొదలుకే ముప్పు రానీయకుండా మరలా ఎలా సమాధాన పడుతుంటారో, యువతరాన్ని ఏ మాయ మాటల ద్వారా ఏ దొంగ చేష్టల ద్వారా ఎలా చీలదీయ ప్రయత్నిస్తారో అన్ని విషయాలూ కూడా ఈ నాటిక చదివితే సుస్పష్టంగా తెలుస్తాయి.
ఎవరిది హింసో, ఎవరిది ప్రతిహింసో ఈ నాటిక ద్వారా అందరికీ అర్థం అవుతుంది. మేకలు తిరగబడితే “హింస హింస” అని అరిచే దొంగపులుల మోసం ఈ నాటకం ద్వారా మనకి తెలిసిపోతుంది. పెద్దల కుట్ర ఏమిటో దాన్ని ఛటాఫట్ చెయ్యడానికి సరైన మార్గం ఏమిటో ఈ నాటకం సూటిగా చూపెడుతుంది. ఇది చక్కని నాటకం. సంభాషణలు చాలా మట్టుకు బాగున్నాయి. విప్లవ వాదుల సంభాషణల గురించి ఇంకొంచెం శ్రద్ధ వహించి వున్నట్లయితే బాగుండేదేమోనని మాత్రం నాకనిపించింది.
4-1-1975
(చీరాల గిరి ‘పంజా’ నాటకానికి ముందుమాట. ఎమర్జన్సీలో పుస్తకాల షాపుల మీద దాడిచేసి ఈ ప్రతులెత్తుకు పోయారు పోలీసులు.)
మంచి కథలకి ముందు మాట
పరిచయ వాక్యాలు రాయడంలో నాకు అంతగా పరిచయం లేదు. కాని శ్రీమతి . విజయలక్ష్మిగారు పాఠకలోకానికి చిరపరిచితులే కాబట్టి వారు ఫలానా ఫలానా అని వారిని నేను ప్రత్యేకంగా పాఠకులకి పరిచయం చెయ్యవలసిన అవసరం లేదు. వారు వైద్యులుగానే కాకుండా రచయిత్రిగా కూడా బాధ్యతాయుతంగా ఉంటారనేది ఇందులోని కథలు చదివితే తెలుస్తుంది.
కథలు రచించిన వారు ఆడవారైతే వారు రచించిన కథల్ని ఆడ కథలనీ, మగవారైతే మగ కథలనీ అంటూ, లోకంలో ఆడా మగా ఉన్నట్టే కథల్లో కూడా ఆ భేదం ఉన్నట్టుగా కొందరు ఈ మధ్య వ్యవహరిస్తున్నారు. కాని నిజానికి కథల్లో ఆ భేదాలు లేవు. కథలకి సెక్సుండదు.
కాని మానవ జీవితంలో సెక్సుల మధ్య పోరాటం జరుగుతోందని మానవ జీవితాన్ని నిశితంగా పరిశీలించేవారికి తెలుస్తుంది. మరింక, కథకులు – ఆడవారైనా సరే మగవారైనా సరే – జీవితాన్ని నిశితంగా పరిశీలించవలసి వుంటుంది. ఎందుచేతనంటే అన్ని కథలూ జీవితంలోంచే పుడతాయి. అవన్నీ మానవ జీవితంలోనే బతుకుతాయి.
మిగతా దేశాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు కాని మన దేశంలో మాత్రం ఆడదాని కష్టాన్ని మగవాడు దోచుకుంటున్నాడని చాలా మందికి తెలిసినట్టే నాక్కూడా కొంత కొంతగా తెలుసు. ఎందుచేతా అంటే – బాధపడేది వారే కాబట్టి, బాధల గురించి వారికి బాగా తెలుస్తుంది కాబట్టి, ఆడవారు ఈమధ్య వాటి గురించి బాగా సులభంగా కథలు రాయగలుగుతున్నారు. అందుకే వారు రాసిన కథలు బాగా ప్రజాదరణ పొందుతున్నాయి.
స్త్రీ పురుషుల మధ్య జరిగే ఈ సంఘర్షణ గురించి శ్రీమతి విజయలక్ష్మిగారికి స్పష్టమైన అవగాహన ఉన్నదనే విషయం ఈ కథలు చదివితే తెలుస్తుంది. వైజయంతి లాంటి వ్యక్తుల గురించి పూర్తి వివరాలు శ్రీమతి విజయలక్ష్మి గారికి తెలిసినా తెలియకపోయినా “ప్రేమలేఖా?” అనే కథలోనూ, నువ్వూ + నీ ఎమ్మెస్ వెరసి నీ ఖరీదెంత?” అనే మరోకథలోనూ చిత్రించిన జీవితం గురించి వారికి బాగా తెలుసునని ఆ కథలు చదివితే స్పష్టంగా తెలుస్తుంది. ఆ రెండు కథలు కూడా ఈ పుస్తకానికి వెండి బంగారాల్లాంటివని నేను అభిప్రాయ పడుతున్నాను. ఆడదాని జీవితాన్ని మగవారు ఎంత తేలిగ్గా తీసుకోగలరో ఆ కథలు చదివితే తెలుస్తుంది.
శ్రీమతి విజయలక్ష్మిగారు వైద్యంలో పెద్దవారైనా వయసులో ఇంకా చిన్నవారే. చిన్నవారే అయినా బాధ్యతలెరిగిన వారేనని ముందే చెప్పేను. జీవితాన్ని పరిశీలించడానికి ఆమెకు అవకాశాలున్నాయి. వారి వద్ద నించి ఇంకా మంచి కథలూ, ఇంతకంటే మంచి కథలు రావడానికి మనకి అవకాశం ఉంది.
19-5-1974
. (డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి ‘మీరు ప్రేమించలేరు’ కథల సంపుటికి ముందుమాట)
‘వికసించిన విద్యుద్గీతం’
అడవిలాంటి జీవితంలో మీ మీద (ఈ జంటకవులు చెప్పినట్టు) “ప్రతి నిమిషం నిప్పుల వర్షం” కురుస్తూంటే, మీలోంచి కూడా ఎప్పుడో ఒకప్పుడు ఇటువంటి విద్యుద్గీతం వికసించి విజృంభించక మానదు.
అయితే –
విజృంభించే ముందు, ఎటు విజృంభించడం ఎందుకు విజృంభించడం అని తెలుసుకోలేకపోతే ఆ విజృంభణ కార్యక్రమం అంతా విఫలం అయిపోయే ప్రమాదం ఉంది. లేదా అనవసరపు ఫలితాలికి దారితీసే ప్రమాదమైనా ఉంది. వేగిపోయే విద్యార్థులు ఎవరు ఎందుకు తమని వేచుతున్నారో తెలుసుకోలేక, వీధిలో బస్సుల్ని మాత్రం తగలబెట్టినట్టు, వారవనితల్ని పెంచే మాయదారి మగలోకం మీద కోపం మాత్రం తెచ్చుకున్న వీరవనితలు చీరలూ రవికలూ చింపేసుకున్నట్లు, కారణాలూ గమ్యాలు తెలియని కవిత్వం – విప్లవం అంటే ఇదే, ఇంతే అనుకొని చచ్చిన పాత పద్యాన్ని మరోసారి చంపడంతోనో బహిరంగంగా బట్టలు మాత్రం విప్పేసు కోడంతోనో సరిపెట్టుకోవచ్చు.
కాని –
బీదవాడికి ఆకలెందుకు తీరదో, పేదరాలికి కోకలెందుకు ఉండవో, కూలివాడికి కష్టమెందుకు దక్కదో ఈ జంటకవులకి బాగా తెలుసు. అతనికది తీరాలి. ఆమెకవి ఉండాలి, ఇతనికది దక్కాలి అంటే వారంతా కలిసి ఏం చెయ్యాలో కూడా ఈ జంటకవులకీ బాగా తెలుసు.
ఇందులోని, “ఆదర్శగ్రామం” చదివేక, యాభయ్యేళ్ళక్రితం నా చిన్నతనం లోని గ్రామాలకి అది భిన్నంగా లేదని నేను తెలుసుకున్నాను. గ్రామాల్లోని అడుగున ఉన్నజనం అయిదువందల సంవత్సరాల నుంచీ కూడా అటువంటి దుస్థితిలోనే వుంటూ వస్తున్నారని చరిత్రలోని అక్కడక్కడి ఆధారాలవల్ల మనకి తప్పక తెలుస్తోంది.
అందుచేత .
జనంలో వేడి ఎలానూ ఉండి తీరుతుంది. అయితే, వారికి ఇటువంటి వెలుగులూ రవ్వలూ కూడా దొరికిననాడు మంచి లోకంలోకి ఏవిధంగా ఎలా వెళ్ళడమో వారికి బాగా తెలిసి ఆ విధంగా వారు అటు వెళ్ళగలరని అనుకొందికి మనకి కొంత ఆధారం ఉంటుంది. ఆశయితేఅయితే ఎలానూ ఉంటుంది.
ఈ జంటకవులు ఉరిమి ఊరుకోకుండా, మెరిసి మాయమయి పోకుండా వారు తల్చుకున్న మంచి మార్గాలు నిర్మించడానికీ, తెరిపిస్తామన్న ద్వారాల్ని తెరిపించడానికీ ఇంకా ఇంకా కృషి చేస్తారని ఆశిస్తున్నాను.
1-1-1979
(‘వికసించిన విద్యుద్గీతం’ బి.ఎన్. స్వామి, బి.పి. శాస్త్రిల కవితా సంపుటికి ముందుమాట)
